Begin typing your search above and press return to search.

కిమ్ సంచ‌ల‌నం: అమెరికాతో మాట్లాడతా!

By:  Tupaki Desk   |   6 March 2018 4:21 PM GMT
కిమ్ సంచ‌ల‌నం: అమెరికాతో మాట్లాడతా!
X
ప్ర‌పంచ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే అసాధారణమైన పరిణామం. ఉత్తర - దక్షిణ కొరియాలు మళ్లీ ఒక్కటయ్యే దిశగా కీలక ముందుడుగు పడింది. ఇవాళ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ తో దక్షిణ కొరియా ప్రభుత్వాధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను ఇక అణు పరీక్షలు నిర్వహించబోనని, సౌత్ కొరియాతో చర్చలు కొనసాగిస్తానని కిమ్ హామీ ఇచ్చినట్లు సౌత్ కొరియా నేషనల్ సెక్యూరిటీ చీఫ్ చంగ్ యూ యాంగ్ వెల్లడించారు.

అంతేకాకుండా అమెరికాతో చర్చలకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు కిమ్ చెప్పారని చంగ్ తెలిపారు. దశాబ్దం తర్వాత రెండు కొరియాలు కలిసి వచ్చే నెలలో ఓ సదస్సు నిర్వహించడానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ స‌మావేశంలోనే సౌత్ కొరియా అధ్య‌క్షుడు మూన్ జేను కిమ్ తొలిసారి క‌లువ‌నున్నారు. చివరిసారి 2007లో అప్పటి సౌత్ కొరియా అధ్యక్షుడు రో మూ హ్యున్.. ఇప్పటి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ తండ్రి కిమ్ జాంగ్ 2తో కలిసి సదస్సు నిర్వహించారు.

తాజాగా ఈ ఉమ్మడి సదస్సు సౌత్ కొరియాలోని పాన్‌ మున్‌ జామ్ పీస్ హౌజ్‌ లో జరపాలని నిర్ణయించారు. ఇక రెండు దేశాల అధ్యక్షులు మాట్లాడుకునేలా హాట్‌ లైన్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. సౌత్ కొరియా అధ్యక్షుడు మూన్ జే.. చంగ్‌ తోపాటు మరో నలుగురు ప్రభుత్వ అధికారులను సోమవారం ప్యాంగ్యాంగ్‌ కు పంపించారు. ఈ పర్యటనలో భాగంగా అధ్యక్షుడు కిమ్‌తోపాటు ఆయన సహాయకులతో సమావేశమయ్యారు. 2011లో కిమ్ జాంగ్ ఉన్ అధికారం చేపట్టిన తర్వాత సౌత్ కొరియా అధికారులతో సమావేశం కావడం ఇదే తొలిసారి.