Begin typing your search above and press return to search.

కేసీఆర్ సరదాగా అన్నారా? సీరియస్ గా అన్నారా?

By:  Tupaki Desk   |   9 April 2016 4:46 AM GMT
కేసీఆర్ సరదాగా అన్నారా? సీరియస్ గా అన్నారా?
X
పిల్లికి సరదా.. ఎలుకకు ప్రాణ సంకటం అని ఊరికే అనలేదుమో. అధినేత నోటి నుంచి వచ్చే ప్రతి మాటా కౌంట్ లోకే వస్తుంది. అందులోకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నేత నోట్లో నుంచి ఏదైనా మాట అంత తేలిగ్గా రాదు. సరదాగా వచ్చినా అదెంతో కొంత మనసులో రిజిష్టర్ అయి ఉండాల్సిందే. ఉగాది వేడుకల సందర్భంగా పండితులు పంచాంగ శ్రవణం చేస్తూ.. విద్య.. వైద్య శాఖల్లో అవినీతి చోటు చేసుకుంటుందని.. విమర్శలు వచ్చేఅవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

పంతులుగారి పంచాంగ శ్రవణం తర్వాత ఇదే విషయాన్ని కేసీఆర్ గుర్తు పెట్టుకొనిమరీ ఆయా శాఖల్ని నిర్వహిస్తున్న మంత్రులు కడియం శ్రీహరి.. లక్ష్మారెడ్డిలు జాగ్రత్తగా ఉండాలని సరదాగా వ్యాఖ్యానించారు. మొదట సరదాగానే ఉన్నా.. ఇలాంటి వ్యాఖ్యలకు ఎలాంటి ప్రచారం తోడవుతుందో చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ నోట వచ్చిన ‘‘మంత్రులు జాగ్రత్త’’ అన్న మాటతో పార్టీలో ‘‘ఏంటీ కత’’ అంటూ చర్చ మొదలు కావటం గమనార్హం.

చాలా మామూలుగా అన్న విషయాలకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని చాలామంది నేతలు కొట్టి పారేస్తున్నా.. కేసీఆర్ మాటను అంత తేలిగ్గా తీసుకోకూడదన్న మాటను మరికొందరి నోట వినిపిస్తోంది. కేసీఆర్ తాజా వ్యాఖ్యల్నివార్నింగ్ గా చూడాలా? అన్న ప్రశ్నకు ఒక సీనియర్ నేత స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం కేసీఆర్ ఉన్న స్థాయికి.. వేటు వేయాలనుకుంటే.. వెనుకా ముందు చూసుకోకుండా వేటేయగలరు. దీన్లో మరో ఆలోచనే లేదు. పండితుల వారు చెప్పటంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పారంతే. శ్రీహరిని ఏరి కోరి ముఖ్యమంత్రే తెచ్చుకున్నారు. అదే విషయాన్ని ఆ మధ్య కడియం కూడా చెప్పటాన్ని మర్చిపోకూడదు. నిజానికి ఆయన మీద ఎలాంటి ఆరోపణలు లేవు. కాస్త స్వతంత్రంగా పని చేసుకెళుతున్నారు. ఆ మాత్రానికే వేటు వేస్తారని అనుకోవటం లేదు’’ అని చెప్పుకొచ్చారు.