Begin typing your search above and press return to search.

రజినీని అక్కడ ఆమె ఎందుకు కలిసింది?

By:  Tupaki Desk   |   8 Jun 2017 11:04 AM GMT
రజినీని అక్కడ ఆమె ఎందుకు కలిసింది?
X
రజినీకాంత్-ఖుష్బూ కలిసి గతంలో కొన్ని సూపర్ హిట్ సినిమాలు చేశారు. రజినీ ఇప్పుడు కూడా హీరోగా యాక్టివ్ గా ఉంటే.. ఖుష్బూ అప్పుడప్పుడూ సినిమాల్లో గెస్ట్ క్యారెక్టర్లు చేస్తున్నారు. ఐతే వీళ్లిద్దరినీ సినిమా తారలుగా మాత్రమే చూడలేం ఇప్పుడు. ఖుష్బూ రాజకీయాల్లోకి అడుగుపెట్టి... కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తమిళనాడుకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆమె . ఇక రజినీ విషయానికి వస్తే.. ఆయన త్వరలోనే రాజకీయ నేతగా మారతారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఖుష్బూ ముంబయిలో ‘కాలా’ షూటింగ్ లో పాల్గొంటున్న రజినీని ప్రత్యేకంగా కలవడంపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి.

‘కాలా’లో ఖుష్బూ నటించట్లేదన్నది స్పష్టం. ఇందులో నటించే తారలెవరో ముందే స్పష్టం చేశాడు దర్శకుడు పా.రంజిత్. ఖుష్బూ రాజకీయ కారణాలతోనే సూపర్ స్టార్ ను కలిసిందని భావిస్తున్నారు. ఐతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఖుష్బూ రజినీకి ఏం రాయబారం తీసుకెళ్లిందన్నది ఆసక్తికరం. రజినీని తమ పార్టీలోకి తీసుకురావడానికి ఓవైపు భారతీయ జనతా పార్టీ గట్టి ప్రయత్నమే చేసింది. కానీ రజినీ లొంగలేదు. ఐతే ఆయన సొంతంగా పార్టీ పెట్టినప్పటికీ భాజపాకు మద్దతుదారుగా కొనసాగవచ్చన్న అంచనాలున్నాయి. మరి కేంద్రంలో అధికారంలోనూ లేక.. రాష్ట్రంలోనూ పట్టులేని కాంగ్రెస్ పార్టీ రజినీ దృష్టిని ఏమేరకు ఆకర్షిస్తుంది.. ఖుష్బూ ఆయనతో ఏం చర్చలు జరిపుతుంది.. చర్చల ఫలితం ఏముంటుంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ భేటీ మీద ఖుష్బూ ఓ ప్రకటన చేయొచ్చని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/