Begin typing your search above and press return to search.

ముంబయికి కేసీఆర్.. ఫోన్ చేసిన మహా సీఎం.. ఏమన్నారంటే?

By:  Tupaki Desk   |   16 Feb 2022 8:30 AM GMT
ముంబయికి కేసీఆర్.. ఫోన్ చేసిన మహా సీఎం.. ఏమన్నారంటే?
X
జాతీయ రాజకీయాలే లక్ష్యంగా పావులు కదుపుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సానుకూల స్పందనలు వెలువడుతున్నాయి. ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు పలువురు మద్దతు పలుకుతున్నారు. గతంలో ఆయన జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పి.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి వచ్చినప్పటి పరిస్థితులతో పోలిస్తే.. తాజా స్పందనలు భిన్నంగా ఉండటం గమనార్హం. అప్పట్లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతను కలవటానికి ప్రత్యేక విమానం వేసుకొని కోల్ కతాకు వెళ్లిన వేళలో.. కేసీఆర్ ప్రకటనలకు భిన్నంగా మమత చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కేసీఆర్ కు ఇరుకున పడేసేలా చేశాయి.

తాజాగా అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్లు మాత్రమే సమయం ఉండటం.. గడిచిన రెండేళ్లలో చోటు చేసుకున్న పరిణామాలు మోడీ సర్కారుకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లోని కాంగ్రెస్.. బీజేపీయేతర ప్రభుత్వాధినేతలు ఒక కూటమిగా మారాలనుకుంటున్న పరిస్థితి. అయితే.. ఆ తరహా కూటమికి నాయకత్వం వహించే నాయకుడి కోసం ఇంతకాలం వెతుకుతున్న పరిస్థితి. కూటమి కట్టాలని ఉన్నా.. దాన్ని నడిపేందుకు ఒక బలమైన శక్తి కావాల్సి రావటం.. అందుకు తగ్గ అధినేత కోసం ఎదురుచూపులకు కేసీఆర్ ముగింపు కార్డు వేసినట్లుగా చెప్పాలి.

మోడీ సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు.. కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సీఎం కేసీఆర్ ఓపెన్ అయిన వేళ.. పలు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రితో పాటు.. కర్నాటకకు చెందిన మాజీ ప్రధాని దేవెగౌడ తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సైతం పాజిటివ్ గా రియాక్టు కావటం తెలిసిందే.

మోడీ పరివారానికి వ్యతిరేక కూటమితో చర్చలు జరిపేందుకు వీలుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ కావటం కోసం ఈ నెల 20న సీఎం కేసీఆర్ ముంబయి వెళ్లనున్నారు. ఆయన ప్రయాణానికి దాదాపు ఐదారు రోజుల ముందే.. ముంబయి ముఖ్యమంత్రి ఈ రోజు (బుధవారం) సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడారు.

దీంతో.. తాను ముంబయి రావాలనుకున్న దానికి తగిన స్పందనను మహా సీఎం ఉద్దవ్ ఠాక్రే చూపించారని చెప్పాలి. ముంబయికి వచ్చి తమ అతిధ్యాన్ని అందుకోవాలని మహా సీఎం ఆహ్వానించటంతో పాటు..దేశం కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తాజాగా సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసిన ఉద్దవ్.. ‘‘కేసిఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి రక్షించుకోవాలి. సరైన సమయం లో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి.

ఇదే స్ఫూర్తి తో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది.ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం" అని వ్యాఖ్యానించటం చూస్తే.. కేసీఆర్ పోరుకు సానుకూల వాతావరణం వెలువడుతుందని చెప్పక తప్పదు.