Begin typing your search above and press return to search.

అయ్యప్ప మహిళా భక్తులకు శుభవార్త!

By:  Tupaki Desk   |   7 Nov 2016 11:48 AM GMT
అయ్యప్ప మహిళా భక్తులకు శుభవార్త!
X
దేశంలో అత్యంత ప్రముఖమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం విషయంలో కేరళ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం ఇకపై అయ్యప్ప ఆలయంలోకి మహిళలందరికీ వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. ఈ విషయాలను కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. అయితే దీనికి కారణం... గతంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే... మహిళల ప్రవేశాన్ని నిరాకరించడం స్త్రీల పట్ల వివక్ష చూపడమేనంటూ దాఖలైన కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. గత విచారణ సందర్భంగా ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరాకరించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది.

అయితే ప్రస్తుతం 10 ఏళ్ల బాలికల నుంచి 50 ఏళ్ల మహిళల వరకు శబరిమల ఆలయంలోకి ప్రవేశించరాదన్న నిబంధనను ఆలయ బోర్డు అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన సుప్రీం కోర్టు... "దేవుణ్ణి పూజించడానికి ఫలానా భక్తులు మాత్రమే అర్హులని ఎక్కడైనా ఉంటుందా? అసలు భక్తుల విషయంలో తేడాలు ఉంటాయా? చిన్నాపెద్దా.. కులం - మతం.. ఆడా - మగా వంటి బేదాలు కూడా ఉంటాయా?’ అని ప్రశ్నించింది.

దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఆయన దర్శనానికి స్త్రీ - పురుష వివక్ష ఏమిటని కోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో మహిళల ఆలయ ప్రవేశం విషయంలో సుప్రీంకోర్టుకు తన తాజా నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం తెలిపింది. కేరళ నిర్ణయాన్ని నమోదుచేసుకున్న సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది. కాగా, అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పించాల్న కేరళ నిర్ణయంపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/