Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఎఫెక్ట్‌... ఏపీ నేత‌ల‌కు మంచి చాన్స్ వ‌చ్చింది

By:  Tupaki Desk   |   2 Feb 2022 1:30 PM GMT
కేసీఆర్ ఎఫెక్ట్‌... ఏపీ నేత‌ల‌కు మంచి చాన్స్ వ‌చ్చింది
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విలేక‌రుల స‌మావేశం అంటే, ఆయ‌న పార్టీకి చెందిన నేత‌లు ఎంత అల‌ర్ట్‌గా ఉంటారో... ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌లు సైతం అదే రీతిలో చెవులు రిక్కించి వింటార‌న్న‌ది... రాజ‌కీయాల గురించి క‌నీస ప‌రిజ్ఞానం వారెవ్వ‌రైనా చెప్పే మాట‌.

అలాంటి చాణ‌క్యం, మాట తీరు కేసీఆర్ కే చెందింది కాబ‌ట్టి. ఇక తాజాగా ఆయన దాదాపు రెండున్న‌ర గంట‌ల పాటు నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశం అయితే ఓ రేంజ్‌లో క‌ల‌క‌లం సృష్టించింది. ముఖ్యంగా రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచ‌ల‌నంగా మారాయి. దీనిపై తెలంగాణ‌లోని నేత‌లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే, ఆస‌క్తిక‌రంగా ఏపీకి చెందిన నేత‌లు, అందులోనూ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు రియాక్ట‌వుతున్నారు.

దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి అని కేసీఆర్ విలేక‌రుల స‌మావేశంలో చేసిన కామెంట్ల‌పై టీడీపీ నేత‌, మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ అలా మాట్లాడటం ‎రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ అంబేద్కర్ తో పాటు దేశ ప్రజలను అవమానించటమేన‌ని జ‌వ‌హ‌ర్ ఆరోపించారు.

దేశంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకనుగుణంగా నాడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్న జ‌వ‌హ‌ర్ 75 ఏళ్ల నుంచి ప్రజల హక్కుల్ని, స్వేచ్చను కాపాడుతూ వస్తున్న రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. కేసీఆర్ వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‎ వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎందుకు ఖండించలేదని జ‌వ‌హ‌ర్ ప్ర‌శ్నించారు. జగన్ రెడ్డి కూడా కేసీఆర్ వ్యాఖ్యల్ని సమర్ధిస్తున్నారా? అంటూ అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. దేశంలో రాజ్యాంగాన్ని మారిస్తే..ఏపీలో చట్టబద్దంగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసుకోవచ్చని జగన్ భావిస్తున్నారా? అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ మౌనంగా ఉండ‌టం సరికాద‌ని వ్యాఖ్యానించిన కేఎస్ జ‌వ‌హ‌ర్‌ కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. కె.ఎస్. జవహర్ కామెంట్ల‌పై అధికార వైసీపీ నేత‌లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మ‌రి.