Begin typing your search above and press return to search.

నిమ్స్ లో ఆంధ్రజ్యోతి యజమానిని కేసీఆర్ కోరిందేమిటి?

By:  Tupaki Desk   |   27 Sep 2015 12:36 PM GMT
నిమ్స్ లో ఆంధ్రజ్యోతి యజమానిని కేసీఆర్ కోరిందేమిటి?
X
పైకి కనిపించే దాని వెనుక ఎన్నో విషయాలు ఉంటాయి. రాజకీయాల్లో ఒక అడుగు ముందుకు పడిందంటే.. తెర వెనుక చాలానే మంత్రాంగం నడుస్తుంది. అలాంటి విషయాలు అన్నీ బాగున్నప్పుడు అస్సలు బయటకు రావు. కానీ.. లెక్కలో తేడాలు వస్తే.. ఇట్టే బయటకు వచ్చేస్తుంటాయి.

ఉమ్మడి రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు దారి తీసిన అత్యంత కీలకమైన అంశాల్లో నిమ్స్ లో టీఆర్ ఎస్ అధినేతగా ఉన్న కేసీఆర్ దీక్ష ఒకటిగా చెప్పొచ్చు. బక్కచిక్కి.. ప్రేత కళతో ఉన్న నాటి కేసీఆర్ ఫోటోలు మీడియా ఛానళ్లలోనూ.. పత్రికల్లోనూ ప్రచురితమైన వెంటనే కోట్లాది మంది తెలంగాణవాదులు ఒక్కతాటి మీదకు వచ్చి.. తెలంగాణ ఇవ్వాల్సిందేనంటూ పట్టుపట్టడం.. ఉద్యమం తీవ్రస్థాయికి వెళ్లిపోవటం తెలిసిందే.

అయితే.. దీక్ష సమయంలో కేసీఆర్ ను పరామర్శించేందుకు వెళ్లిన ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని రాధాకృష్ణను.. ఒక కోరిక కోరారని.. ఆ విషయాన్ని సమయం వచ్చినప్పుడు చెబుతానని.. తన పత్రికలో కొంతకాలం కిందట రాసుకున్నారు.

తాజాగా ఆ రహస్యాన్ని ఆయన బయట పెట్టేశారు. నిమ్స్ లో కేసీఆర్ దీక్ష చేస్తున్న సయమంలో దీక్ష విరమణ కోసం కేసీఆర్ ఎంతగా తపించారన్న విషయాన్ని ఆర్కే (రాధాకృష్ణ) వెల్లడించటమే కాదు.. ఈ సందర్భంగా కేసీఆర్ మైండ్ సెట్ ను అందరికి అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించారు. నాడు రహస్యంగా ఉండిపోయిన అంశం ఇప్పుడు నిజంగా ఎందుకు బయటకు వచ్చిందన్నది పక్కన పెడితే.. నాడు జరిగిందేమిటన్నది ఆర్కే మాటల్లో చూస్తే..

‘‘కరీంనగర్ లో దీక్ష ప్రారంభించిన కేసీఆర్ ను పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ఒకరోజు గడిచేసరికి ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఒక సాయంత్రపు వేళ పండ్ల రసాన్ని తీసుకోవటం ద్వారా నిరాహారదీక్షను విరమిస్తున్నట్లుగా కేసీఆర్ సంకేతాలు పంపారు. దీక్షను అర్థాంతరంగా ఆపేస్తూ నిర్ణయం తీసుకున్న దాన్ని నిరసిస్తూ గద్దర్ నేతృత్వంలో పలువురు విద్యార్థులు ఉస్మానియా క్యాంపస్ లో ఆయన బొమ్మలు తగులబెట్టారు. దీంతో మనస్సు మార్చుకున్న కేసీఆర్ దీక్ష కొనసాగుతుందని ప్రకటించి హైదరాబాద్ లోని నిమ్స్ లో తనను చేర్చేలా అధికారులను ఒప్పించుకున్నారు‘‘

‘‘నిమ్స్ ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ఒక దశలో ఓపిక నశించి గద్దర్ ప్రభృతులతో ఒక ప్రకటన చేయిస్తే తాను దీక్ష విరమిస్తానని నన్ను కోరారు. అప్పుడు గద్దర్ తో మాట్లాడిన నేను.. ఆయన్ను ఒప్పించాను. ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబరు 9న ఉదయం గద్దర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దీక్ష విరమించాల్సిందిగా కేసీఆర్ ను కోరారు. ప్రకటన చేశారే కానీ.. తర్వాత కార్యక్రమానికి కేసీఆర్ వైపు నుంచి స్పందన లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన కుటుంబ సభ్యులు నుంచి సమాధానం లేదు. అలా ఎందుకు జరిగిదంటే.. గద్దర్ ప్రభృతులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సయంలోనే కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ నుంచి కేసీఆర్ కు ఫోన్ వచ్చింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లుగా ఈ రోజు సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటన వస్తోంది. మీరు దీక్ష విరమించండి అని కేసీఆర్ ను అహ్మద్ పటేల్ కోరారట. దీంతో.. గద్దర్ అవసరం లేకుండా పోయింది. తను కోరుకున్న మీదట ప్రకటన చేయటానికి ముందుకు వచ్చిన గద్దర్ పట్ల మామూలుగా అయితే.. సానుకూలత ఉండాలి. కానీ.. కేసీఆర్ తీరు వేరు. ఉస్మానియాలో నిరసన ప్రదర్శనలు నిర్వహించి ఉండకపోతే గద్దర్ వంటి వారిని బతిమిలాడుకోవాల్సిన అవసరం తనకు ఉండేది కాదు కదా అని ఆయన భావిస్తారు. అందుకే అవసరార్థం గద్దర్ ను వాడుకోవాలనుకున్నారే కానీ గౌరవంతో కాదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా గద్దర్ కు సముచిత గౌరవం లభించటం లేదు. కక్షపూరిత మనస్తత్వం ఉన్నవారే నియంతులుగా మారతారు కాబోలు’’ అని అసలు విషయంతో పాటు.. కేసీఆర్ మైండ్ సెట్ ను తాజాగా ఆర్కే వివరించే ప్రయత్నం చేశారు. టీవీల్లో కనిపించే ప్రకటనల వెనుక ఎంత బ్యాక్ గ్రౌండ్ నడుస్తుందన్న దానికి తాజా మాటలే నిదర్శమని చెప్పక తప్పదు.