Begin typing your search above and press return to search.

గంట ఏడ్చినా కేసీఆర్ బాధ తీరదంట

By:  Tupaki Desk   |   21 Aug 2015 4:48 AM GMT
గంట ఏడ్చినా కేసీఆర్ బాధ తీరదంట
X
ఎకరాకు కోటి రూపాయిల ఆదాయాన్ని ఇచ్చే భూమి ఉన్న గ్రామం అది. మిగిలిన వారికి సాధ్యం కాని ఆదాయం వ్యవసాయంతో సాధ్యమని నిరూపించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫాంహౌస్ ఉన్న పరిధిలోని గ్రామం ఎర్రవల్లి. ముఖ్యమంత్రి ఉండే ఆ గ్రామంలో బతుకు సిత్రం ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కలిగింది.

అంతే.. ఆయన గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా బయలుదేరారు. మందీ.. మార్బలం ఏమీ వద్దంటూ.. కొద్ది మంది అధికారుల్ని తీసుకొని గ్రామంలో తిరిగేందుకు పోయారు. అధికారులు చెప్పే రూట్లలో వెళ్లకుండా.. తనకు నచ్చిన తీరుగా గ్రామంలో పర్యటించిన కేసీఆర్.. చివర్లో గ్రామస్తుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు రెండు గంటల పాటు గ్రామంలో తిరిగిన ఆయనకు.. జీవచ్ఛవంలా ఉన్న గ్రామం ఆయన గుండె మండేలా చేసింది.

అంతే.. ఆయనలోని ఆవేశం తన్నుకొచ్చింది. ఆ సందర్భంగా కేసీఆర్ చెప్పిన మాటల్ని ఆయన మాటలుగా వింటేనే బాగుంటుంది. ‘‘ఈ గ్రామాన్ని చూస్తే గంటసేపు గుక్క తిప్పుకోకుండా ఏడ్చినా సరిపోనంత బాధ కలిగింది. కూలిపోయి.. విడిచి పెట్టిన ఇల్లు చూస్తే బాధేసింది. మన కర్మ గింతేనా? ఎంతకాలం ఇలా ఉందాం? తెలంగాణ రాష్ట్రాన్ని ఎర్రవల్లి గ్రామం నుంచే తెచ్చా. ఈ ఎర్రవల్లిని ఆరునెలల్లో బంగారువల్లి చేస్తా. మీ సొంత గ్రామం ఎర్రవల్లి సంగతి ఏందని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం జెప్పాల?’’ అంటూ ప్రశ్నించారు.

గ్రామంలో 1500 మంది జనాభా ఉంటే.. పనిచేసేటోళ్లు వెయ్యి మంది ఉంటారని.. వీరంతా కలిసి పని చేస్తే రెండువేల చేతులు అవుతాయని..గ్రామంలో మురికి ఉండదని.. పరిశుభ్రం అవుతుందంటూ ఉత్సాహపరిచారు. గ్రామంలో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లను రెండు రోజుల్లో తీసేద్దామన్న కేసీఆర్.. ‘‘ముళ్ల చెట్లను.. గడ్డిని తొలగిద్దాం. మీరు ముందుకొచ్చి చెబితే ఏ పని అయినా చేస్తా. మీరు ఆదేశిస్తే మోరీలు తీస్తా. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పని ప్రారంభిద్దాం. మధ్యాహ్నం గ్రామంలోనే అందరికి భోజనాలు పెట్టిస్తా. మీతోనే నేనూ భోజనం చేస్తాం. అందరం కలిసి శుక్రవారం ఊరిని శుభ్రం చేసుకుందాం. శనివారం ఊరంతా మొక్కలు నాటుకుందాం. పాడుబడిన ఇళ్లను కూల్చేసి.. కొత్తవి కట్టించటం.. రెండు రోడ్లను ఇరుకుగా కాకుండా రెండు లేన్లుగా మార్చటం.. శుక్ర.. శనివారం రెండు రోజుల పాటు 20 మంది ఇంజనీర్లు ఇక్కడే ఉండి గ్రామస్వరూపంపై సర్వే చేస్తారని.. శనివారం సర్వే పూర్తయితే.. అప్పుడే ఇళ్లను మంజూరు చేస్తాం’’ అంటూ వరాల మీద వరాలు కురిపించేశారు.

గంటసేపు ఏడ్చినా బాధ తీరదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా రెండు రోజుల్లో ఎర్రవల్లి ఎంతలా మారిపోతుందో చూడాలి. ఇంత భావోద్వేంతో కదిలిపోయిన కేసీఆర్.. తానుండే గ్రామంలో సంగతేమిటన్న విషయం గుర్తుకు రావటానికి ఇన్నేళ్లు పట్టిందా? ఉద్యమనాయకుడిగా ఆయనకు అధికారాలు లేకపోవచ్చు. మరి.. ముఖ్యమంత్రి హోదాలో పద్నాలుగు నెలలు ఏం చేసినట్లు..?