Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డి పాద‌యాత్ర...కానీ ఒక్క ష‌ర‌తూ

By:  Tupaki Desk   |   13 July 2017 5:15 AM GMT
కోమ‌టిరెడ్డి పాద‌యాత్ర...కానీ ఒక్క ష‌ర‌తూ
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మ‌రోమారు విరుచుకుప‌డ్డారు. స్వ‌రాష్ట్ర ప‌రిపాల‌న‌తో త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని భావించార‌ని అయితే ప్ర‌జల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంద‌ని కోమ‌టిరెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిగ్గుపడాలని కోమటిరెడ్డి అన్నారు. ఇటువంటి చెత్త పాలన గతంలో తానెన్నడూ చూడలేదని ఆయ‌న మండిప‌డ్డారు. తెలంగాణ స‌ర్కారు తీరుపై అన్నివ‌ర్గాల్లో అసంతృప్తి ఉంద‌ని చెప్పారు.

టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్టు కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి వెల్లడించారు. ఈ పాదయాత్రకు తెలంగాణ పీసీసీతో సంబంధం లేకుండానే నిర్వహిస్తానని చెప్పారు. ఏఐసీసీ అనుమతి వచ్చిన వెంటనే కాంగ్రెస్‌ నేత హోదాలో పాదయాత్రను ప్రారంభిస్తానని చెప్పారు. ఈ విష‌యంలో ఇప్ప‌టికే త‌న అభిప్రాయాలు వెల్ల‌డించిన‌ట్లు కోమ‌టిరెడ్డి తెలిపారు. ఈ యాత్ర సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను క‌లిసి వారి ఆవేద‌న‌ను తెలుసుకొని ప‌రిష్కారం కోసం ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌డంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతానికి కృషిచేస్తామ‌ని ప్ర‌క‌టించారు. 540 గ్రామాలకు మంచి నీరందించే ఉదయ సముద్రం ఎండిపోతోందని, అధికారులు మంత్రి హరీశ్‌ రావు దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోవటం లేదని కోమ‌టిరెడ్డి ఆరోపించారు.