Begin typing your search above and press return to search.

బాబు నామరూపాల్లేకుండా పోతాడన్న కేవీపీ

By:  Tupaki Desk   |   8 Sep 2016 9:54 AM GMT
బాబు నామరూపాల్లేకుండా పోతాడన్న కేవీపీ
X
ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం ఏర్పడిందని.. చంద్రబాబు నామరూపాల్లేకుండా పోయే రోజు దగ్గర్లోనే ఉందని కేవీపీ అన్నారు. కేంద్రం మాటల్ని సమర్థించిన చంద్రబాబు అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారని కేవీపీ హెచ్చరించారు.

‘‘ఈ ప్యాకేజీల ద్వారా వచ్చే ప్రయోజనాలు మీకు అందుతూనే ఉంటాయి. చాలా వాటిల్లో మీకు రావాల్సింది మీరు తీసుకుంటూనే ఉన్నారు. వాటితోనే రాజీపడి పోతున్నారు. రేపు పోలవరం ప్రాజెక్టు అంతర్ రాష్ట్రాల సమస్యగా మారి.. దాన్ని పరిష్కరించుకోలేక ఏదైనా సమస్య వస్తే.. అది కేవలం చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసమే వస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి పబ్బం గడుపుకుంటున్నావు చంద్రబాబూ. తేడా వస్తే నామరూపాల్లేకుండా పోతావ్. ఈ విషయంలో చంద్రబాబును హెచ్చరిస్తున్నా" అని కేవీపీ అన్నారు.

విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని.. అధికారంలో ఉన్నవారు మాట తప్పారని కేవీపీ ఆరోపించారు. ఇప్పటికైనా భాజపా ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలన్నారు. ఈ నెల 10న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జాతీయ రహదారులను ముట్టడించి.. నిరసనలను విజయవంతం చేయాలని కేవీపీ పిలుపునిచ్చారు. చంద్రబాబుకు కనువిప్పు కలిగించేలా యువత కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.