Begin typing your search above and press return to search.

తొలిసారి భయంతో వారిద్దరిని మార్చేసిన కిమ్ !

By:  Tupaki Desk   |   15 May 2020 10:34 AM GMT
తొలిసారి భయంతో వారిద్దరిని మార్చేసిన కిమ్ !
X
కిమ్ జోంగ్ ఉన్.. ప్రపంచదేశాలన్నీ కూడా మహమ్మారితో అల్లాడిపోతున్న వేల.. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా వైరల్ గా మారింది. కొద్దిరోజుల పాటు ఆయన కనిపించకపోవడం పెద్ద మిస్టరీ అయితే.. ఆ మిస్టరీ వెనుక దాగున్న రహస్యం మరింత సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే కిమ్ అజ్ఞాతం నుంచి బయటికి వచ్చాక చేసే ప్రతీ చర్య అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దేశ ద్రోహులపై దాడి చేసేందుకు నియంత కిమ్ జోంగ్ ఉన్ పక్కా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు నార్త్ కొరియాలో జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కిమ్ తన దేశ గూఢచారి విభాగానికి చెందిన హెడ్‌ ను, ఆయన అంగరక్షకుడిని మార్చేసినట్లు తెలుస్తోంది.

దీన్ని ఆయన పార్టీలో ఉన్న ముఖ్యులెవరూ కూడా ఊహించలేదని స్థానిక మీడియా వెల్లడించింది. 2019 డిసెంబర్ ‌లో కిమ్, జాంగ్ కిల్ సాంగ్‌ను రికనైసెన్స్ జనరల్ బ్యూరో కి డైరెక్టర్‌గా నియమించినట్లు సియోల్ ఏకీకరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అటు గతంలో ఈ బ్యూరోకి హెడ్‌ గా పని చేసిన లెఫ్టినెంట్ జనరల్ రిమ్ క్వాంగ్-ఇల్‌ను పాలక వర్కర్స్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా కిమ్ నియమించారు. మరోవైపు 2010 నుండి కిమ్‌ను రక్షిస్తున్న ఆర్మీ జనరల్ యున్ జోంగ్-రిన్ స్థానంలో క్వాక్ చాంగ్-సిక్ కొత్త సుప్రీం గార్డ్ కమాండర్‌గా నియమితులయ్యారు. అతను అధికార పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

అయితే , కిమ్ ఈ మార్పులు చేయడానికి పెద్ద కారణం ఉందని అక్కడి అధికారులు అంటున్నారు. ఉత్తరాది గూఢచారి కార్యకలాపాలు, సైబర్ యుద్ధం, దక్షిణ కొరియా, జపాన్, అమెరికా దేశాలపై దాడుల వెనుక రికనైసెన్స్ జనరల్ బ్యూరో హస్తం ఎక్కువగా ఉందని సమాచారం. అంతేకాక 2010లో దక్షిణ కొరియా నావికాదళ ఓడపై దాడి కూడా ఈ ఏజెన్సీ చర్యేనని ఆ దేశ అధికారులు అనుకుంటున్నారు. దీనితో ముందే ప్లాన్‌ను పసిగట్టిన కిమ్.. దక్షిణ కొరియాలో ఉన్న దేశద్రోహులపై రహస్య నిఘా ఉంచేందుకు ఈ చర్యలు చేపట్టారని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. అలాగే మరికొన్ని రోజుల్లోనే కిమ్ కేబినేట్ పొలిట్‌బ్యూరోలో కూడా పలు మార్పులు చేయబోతున్నారని తెలుస్తోంది.