Begin typing your search above and press return to search.

బాబును డైరెక్ట్‌ గా ఏకేసిన కేఈ

By:  Tupaki Desk   |   3 Jun 2016 6:33 AM GMT
బాబును డైరెక్ట్‌ గా ఏకేసిన కేఈ
X
తెలుగుదేశం పార్టీలో రాజ్య‌స‌భ వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. రాయలసీమ నుంచి రాజ్యసభ సీటును మాజీ మంత్రి, ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన టీజీ వెంకటేష్‌ కు ఇవ్వడంపై ఉప ముఖ్యమంత్రి సోదరుడు కేఈ ప్రభాకర్‌ ఫైర్‌ అయ్యారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీసీలకు టికెట్‌ ఇవ్వకుండా తెలుగుదేశంలోకి ఫిరాయించిన టీజీ వెంకటేష్‌ కు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో కర్నూల్లో భారీర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డబ్బునోళ్లకే సీటు ఇచ్చే పద్ధతి మార్చుకోకపోతే బీసీ లు టీడీపీని కూకటివేళ్లతో సహా పెకలించి వేస్తారని ఆయన పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించారు. తమ కన్నా బీసీలకు సేవ చేసినవారెవరున్నారంటూ రాజ్యసభ సీటు పొందిన మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌ ను పరోక్షంగా టార్గెట్ చేశారు.

ర్యాలీ అనంతరం టీడీపీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభాకర్ ధ‌ర్నాకు దిగారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. మొదటి నుంచీ పార్టీకి అంకితమైన వారిని విస్మరించి నిన్నామొన్నా పార్టీలో చేరిన టీజీ వెంకటేష్‌ కు రాజ్యసభ టికెట్‌ ఎలా ఇస్తారని ప్ర‌భాకర్‌ ప్రశ్నించారు. తొలుత జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ టికెట్లను అమ్ముకుందంటూ నిరసన వ్య‌క్తం చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి టీడీపీ కార్యకర్తలతోపాటు బీసీ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చేసి మ‌రీ ఈ నిర‌స‌న చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హం.