Begin typing your search above and press return to search.

దేశ ప్ర‌జ‌ల్ని క‌న్నీరు పెట్టిస్తున్న కేర‌ళ న‌ర్సు

By:  Tupaki Desk   |   23 May 2018 4:35 AM GMT
దేశ ప్ర‌జ‌ల్ని క‌న్నీరు పెట్టిస్తున్న కేర‌ళ న‌ర్సు
X
విన్నంత‌నే కంట క‌న్నీరు జ‌ల‌జ‌లా రాలే ప‌రిస్థితి. ప‌గోడికి సైతం ఇలాంటి ప‌రిస్థితి రాకూడ‌దేమో. ఒక‌రి ప్రాణం కోసం ప‌రిత‌పించి.. వృత్తిధ‌ర్మాన్ని నెర‌వేర్చినందుకు అయిన‌వాళ్ల‌ను పోగొట్టుకున్నవిషాదం ఒక ఎత్తు అయితే.. త‌న ప్రాణాలు పోవ‌టం ఖాయ‌మ‌ని అర్థం చేసుకొని.. త‌న చివ‌రి క్ష‌ణాల్లో త‌న ఇద్ద‌రు పిల్లల కోసం స‌ద‌రు న‌ర్సు ప‌డిన త‌ప‌న తెలిస్తే కంటనీరు ఆగ‌దు.

నెటిజ‌న్లకు తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తున్న ఈ వైనంలోకి వెళితే.. కేర‌ళ‌కు చెందిన 28 ఏళ్ల లినీ పుతుస్సెరి న‌ర్సుగా ప‌ని చేస్తున్నారు. కోజికోడ్‌లోని ప‌రంబ్ర తాలూక్ ఆసుప‌త్రిలో ఆమె న‌ర్సుగా బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తిస్తున్నారు. కేర‌ళ‌లో ఇటీవ‌ల నిపా వైర‌స్ విరుచుకుప‌డ‌టం.. 12 మందికి పైగా కేర‌ళ‌వాసులు మ‌ర‌ణించ‌టం తెలిసిందే.

ఈ క్ర‌మంలో నిపా వైర‌స్ కు గురైన రోగుల‌కు వైద్య‌సేవ‌ల్ని అందించిన లినీ సైతం ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ బారిన ప‌డ్డారు. మందు లేని ఈ వైర‌స్ బారిన ప‌డిన ఆమెను ప్ర‌త్యేక వార్డులో ఉంచారు. ఈ సంద‌ర్భంగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న త‌న భ‌ర్త‌కు ఆమె ఆఖ‌రి లేఖ రాశారు. త‌మ‌ ఇద్ద‌రు పిల్ల‌ల్ని (ఒక‌రికి ఐదేళ్లు.. మ‌రొక‌రికి రెండేళ్లు) బాగా చూసుకోవాల‌ని అందులో కోరారు.

"నేను చావుకు ద‌గ్గ‌ర్లో ఉన్నా. నిన్ను చూసే అవ‌కాశం కూడా రాదేమో. మ‌న ఇద్ద‌రు పిల్ల‌ల బాధ్య‌త ఇక నుంచి పూర్తిగా నీదే. వారిని నువ్వు బాగా చూసుకోవాలి. మ‌న పిల్ల‌ల్ని నీతో పాటు గ‌ల్ఫ్ కు తీసుకెళ్లు. నా తండ్రి చిన్న‌ప్పుడు మ‌మ్మ‌ల్ని వ‌దిలేశాడు. ద‌య‌చేసి ఆ పరిస్థితి వారికి రానీయ‌కు" అంటూ త‌న ఆఖ‌రి కోరిక‌ను లేఖలో రాశారు. తీవ్ర ఆవేద‌న‌తో త‌న చావుకు కాస్త ముందుగా ఆమె ఈ లేఖ రాశారు.

మందులేని నిపా వైర‌స్ బారిన ప‌డిన లినీ భౌతిక‌కాయాన్ని చూసేందుకు ఆమె కుటుంబ స‌భ్యుల‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదు. నిపా వైర‌స్ కు సోకే ప్ర‌మాదం ఉంద‌న్న ఉద్దేశంతో మృతురాలిని ఎవ‌రూ చూసేందుకు అవ‌కాశం ఇవ్వ‌లేదు. ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఆమె అంత్య‌క్రియ‌ల్ని గుట్టుగా పూర్తి చేశారు. నిపా వైర‌స్ విస్తృత‌మ‌వుతున్న వేళ‌.. కేర‌ళ‌తో పాటు.. గోవా.. క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే.. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని.. నిపాను కంట్రోల్ చేయ‌టానికి యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లుగా కేంద్రం ప్ర‌క‌టించింది. కేర‌ళ ప‌రిస్థితిపై ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి అధికారుల‌తో ప్ర‌త్యేక స‌మీక్ష‌ను నిర్వ‌హించారు.