Begin typing your search above and press return to search.

'తుపాకీ' ఐడియా మాదిరే కేరళ సీఎం నిర్ణయం.. నాన్నతో చెప్పండి కేటీఆర్?

By:  Tupaki Desk   |   20 July 2022 9:45 AM GMT
తుపాకీ ఐడియా మాదిరే కేరళ సీఎం నిర్ణయం.. నాన్నతో చెప్పండి కేటీఆర్?
X
విమర్శల మీద విమర్శలు.. వినేందుకు బాగుంటాయి. కానీ.. వాటి కారణంగా కాసింత కాలక్షేపం తప్పించి.. ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. మోడీ సర్కారు తీరు మీద రోజుకు ఒకట్రెండుసార్లు ట్విటర్ పిట్ట చేత ట్వీట్ కూతలు పలికిస్తున్న మంత్రి కేటీఆర్.. ఇప్పుడు చేతల్లో చూపించాల్సిన సమయం వచ్చేసింది. పాలు.. పాల ఉత్పత్తులపైనా జీఎస్టీ బాదేసేలా తీసుకున్న కేంద్రం నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాల్ని సంధించారు. పాలు.. పెరుగు.. పన్నీర్ లాంటి ఉత్పత్తులపైనా జీఎస్టీనా అంటూ చేస్తున్న విమర్శలపై జులై 18న 'తుపాకీ' ఒక కథనాన్ని ప్రచురించింది.

అందులో.. ''మోడీ సర్కారును ట్వీట్లతో ఏసుకునే బదులు.. ఇలా చేయొచ్చుగా కేటీఆర్?'' శీర్షికన పబ్లిష్ అయిన ఐటెం సారాంశం.. కేంద్ర సర్కారు నిర్ణయాలను విమర్శించే కన్నా.. నిర్మాణాత్మక నిర్ణయాన్ని ప్రకటించటం.. అవసరమైతే ప్రజల తరఫున జీఎస్టీ చెల్లిస్తామే కానీ.. ప్రజల మీద భారం వేయొద్దన్న ఆలోచనను తెర మీదకు తీసుకురావటం జరిగింది. రాజకీయ విమర్శలు తప్పించి.. ప్రజలకు మేలు చేయాలి.. కేంద్రంలోని మోడీ సర్కారు కారణంగా పడే అదనపు భారాన్ని తగ్గించాలన్న పట్టుదల తెలంగాణ సర్కారులో కనిపించని పరిస్థితి.

కానీ.. తెలుగురాష్ట్రాలకు కాస్తంత దూరంలో ఉండే కేరళలోని విజయన్ సర్కారు మాత్రం 'తుపాకీ' చెప్పిన విధానానికి కాస్త దగ్గర్లో నిర్ణయాన్ని తీసుకోవటం.. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయటం గమనార్హం. నిత్యవసర వస్తువులపై జీఎస్టీ విధించిన వైనంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. కేరళలో స్వయం సహాయక సంఘం నిర్వహించే 'కుటుంబ శ్రీ' షాపుల్లో కానీ.. ఇతర చిన్న దుకాణాల్లో కానీ ఒక కేజీ.. రెండు కేజీల నిత్యవసర వస్తువుల్ని పాకెట్ల రూపంలో అమ్మితే.. దానిపై జీఎస్టీ విధించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

అవసరమైతే.. ఈ విషయంలో కేంద్రంతో పేచీ వచ్చినా తాము వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. 'కుటుంబ శ్రీ తో పాటు చిన్న చిన్న షాపుల్లో అమ్మే ఒకట్రెండు కేజీల పాకెట్లు.. లూజుగా విక్రయించే నిత్యవసర వస్తువులపై ఎలాంటి జీఎస్టీ విధించం. కేంద్రం అభ్యంతరం చెప్పినా వెనకడుగు వేయం. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రానికి ఒక లేఖ రాశాం' అంటూ వెల్లడించారు. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం నిత్యవసర వస్తువులు ఏవైనా లూజ్ గా అయితే పన్ను ఉండదని.. పాకెట్లుగా అమ్మితే మాత్రం పన్ను వేస్తామని చెప్పటం తెలిసిందే.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకెట్లలో విక్రయించటం అన్నది సర్వసాధారణ విషయంగా మారినప్పుడు.. అందరి మీదా భారం పడుతుంది. ఇదే విషయాన్ని కేరళ సీఎం కూడా ప్రస్తావిస్తూ.. 'ప్యాక్ చేసి అమ్మటం సర్వసాధారణమైన విషయం. ప్యాక్ చేసి అమ్మే వస్తువులను తాజాగా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం వల్ల చిన్న షాపుల్లో కొనుగోలు చేసే వినియోగదారులపై భారం పడుతుంది' అని లేఖలో పేర్కొన్నారు.

కేరళ ముఖ్యమంత్రి తరహాలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇదే తరహాలో నిర్ణయం తీసుకోవచ్చు కదా? అందుకు మంత్రి కేటీఆర్.. తన తండ్రికి సూచన చేయొచ్చు కదా? అలా చేస్తే మోడీ మీద చేసే విమర్శలకు మరింత విలువ పెరుగుతుందన్నది మర్చిపోకూడదు.