Begin typing your search above and press return to search.

ఆంధ్రప్రదేశ్ ని ఫాలో అవుతున్న కేరళ...!

By:  Tupaki Desk   |   29 March 2020 11:49 AM GMT
ఆంధ్రప్రదేశ్ ని ఫాలో అవుతున్న కేరళ...!
X
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ..ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రంలో ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో వాలంటీర్లు ..రాష్ట్రానికి మరో గుదిబండలా తయారవుతారంటూ ప్రతిపక్ష టీడీపీతో సహా ఎంతో మంది విమర్శలు గుప్పించినా,కూడా సీఎం జగన్ పట్టువీడని విక్రమార్కుడిలా ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి - నాలుగు లక్షలకుపైగా నిరుద్యోగులను గ్రామ వాలంటీర్లుగా నియమించారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ప్రస్తుతం వీరి ఆధ్వర్యంలోనే సాగుతున్నాయి.

ఇకపోతే ,ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ పై పోరులోనూ ఆంధ్రప్రదేశ్‌ గ్రామ వాలంటీర్లు విశేష కృషి చేస్తున్నారు. విదేశాల నుండి వచ్చిన వారి వివరాలు సేకరించడం ..వారిని క్వారంటైన్ కి తరలించడం - స్థానిక ప్రజలకి కరోనా గురించి వివరించి ..అందరూ తగు జాగ్రత్తలు తీసుకునేలా చేస్తున్నారు. దీనితో ఒకప్పుడు వలంటీర్ల వ్యవస్థని విమర్శించిన వారు కూడా ..ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఆపద సమయంలో వారి సేవ చాలా అమూల్యమైనది.

అలాగే, ప్రభుత్వం నిర్దేశించిన విధుల మేరకు ఇంటింటికి పెన్షన్ల పంపిణీ - రేషన్‌ సరఫరా వంటి కార్యక్రమాల్లో వీరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఆసక్తికనపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌ లో అనుసరిస్తున్న వాలంటీర్ల వ్యవస్థను తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మహమ్మారి కరోనా వైరస్‌ కేరళపై తీవ్ర ప్రభావం చూపుతోన్న తరుణంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి అధ్యక్షతన భేటీ అయిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ నివారణకు గ్రామ స్థాయిలో సేవకులుగా 2 లక్షల 36 వేల వాలంటీర్లును వెంటనే నియమించాలని నిర్ణయించారు. అలాగే వీరందరినీ కేవలం గ్రామాల్లోనే కాకుండా మున్సిపాలిటీలు - కార్పొరేషన్‌ లలో కూడా ఉపయోగించుకోవాలని విజయన్‌ భావిస్తున్నారు.

కేరళ రాష్ట్రంలో 2.36 లక్షల మంది వాలంటీర్లను నియమించాలని సీఎం పినరయి విజయన్‌ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం భారీ ఎత్తున చర్యలు తీసుకోనుంది. కేరళలో 941 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో గ్రామ పంచాయతీకి 200 మంది చొప్పున వాలంటీర్లను నియమించాలని నిర్ణయించారు. అలాగే, 87 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒక్కో మున్సిపాలిటీకి 500 మంది వాలంటీర్లను నియమించనున్నారు. ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. కార్పొరేషన్లలో 750 మంది వాలంటీర్లను రిక్రూట్ చేయనున్నారు. దీనిపై ఇప్పటికే కేరళ ప్రభుత్వం ..కసరత్తులు కూడా ప్రారంభించింది. మొత్తంగా కేరళ తో పాటు గా దేశంలోని పలు రాష్ట్రాలు ఈ వలంటీర్ల వ్యవస్థని అమలు చేయాలనీ చూస్తున్నాయి.