Begin typing your search above and press return to search.

ట్రెండింగ్: కరోనాను మించిన కిమ్..బతికున్నాడా?

By:  Tupaki Desk   |   26 April 2020 6:24 AM GMT
ట్రెండింగ్: కరోనాను మించిన కిమ్..బతికున్నాడా?
X
కిమ్ జాంగ్ ఉన్. ఉత్తరకొరియాను కర్కశంగా పాలిస్తున్న ఈ నియంత గురించే ఇప్పుడంతా చర్చ. కరోనాతో ప్రపంచం ఓవైపు అల్లకల్లోలంగా మారుతున్నా సరే.. కిమ్ కు ఏమైందని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ కరుడుగట్టిన నియంత కుక్కచావు చచ్చాడని కొందరు.? లేదు లేదు బతికే ఉన్నాడని మరికొందరు ఆడిపోసుకుంటున్నారు. అమెరికా - దక్షిణ కొరియా దేశాలు మాత్రం బతికే ఉన్నాడని అంటున్నాయి. అయితే సీఎన్ఎన్ సహా అమెరికా ఇంటెలిజెన్స్ మాత్రం చావు బతుకుల మధ్య ఉన్నాడని అంటున్నాయి. ప్రస్తుతం కిమ్ బతికాడా? చచ్చాడా అనే దానిపై ట్రెండింగ్ అవుతోంది.

*నాడు హిట్లర్.. నేడు కిమ్ జాంగ్

రెండో ప్రపంచయుద్ధంలో మారణహోమం సృష్టించిన హిట్లర్ ఎంత దుర్మార్గుడో అందరికీ తెలిసిందే. అయితే అంతటి కరుడుగట్టిన నియంత కూడా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఆయన బాటలోనే ఉత్తరకొరియా నియంత అధ్యక్షుడు కమ్ జాంగ్ కూడా ఎన్ని దుర్మార్గాలు చేసినా ఇప్పుడు ఆయన గురించే అంతా చర్చ. 2011లో ఉత్తరకొరియా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనకు పోటీగా ఉన్న బంధువులు - కుటుంబ సభ్యులందరినీ చంపించేసి వారి ఆచూకీ సైతం దొరకకుండా చేసిన కిమ్ అణ్వాయుధాలు తయారు చేసి అమెరికాకు పక్కలో బల్లెంలా మారారు. అగ్రరాజ్యాన్నే బెదిరించారు. పక్కనున్న దక్షిణ కొరియా - జపాన్ ను భయపెట్టారు. చైనా అండతో చెలగేరిగిపోయారు. కిమ్ పాలనతో ఉత్తరకొరియా 100 ఏళ్లు వెనుకబడిపోయింది. ఇప్పటికీ ఆ దేశంలో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియదంటే అక్కడి జనాలు ఎంత అనాగరికంగా బతుకుతున్నారో అర్తం చేసుకోవచ్చు. పక్కనున్న దక్షిణ కొరియా ప్రపంచానికే టెక్నాలజీ దిగ్గజంగా ఎదిగితే ఉత్తరకొరియా మాత్రం ఆకలిచావులతో చస్తోంది. ఇప్పుడు అంత దుర్మార్గంగా పాలించిన కిమ్ కు సీరియస్ గా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి..

*చావుబతుకుల మధ్య కిమ్ జాంగ్?

తాజాగా బ్రేకింగ్ న్యూస్ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్టు తెలిసింది. ఇటీవలే ఆయన చేయించుకున్న గుండె సర్జరీ తిరగబెట్టిందని తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ అనుమానిస్తోందట.. దీనికి సీఎన్ఎన్ కథనం కూడా బలాన్ని ఇస్తోంది.

*అనుమానాలకు కారణాలవీ..

ఈనెల 15న ఉత్తర కొరియా జాతి పిత కిమ్ 2 సంగ్ జయంతి వేడుకలు జరిగాయి. ఉత్తరకొరియా ఆవిర్భావానికి ఆయనే ఆద్యుడు. ప్రస్తుతం నియంత కిమ్ జాంగ్ కు తాత. ఈయన జయంతిని ఉత్తరకొరియా అంతటా పండుగలా స్వాతంత్ర్యం దినోత్సవంగా జరుపుతారు. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా హాజరయ్యే కిమ్ జాంగ్ ఈ ఏడు జయంతిలో పాల్గొనకపోవడంతో ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించిందనే వార్త వెలుగుచూసింది. ఈనెల 12న దక్షిణకొరియా వార్త సంస్థలు కూడా కిమ్ జాంగ్ గుండె శస్త్ర చికిత్స ఫెయిల్ అయ్యిందని సీరియస్ గా ఉన్నాడని కథనాలు రాశాయి.

*కిమ్ కు సోకిన వ్యాధి ఏంటి?

ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ‘కార్డియో వాస్కులర్’కు గురయ్యారని తెలిసింది. ఆయన విపరీతంగా పొగతాగడం.. భారీ శరీరం కావడం వల్ల ఈ గుండె వ్యాధి వచ్చిందని.. ఇటీవలే సర్జరీ చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్నారని.. పరిస్థితి సీరియస్ గానే ఉందని వార్తలు వచ్చాయి. అధికారులు ఈ వార్తను బయటకు పొక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట..

*ఈనెల 11 నుంచి కిమ్ జాంగ్ అజ్ఞాతంలోకి..

ఈనెల 11 నుంచి దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఎలాంటి అధికారిక సమావేశాల్లో పాల్గొనడం లేదు. అంతకుముందే ఆయనకు గుండె సర్జరీ జరిగింది. దీంతో ఆరోగ్య పరిస్థితి దిగజారడం వల్లే ఆయన బయటకు రావడం లేదన్న అనుమానాలు కలుగుతున్నాయి.

*సీఎఎన్ కథనంతో కలకలం

తాజాగా ఉత్తరకొరియా నియంత చావుబతుకుల మధ్య ఉన్నాడని అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేస్తోంది. ఆయన గుండె ఆపరేషన్ తిరగబెట్టిందని.. చావుబతుకుల మధ్య ఉన్నాడని కథనం ప్రసారం చేసింది. అయితే ఈ వార్తను కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు, ఉత్తరకొరియా అధికారిక మీడియా ఖండించింది. ఆయన కోలుకుంటున్నారని వెల్లడించాయి.

*వారసులు ఎవరు?

ఒకవేళ కిమ్ జాంగ్ ఆరోగ్య పరిస్థితి విషమించి మరణిస్తే తర్వాత వారసురాలు ఎవరనే ప్రశ్న ఇప్పుడు ఆ దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.ఈ క్రమంలో కిమ్ జాంగ్ ఉన్ వారసత్వాన్ని ఆయన సోదరి ‘కిమ్-యే-జాంగ్’ అందిపుచ్చుకుంటారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఉత్తరకొరియా దేశంపై కిమ్ యే జాంగ్ పూర్తిగా పట్టు సాధించారని సమాచారం. ఈ మేరకు కిమ్ జాంగ్ మరణంతో అక్కడ ఈ నియంత కుటుంబాన్ని కూలదోసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిద్దామని ఎదురుచూస్తున్న దేశాలకు హెచ్చరికలు కూడా పంపినట్టు తెలిసింది.

కిమ్ జాంగ్ ఉన్ లక్షణాలనే చిన్నప్పటి నుంచి ఆయన సోదరి కిమ్ యే జాంగ్ వంటపట్టించుకున్నారట.. వాళ్ల కుటుంబంలో అన్నకు తోడు సర్వాధికారాలు కలిగి ఉంటే దేశంలో పాలనలో తనదైన ముద్ర వేస్తుందట.. ఆ మధ్య దక్షిణ కొరియాను ఈమె కుక్క మొరుగుతోందంటూ హెచ్చరించడం దుమారం రేపింది. కిమ్ జాంగ్ ఉన్ కంటే ఆయన సోదరి మరింత కఠినాత్మురాలు.. డేంజర్ అని ఆ దేశస్థులు చెబుతున్నారు.

అధ్యక్షుడు కిమ్ జాంగ్ పాలన వ్యవహరాల్లో ఒక్క తన చెల్లెలు అయిన కిమ్ యే జాంగ్ నే నమ్ముతారు. విదేశీ నాయకులతో, దక్షిణ కొరియాతో ఎలా డీల్ చేయాలో చెల్లెలు చెప్పినట్టు కిమ్ చేస్తారని ప్రచారంలో ఉంది. దీంతో కిమ్ మరణిస్తే నెక్ట్స్ వారసురాలు ఆమే కానుంది. కిమ్ కంటే కఠినంగా ఈమె ఉంటుందని తెలియడంతో ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి.

*ఉత్తరకొరియాకు చైనా వైద్యబృందం.. కిమ్ పరిస్థితి విషమమేనా?

కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ఇన్ని వార్తలు వస్తున్న వేళ ఆయన నమ్మిన దేశం చైనా అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ముగ్గురు సభ్యుల ప్రముఖ వైద్యుల బృందాన్ని చైనా ఉత్తరకొరియాకు పంపడం హాట్ టాపిక్ గా మారింది. కమ్యూనిస్టు పార్టీకి చెందిన లైనిస్ డిపార్ట్ మెంట్ నేతృత్వంలో ముగ్గురు వైద్యులు ఉత్తరకొరియాకు వెళ్లారు. అయితే కిమ్ ఆరోగ్యంపై మాత్రం చైనా ఎలాంటి ప్రకటన చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా నియంత కిమ్ ఆరోగ్యం నిజంగానే విషమించిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చైనా వైద్య బృందాన్ని ఇంతటి కరోనా టైం లోనూ ఉత్తరకొరియాకు పంపడం తీవ్ర చర్చనీయాంశమైంది. నిజంగానే కిమ్ ఆరోగ్యం క్షీణించి ఉంటుందన్న అనుమానాలకు ఈ చర్య బలాన్నిస్తోంది.

*బయట కనిపించని కిమ్.. సీరియసేనా?

ఇక కిమ్ బాగానే ఉన్నాడని అందరూ చెప్తున్నా ఆయన మాత్రం బయటకు ఎందుకు కనిపించడం లేదన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ట్రంప్ - ఉత్తరకొరియా వెనకేసుకు వస్తున్నా.. కిమ్ మాత్రం మీడియా ముందుకు రావడం లేదు. దీంతో ఏదో జరిగిందన్న అనుమానాలకు చైనా వైద్యబృందం రాక బలాన్ని చేకూరుస్తోంది.

ఇలా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ చుట్టూ ఇన్ని ఊహాగానాలు - వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కిమ్ ఎలా ఉన్నాడు? బతికే ఉన్నాడా? చనిపోయాడా? అన్నది మాత్రం ఎవ్వరికి తెలియడం లేదు. కానీ ఆయన చుట్టూ బోలెడు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కిమ్ గురించే ప్రపంచమంతా ట్రెండ్ అవుతోంది.కరోనా వైరస్ ఇంత తీవ్రంగా ఉన్న ఇంతటి పరిస్థితుల్లోనూ కిమ్ గురించి ట్రెండింగ్ అవుతుందంటే అతిశయోక్తి కాదు..