Begin typing your search above and press return to search.

బాబును తిట్టేందుకు కొత్త ఆప్ష‌న్ ఎంచుకున్న కేటీఆర్‌

By:  Tupaki Desk   |   12 Sep 2018 5:21 PM GMT
బాబును తిట్టేందుకు కొత్త ఆప్ష‌న్ ఎంచుకున్న కేటీఆర్‌
X
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. మ‌హాకూట‌మి రూపంలో టీఆర్ ఎస్ పార్టీకి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌-టీడీపీ-సీపీఐ జ‌ట్టుక‌ట్టి ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌ ను ఆయా పార్టీల నేత‌లు టార్గెట్ చేసి విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న క్ర‌మంలో అధికార పార్టీ సైతం అదే రీతిలో ఘాటుగా స్పందిస్తోంది. తాజాగా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌యుడైన మంత్రి కేటీఆర్ వినూత్న రీతిలో విరుచుకుప‌డ్డారు. మాజీ స్పీక‌ర్ సురేశ్ రెడ్డితో పాటు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ బండారి లక్ష్మారెడ్డి - కరీంనగర్ కాంగ్రెస్ నేత - మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ ఇత‌ర నేతలకు గులాబీ కండువా కప్పి సీఎం కేసీఆర్ టీఆర్‌ ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని స్థానాల్లో టీఆర్‌ ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అనంత‌రం ప్ర‌తిపక్ష‌ కాంగ్రెస్‌ - టీడీపీలపై కేటీఆర్ విరుచుకుప‌డ్డారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి - టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్ రమణలు ఇద్దరు గడ్డపోళ్లేన‌ని - ఆ ఇద్ద‌రూ ఒక్కటయ్యారని చిత్ర‌మైన పోలిక‌తో ఆరోపించారు. ``కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడానికి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. కానీ చంద్ర‌బాబు అదే పార్టీతో పొత్తుపెట్టుకున్నారు. జగుస్సాకరమైన - నీచమైన ఆ రెండు పార్టీల కలయిక వల్ల ప్రజలకు ఒక సువర్ణావకాశం దొరికింది. 65 ఏళ్లు రైతులను రాబందుల్లా పీక్కుతిన్న వాళ్లు రావాలా....రైతు బంధువుగా మారిన ప్రభుత్వం రావాలో తేల్చుకునే సమయం వచ్చింది. ముదిగొండ - బషీర్‌ బాగ్‌ లో రైతులపై కాల్పులు జరిపిన కాంగ్రెస్ - టీడీపీలు రెండు ఒక్కటైనాయి. దశాబ్దాలపాటు పాలించినా కరెంటు ఇవ్వకుండా రైతులను గోస పుచ్చుకున్న రెండు పార్టీలు ఒకవైపు... 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తూ రైతులకు నాయకత్వం వహిస్తున్న టీఆర్‌ ఎస్ మరోవైపు ఉన్నాయి. కాంగ్రెస్ - టీడీపీ పార్టీల దురాగతాలు ఒకటీ రెండు కాదు. ఆ రెండు పార్టీలను వాయించి కొట్టే అవకాశం ఒకేసారి తెలంగాణ ప్రజలకు దొరికింది. స్వియ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని జయశంకర్ సార్ అనేవారు. మరోసారి మనం కట్టుబానిసలుగా మారి ఢిల్లీ - అమరావతి వైపు చుద్దామా... టీఆర్‌ ఎస్ పార్టీకి పట్టంగట్టి గల్లీ నాయకత్వం వైపు చూద్దామా?`` అంటూ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి - అమ‌రావ‌తికి లింక్ పెట్టారు.

మ‌రోవైపు గ‌బ్బ‌ర్‌ సింగ్ అనే పాత కామెంట్‌ ను మ‌రోమారు కేటీఆర్ విర‌మించుకున్నారు. ``కేవలం నాలుగేళ్లలోనే కాలంతో పోటీ పడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం. గడ్డం పెంచుకున్న ప్రతీ ఒక్కరూ గబ్బర్ సింగ్‌ లు కారు. ఎన్నికలు అర్థరాత్రి వచ్చినా తయార్ అన్నవారంతా ఎన్నికల కమిషన్ ముందు ఇప్పుడు అక్కరలేదంటున్నారు. ఆ పార్టీల‌కు బుద్ధి చెప్పాల్సిందే`` అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్ర‌జ‌లు త‌మ‌కు మేలు చేసిన పార్టీకి ప‌ట్టం క‌ట్టేందుకు సిద్ధఃగా ఉంనన్నార‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.