Begin typing your search above and press return to search.

బాబును విమర్శిస్తే కేసీఆర్ ఎంతలా నవ్వారంటే..

By:  Tupaki Desk   |   27 April 2016 4:40 PM GMT
బాబును విమర్శిస్తే కేసీఆర్ ఎంతలా నవ్వారంటే..
X
ఓపక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నట్లు ఉంటూనే.. మరోవైపు విమర్శలు చేయటం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే సాధ్యమవుతుందేమో. స్నేహంగా ఉన్నట్లే వ్యవహరిస్తూనే.. సమయానికి తగ్గట్లు తిట్టేందుకు సైతం వెనక్కు తగ్గని వైనం ఆయనలో కనిపిస్తుంది. తాను తిట్టటమే కాదు.. తన చుట్టూ ఉన్న వారి చేత బాబు మీద విమర్శలు చేయించటం చేస్తుంటారన్నది ఎంత నిజమో తాజాగా చోటు చేసుకున్న ఘటన చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

పార్టీ ప్లీనరీ సందర్భంగా బాలమేధావి లక్ష్మీ శ్రీజకు రెండు నిమిషాలు ప్రసంగించే అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం మొదలు.. తెలంగాణ రాష్ట్ర సాధన వరకూ అన్ని అంశాల్ని గుక్క తిప్పుకోకుండా చెప్పిన వైనం ప్లీనరీకే హైలెట్ గా నిలిచిందని చెప్పాలి. తన ప్రసంగంలో భాగంగా చంద్రబాబుపై సదరు బాలమేధావి విమర్శలు చేయటం గమనార్హం.

2000 సంవత్సరంలో ఎన్డీయే సర్కారు కొత్త రాష్ట్రాల్ని ఏర్పాటు చేసే పనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రయత్నించగా.. చంద్రబాబు అడ్డుపడ్డారని పేర్కొంది. టీడీపీ నుంచి బయటకు రావటానికి మేధావులు.. విద్యార్థులు.. ఎన్జీవో నేతలతో కేసీఆర్ చర్చలు ప్రారంభించారని.. ఈ విషయాల్ని ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న చంద్రబాబు.. కేసీఆర్ కోరుకున్న మంత్రిపదవి ఇచ్చేందుకు రాయబారాన్ని పంపినట్లుగా పేర్కొంది. అయితే.. ఆ ఆఫర్ ను కేసీఆర్ సున్నితంగా తిరస్కరించినట్లుగా పేర్కొన్న శ్రీజ మాటకు కేసీఆర్ పగలబడి నవ్వటం గమనార్హం.

బాబు మీద ఇదొక్క విమర్శ మాత్రమే కాదు.. విజన్ 2020లో తెలంగాణ ప్రస్తావన లేకపోవటంపై కేసీఆర్ చేసిన విమర్శలు.. కరెంటు ఛార్జీలను పెంచిన సమయంలో బాబు మీద విరుచుకుపడటం.. ఇలా వీలైనన్ని సందర్భాల్లో ఏపీ ముఖ్యమంత్రిపై విమర్శలు చేయటం కనిపించింది. తెలంగాణ ఉద్యమం మొదలు.. తెలంగాణ సాధన వరకూ జరిగిన పరిణామాల్ని క్లుప్తంగా వివరించిన చిన్నారి మెమరీకి కేసీఆర్ తో సహా పార్టీ నేతలంతా చప్పట్లు కొట్టి అభినందించారు. ఇన్ని చెప్పిన శ్రీజ.. తెలంగాణ ఏర్పాటుకు సమ్మతి తెలుపుతూ తెలుగుదేశం పార్టీ రాసిన లేఖ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్ ను మార్చేసిన ఈ కీలకాంశాన్ని బాల మేధావి మిస్ కావటాన్ని తప్పు పట్టకూడదేమో..?