Begin typing your search above and press return to search.

అలా చేస్తే మజ్లిస్ కి ఓటేసినట్లేనా?

By:  Tupaki Desk   |   13 Jan 2016 6:24 AM GMT
అలా చేస్తే మజ్లిస్ కి ఓటేసినట్లేనా?
X
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎవరికి వారు.. తమ రాజకీయ ప్రయోజనాలకు కొత్తగా.. సరికొత్తగా మాటల దాడి మొదలెట్టారు. ప్రతి విషయానికి సరికొత్త విశ్లేషణ చేయటం కనిపిస్తోంది. మజ్లిస్ కు నేరుగా ఓటేయకున్నా.. టీఆర్ ఎస్ పార్టీకి ఓటేసిన పక్షంలో ఓవైసీ పార్టీని గెలిపించినట్లేనంటూ కొత్త లెక్క చెబుతున్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి.

తన మాటకు ఆయన వినిపిస్తున్న వాదన ఏమిటంటే.. టీఆర్ ఎస్ కు ఓటేస్తే గ్రేటర్ పీఠంపై మజ్లిస్ కూర్చోబెట్టినట్లేనని వ్యాఖ్యానించారు. ఎందుకంటే.. మజ్లిస్ ఎజెండానే టీఆర్ ఎస్ ఫాలో అవుతుందని చెబుతున్న ఆయన.. మజ్లిస్ కబంధ హస్తాల నుంచి హైదరాబాద్ ను విముక్తి చేసేందుకు హైదరాబాదీయులు కదలిరావాలంటూ కిషన్ రెడ్డి పిలుపునిస్తున్నారు. టీఆర్ ఎస్ ‘కారు’ స్టీరింగ్ లో మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు.

అందుకే.. టీఆర్ ఎస్ కు ఓటేస్తే.. నేరుగా మజ్లిస్ కు ఓటేసినట్లుగా తమదైన విశ్లేషణ చేస్తున్నారు. మరి.. కిషన్ రెడ్డి మాటకు గ్రేటర్ ప్రజలు ఏ మేరకు స్పందించారన్నది తేలాలంటే ఫిబ్రవరి మొదటి వారం వరకూ వెయిట్ చేయాల్సిందే.