Begin typing your search above and press return to search.

ప్రెస్ మీట్ లో ఆ పని చేసి సారు భయపెట్టారా?

By:  Tupaki Desk   |   20 March 2020 11:30 PM GMT
ప్రెస్ మీట్ లో ఆ పని చేసి సారు భయపెట్టారా?
X
చేతుల్లో కత్తులు.. తుపాకులు ఉంటే కంగారు పడటం పాత రోజుల మాట అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరినైనా భయపెట్టటానికి పెద్ద పెద్ద ఆయుధాలు.. అనవసరమైన మాటలు.. రంకెలు వేయాల్సిన అవసరం లేదు. సింఫుల్ గా ఒక్క గట్టి తుమ్ము.. నాన్ స్టాప్ గా దగ్గితే చాలు.. భయపడిపోతారు. కరోనా పుణ్యమా అని.. చేతిలో ఆయుధాలు లేకుండా జనాల్ని భయపెట్టే అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిందని చెప్పాలి.

అయితే.. దీనికికారణం తిప్పలు కూడా లేకపోలేదు. దగ్గు వస్తే.. చేతులు.. కర్ఛీఫ్ లు.. టిష్యూ పేపర్లు అడ్డు పెట్టుకొని దగ్గే అలవాటు మన దగ్గర తక్కువే. ఆ మాటకు వస్తే.. తుమ్మితే.. కొందరు క్లాస్ జనాలు ఎక్స్యూజ్ మి అంటూ.. చెప్పే ధోరణి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కరోనా భయాందోళనల వేళ.. దగ్గు.. తమ్ములకు బెదిరిపోతున్న దుస్థితి.

నిన్న మీడియా మీట్ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మీడియాతో మాట్లాడే సమయంలో గొంతు సవరించుకునే ప్రయత్నం చేయటం.. ఆ వెంటనే గొంతులో ఏదో అడ్డు పడినట్లుంది.. కాస్త పెద్దగానే దగ్గారు. మామూలు రోజుల్లో ఇలాంటివి పెద్దగా పట్టించుకునే వారు కాదు. పెట్టింది కరోనా మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న ప్రెస్ మీట్ అయిన వేళ.. సారు అంతలా దగ్గేసరికి పక్కనున్న అధికారులు మొదలు.. మీడియా ప్రతినిధులు సైతం ఒక్కసారి ఉలిక్కిపడ్డారట. ఆ వెంటనే.. సర్దుకొని ముఖాన నవ్వులు విరబూశాయట. అప్పుడప్పుడు తన తీవ్రమైన మాటలతో ఝలక్ ఇచ్చే సీఎం సారు.. తాజాగా మాత్రం దగ్గుతో కంగారు పెట్టేశారంటూ మాట్లాడుకోవటం కనిపించింది.