Begin typing your search above and press return to search.

విండీస్‌తో టీ20లకు కోహ్లిపై వేటు.. వయా గాయం.. విశ్రాంతి

By:  Tupaki Desk   |   14 July 2022 12:30 PM GMT
విండీస్‌తో టీ20లకు కోహ్లిపై వేటు.. వయా గాయం.. విశ్రాంతి
X
అంతా అనుకున్నట్లే అవుతోంది.. టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లికి ఎదురుగాలి తగులుతోంది. అతడికి ఇక టి20 జట్టులో చోటు కష్టమే. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ వంటి కుర్రాళ్ల జోరులో కోహ్లి వెనుకబడిపోతున్నాడు. ఈ నెల ఆఖరులో వెస్టిండీస్ తో జరుగనున్న టి20 సిరీస్ కు కోహ్లి లేకుండానే టీమిండియాను ప్రకటించారు. ఇందులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా లేడు. వీరిద్దరికీ విశ్రాంతి ఇచ్చినట్లు సెలక్టర్లు చెబుతున్నారు. అయితే, బుమ్రాకు విశ్రాంతి వరకు ఓకే కానీ.. కోహ్లిది మాత్రం వేటే. అతడికి ప్రస్తుతానికి టి20 జట్టులో చోటు ప్రశ్నార్థకమే.

ఇంగ్లండ్ తో వన్డేలకూ..వాస్తవానికి విరాట్ కోహ్లి ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డేలకు కూడా అందుబాటులో లేడు. గజ్జల్లో గాయంతో అతడు తొలి మ్యాచ్ ఆడలేదు. గురువారం జరిగే రెండో వన్డేలో కూడా కోహ్లి ఆడబోవడం లేదు. చివరి వన్డేకూ అనుమానమే. అసలు ఇక్కడే తెలిసిపోతోంది.. కోహ్లి పరిమిత ఓవర్ల క్రికెట్ భవితవ్యం. ఇంగ్లండ్ తో రెండో, మూడో టి20ల్లో ఆడిన కోహ్లి విఫలమయ్యాడు. దీంతోనే అతడిని పొట్టి ఫార్మాట్ కు పరిగణించడం అవసరమా? అని విమర్శకుల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఇక వెస్టిండీస్ తో టి20 సిరీస్ కు కోహ్లి లేకుండానే భారత జట్టు ప్రకటనను చూస్తే పొట్టి ఫార్మాట్ లో విరాట్ శకం ముగిసినట్లే అని చెప్పవచ్చు.

విశ్రాంతి కాదు వేటే..వాస్తవానికి ఐపీఎల్ తర్వాత కోహ్లి పెద్దగా క్రికెట్ ఆడిందే లేదు. నేరుగా ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ తప్ప. లీసెస్టర్ షైర్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లో 33, 67 పరుగులు చేసిన అతడు ఫర్వాలేదని అనిపించాడు. రెండో టి20 నుంచి జట్టులోకి వచ్చినా..1, 11 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతోపాటు ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు గజ్జల్లో గాయం పేరిట దూరం గా ఉన్నాడు. ఈ ప్రకారం చూస్తే మూడో వన్డే కూడా ఆడడం అనుమానమే. ఇక ఎలాగూ వెస్టిండీస్ తో టి20 సిరీస్ కు అతడికి విశ్రాంతి పేరిట చోటివ్వలేదు. వాస్తవానికి ఫామ్ లో లేని మిగతా బ్యాట్స్ మన్ ను ఈ విధంగా తప్పించడాన్ని వేటు అంటారు. కోహ్లి స్థాయికి అది తగదు కాబట్టి విశ్రాంతిగా చెబుతున్నారు.

కేఎల్ రాహుల్ పునరాగమనం..సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా వంటి కుర్రాళ్లతో టి20 జట్టు నిండిపోయింది. వీరికితోడు ఓపెనర్ కేఎల్ రాహుల్. ఇప్పుడతడు వైస్ కెప్టెన్ కూడా. దీంతోపాటు గాయం నుంచి కోలుకున్న రాహుల్ ను విండీస్ తో టి20లకు ఎంపిక చేశారు.

ఈ లైనప్ ను బట్టి చూస్తే. కోహ్లికి చోటు కష్టమే. కాగా , వెస్టిండీస్ తో టి20లకు 18 మంది సభ్యులతో కూడిన జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. జులై 22 నుంచి విండీస్‌ పర్యటనను భారత్‌ ప్రారంభిస్తుంది. తొలుత మూడు వన్డేల సిరీస్‌లో విండీస్‌తో తలపడనుంది. జులై29 నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌కు జట్టులోకి సీనియర్‌ స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్‌లకు స్థానం కల్పించగా.. ఉమ్రాన్‌ మాలిక్‌కు అవకాశం
దక్కలేదు.

వెస్టిండీస్ తో టి20లకు టీమ్‌ఇండియా జట్టు రోహిత్‌ (కెప్టెన్), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్ యాదవ్, దీపక్‌ హుడా, శ్రేయస్‌ అయ్యర్, దినేశ్ కార్తిక్‌‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్,‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, రవి బిష్ణోయ్‌, కుల్‌దీప్ యాదవ్‌, భువనేశ్వర్ కుమార్‌‌, అవేశ్ ఖాన్‌, హర్షల్ పటేల్‌‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.