Begin typing your search above and press return to search.

బోర్డర్ దాటితే కాల్చిపారేయండి : కిమ్!

By:  Tupaki Desk   |   11 Sep 2020 11:30 PM GMT
బోర్డర్ దాటితే కాల్చిపారేయండి : కిమ్!
X
కిమ్ .. ప్రపంచంలోకెల్లా కొంచెం ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన చేసే చేష్టలు, తీసుకునే చర్యలు అన్నీ కూడా ఓ సంచలనమే. ఏది చేసినా కూడా అదొక వార్త అవుతుంది. ఇక విలాసాలకు కొదవేలేదు. ఈ మధ్య ఈయన చనిపోయాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే , అంత ఈజీగా పొతే కిమ్ ఎందుకు అవుతాడు మరి. ఇక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా విషయంలో కిమ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనా నుండి కరోనా కేసులు ఉత్తర కొరియాలోకి ప్రవేశించకుండా ఉండేందుకు కిమ్ జోంగ్ ఉన్ కాల్చేయండంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు దక్షిణ అమెరికా దళాల కమాండర్ వెల్లడించారు.

చైనాకు పొరుగున ఉన్న ఉత్తర కొరియాలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ చైనాతో సరిహద్దులను జనవరిలో క్లోజ్ చేసింది. ఇక జూలైలో దేశ ఎమర్జెన్సీని గరిష్ట స్థాయికి పెంచినట్లు కొరియన్ మీడియా తెలిపింది. ఇక బోర్డర్స్ మూసివేయడంతో స్మగ్లింగ్ వస్తువులకు డిమాండ్ పెరిగిందని.. దీనిపై అధికారులు జోక్యం చేసుకోవాలని యూఎస్ ఫోర్సెస్ కొరియా కమాండర్ రాబర్ట్ అబ్రమ్స్ తెలిపారు. చైనా సరిహద్దుకు ఒకటి లేదా రెండు కిలోమీటర్ల దూరంలో నార్త్ కొరియా బఫర్ జోన్ ‌ను ఏర్పాటు చేసిందని అబ్రమ్స్ అన్నారు. అక్కడ స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్, స్ట్రైక్ ఫోర్సెస్ మోహరించాయని.. చైనా నుంచి అక్రమంగా ఎవరైనా నార్త్ కొరియాలోకి ప్రవేశిస్తే కాల్చి చంపాలని ఉత్తర్వులు జారీ చేశారని ఆయన వెల్లడించాడు.

ఈ విషయం ఇలా ఉంటే .. ఇప్పటికే నార్త్ కొరియాపై ఆర్థిక ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు సరిహద్దులు మూసివేయడంతో ఆ దేశంపై మరింత ప్రభావం పడింది. చైనా నుంచి దిగుమతులు దాదాపు 85 శాతం తగ్గిపోయాయి. మరోవైపు టైఫూన్ మైసక్‌ తో ఉత్తర కొరియా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశం ఇప్పట్లో రెచ్చగొట్టే చర్యలకు దిగడానికి ప్రయత్నించదని అబ్రమాస్ అభిప్రాయపడుతున్నారు. కిమ్ అధికారిక పార్టీ 75వ వార్షికోత్సవం సందర్భంగా.. వచ్చే నెలలో జరిగే వేడుకల్లో కొత్త ఆయుధ వ్యవస్థను ప్రదర్శించే అవకాశం ఉందని రాబర్ట్ అబ్రమ్స్ తెలిపారు.