Begin typing your search above and press return to search.

కోమటిరెడ్డి 15 రోజుల గడువు అందుకేనట?

By:  Tupaki Desk   |   30 July 2022 12:31 PM GMT
కోమటిరెడ్డి 15 రోజుల గడువు అందుకేనట?
X
'సింహం సింగిల్ గా వస్తుంది' అన్న డైలాగ్ కొడుదామనుకున్నా కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ధైర్యం సరిపోవడం లేదట.. గుంపులుగా వెళ్లడానికే డిసైడ్ అయిపోతున్నాడట.. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీలోకి వెళ్లడానికి తటపటాయిస్తున్నాడు. పైకి ఎన్ని భారీ డైలాగులు చెప్పినా.. ఆయన అనుచరులు, సన్నిహితులు చేయి జారిపోతుంటే కోమటిరెడ్డి అడుగు ముందుకుపడడం లేదట.. అందుకే కేసీఆర్ ను తిడుతూ కాస్త టైం పెంచుకునే పనిలో పడ్డారు.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నోరు విప్పారు. ఎట్టకేలకు సంచలన వ్యాఖ్యలు చేశారు.మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమంటూ ఆయన వ్యాఖ్యానించారు. శనివారం సీనియర్లు ఉత్తమ్, వంశీచంద్ రెడ్డితో భేటి అనంతరం మీడియాతో మాట్లాడారు. మునుగోడు ప్రజలు భావిస్తే ఉప ఎన్నిక వస్తుందని.. ఉప ఎన్నికపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు. మునుగోడు తీర్పు తెలంగాణలో మార్పునకు నాంది పలకాలన్నారు.

ఈ ఉప ఎన్నికతో తెలంగాణలో తప్పక మార్పు వస్తుందని.. నేను కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తున్నానని కోమటిరెడ్డి పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. రాబోయే 15 రోజుల్లోనే తన నిర్ణయం ఉంటుందని రాజీనామాపై కోమటిరెడ్డి సంచలన ప్రకటన చేశారు.

ఇక కోమటిరెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి వెళ్లడంపై కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమైంది. వెంటనే ఉత్తమ్, వంశీచంద్ రెడ్డిలను పంపి రాహుల్ గాంధీతో ఫోన్ లో మాట్లాడించినట్టు సమాచారం. కోమటిరెడ్డి మాత్రం రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదని డిసైడ్ అయినట్టు సమాచారం.

అయితే ఇప్పటికే కోమటిరెడ్డి సన్నిహితులు, నేతలు అంతా టీఆర్ఎస్ లో చేరిపోయారు. రాజీనామా చేస్తే కోమటిరెడ్డి మునుగోడులో గెలిచే పరిస్థితి లేదని క్షేత్రస్థాయిని బట్టి ఆయనకు అర్థమైందని.. అందుకే రాజీనామాపై 15 రోజుల గడువు పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోందని ప్రచారం సాగుతోంది.

కోమటిరెడ్డి తనతోపాటు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలను సమీకరించి వారందరితో కలిపి బీజేపీలోకి వెళదామని అనుకున్నాడని.. కానీ ఈయన కింద ఉండే ముఖ్యమైన కార్యకర్తలే హ్యాండ్ ఇచ్చినట్టు సమాచారం. చాలా మంది రాజగోపాల్ రెడ్డితో వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదట.. ఈ క్రమంలోనే తెలంగాణలో తనతోపాటు వచ్చే నేతల కోసం ఎదురుచూస్తూ 15 రోజుల గడువును రాజగోపాల్ రెడ్డి పెట్టుకున్నాడని ప్రచారం సాగుతోంది. ఇంకా కొంతమంది తనతోపాటు బీజేపీలోకి వస్తే తనకు పలుకుబడి ఉంటుందని ట్రై చేస్తున్నాడని.. కానీ రాజగోపాల్ రెడ్డిని నమ్మి వచ్చేవారు లేరని.. కానీ జనాలు ఇతడిపై అంత పాజిటివ్ గా లేకపోవడంతో తటపటాయిస్తున్నాడని సమాచారం. ఒంటరిగా వెళ్లడం ఇష్టం లేకనే 15 రోజుల గడువు పెట్టినట్టు తెలుస్తోంది.