Begin typing your search above and press return to search.

సర్కారు సంచలనం.. ఇళ్ల నిర్మాణాలకు బ్రేక్

By:  Tupaki Desk   |   28 Jun 2019 4:52 PM IST
సర్కారు సంచలనం.. ఇళ్ల నిర్మాణాలకు బ్రేక్
X
తమిళనాడు రాజధాని చెన్నై నీటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. నీటి కోసం అష్టకష్టాలు పడుతున్న చెన్నై నీటి కష్టాలు ఇప్పుడు కర్ణాటక రాజధాని బెంగళూరు వాసులకు కూడా దాపురించాయి. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ సిటీ అయిన బెంగళూరులో ఆపార్ట్ మెంట్లు పెరిగిపోయాయి. ఇబ్బడి ముబ్బడిగా కనీసం నీటి వసతి లేకుండా ఆపార్ట్ మెంట్స్ కట్టేసి అమ్మేస్తుండడంతో ప్రజలు నీరు లేక నీటి ట్యాంకర్ల మీద ఆధారపడిపోతున్నారు. అవి కలుషితమై రోగాల బారిన పడుతున్నారు.

బెంగళూరులోని అపార్టమెంట్లన్నీ ఇప్పుడు నీటి కొరతతో సతమతమవుతున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేందుకు నిర్ణయించినట్టు సమాచారం. ఐదేళ్ల వరకు బెంగళూరులో అపార్ట్ మెంట్ల నిర్మాణాలపై నిషేధం విధించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతోందట.. ఈ మేరకు డిప్యూటీ సీఎం పరమేశ్వర గురువారం ఈ విషయాన్ని వెల్లడించి సంచలనం రేపారు. త్వరలోనే అపార్టమెంట్ల నిషేధంపై ఉన్నతాధికారులు సమావేశమై ఓ నిర్ణయానికి రానున్నట్టు తెలిపారు.

బెంగళూరులో ఇప్పుడు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. కావేరి జలాలు అయిపోవడంతో బెంగళూరుకు 400 కి.మీల దూరంలోని శివమొగ్గ డ్యాం నుంచి నీటిని తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్నుంచి నీటిని తెప్పించేందుకు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేస్తున్నారు. అందుకే ఈ ఐదేళ్లలో ఆ ప్రాజెక్ట్ పూర్తి.. అపార్ట్ మెంట్ల నిర్మాణాలకు బ్రేక్ వేసి బెంగళూరు నీటికష్టాలు తీర్చాలని కర్ణాటక సర్కార్ ప్లాన్ చేస్తోంది.