Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్వే: సగం మంది మంత్రులకు ఈసారి టికెట్లు డౌటే

By:  Tupaki Desk   |   7 Jan 2023 1:30 PM GMT
కేసీఆర్ సర్వే: సగం మంది మంత్రులకు ఈసారి టికెట్లు డౌటే
X
'మరోసారి సిట్టింగులకే సీట్లు..' అని తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని నెలల కిందట ప్రకటించారు. దీంతో ఇప్పుడున్న వాళ్లంతా రిలాక్స్ అయ్యారు. అయితే ఎందుకైనా మంచిదని కేసీఆర్ ఎమ్మెల్యేలపై ప్రత్యేక సర్వే చేయించారు. దీంతో షాక్ తిన్న ఆయన మంత్రులుగా కొనసాగుతున్న వారిలో 10 మందికి మరోసారి టికెట్లు ఇవ్వడంపై పునరాలోచించే విషయానికి వచ్చినట్లు సమాచారం. రెడ్డి, బీసీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని కేసీఆర్ కు అందిన నివేదికలో సమాచారం ఉంది. దీంతో వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు డౌటే అనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయానికి కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడోనన్న ఆసక్తి నెలకొంది.

తెలంగాణలో మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టికెట్లపై తీవ్ర చర్చ సాగుతోంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నుంచి ఎవరికి టికెట్ వస్తోందనని ఇప్పటినుంచే ఉత్కంఠ నెలకొంది. కొందరు ఎప్పటి నుంచో పార్టీలో కొనసాగుతూ.. ఈసారైనా టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నారు. అయితే ఇటీవల కేసీఆర్ మరోసారి సిట్టింగులకే టికెట్లు అనడంతో వారు తీవ్ర నిరాశ చెందారు. ఈ క్రమంలో కొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. మరికొందరు మాత్రం చివరి వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు.

ఇంతలో కేసీఆర్ ఎందుకైనా మంచిదని ప్రత్యేకంగా సర్వే చేయించారు. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది..? వారి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు..? అనే విషయాలను తెలుసుకున్నారు. సర్వే రిపోర్టు ప్రకారం.. ఇప్పుడున్న 10 మంది మంత్రులపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని తెలిసింది.

కొందరు మంత్రుల బంధువులు, వారి అనుచర లీడర్లు ప్రజలను తీవ్రంగా దోచుకుంటున్నారని, వారి ఆగడాలకు పడలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. మొత్తం 10 మంది మంత్రుల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారన్నారు.

బీసీకి చెందిన ఓ మంత్రిని నేరుగా కలవాలంటే ముందుగా ఆయన కింద ఉన్న ఓ టీంను సంప్రదించాలి. వారు అనుమతిస్తేనే మంత్రిని కలిసే అవకాశం ఉంది. అయితే మంత్రిని కలిసేందుకు వారు ఇబ్బందులు పెడుతున్నట్లు సమాచారం. అందుకే ఆ మంత్రిపై ప్రజలో కోపంతో ఉన్నారని తెలుస్తోంది. ఇక మరో మంత్రి బామ్మర్దులు, సోదరులు, ఇతర బంధువులు ఆయన పేరు చెప్పి డబ్బులు దండుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని అనుమతులు రావాలంటే తమకు డబ్బు ముట్టజెప్పాకే మంత్రి దగ్గరికి తీసుకెళ్తున్నారని అంటున్నారు. ఇందులో ఓ ఎస్టీ మంత్రిపై కూడా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

ఈ నివేదికను కేసీఆర్ చూసి మరోసారి వారికి టికెట్ ఇస్తే పార్టీకి ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని గ్రహించినట్లు సమాచారం. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తరువాత ప్రజల్లోకి ఎలా వెళ్లాలి..? అనే విషయం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇలా మంత్రులపై వ్యతిరేకత ఉంటే ఆ సీట్లు కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఓ వైపు బీజేపీ రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ తరుణంలో వ్యతిరేకత ఉన్న మంత్రులకు మరోసారి టికెట్లు ఇస్తే మొదటికే మోసం అయ్యే అవకాశం ఉందని కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.