Begin typing your search above and press return to search.

బాబూ.. జగన్... రాజధానిని కట్టేదెవరు...?

By:  Tupaki Desk   |   26 March 2022 9:33 AM GMT
బాబూ.. జగన్... రాజధానిని  కట్టేదెవరు...?
X
ఏపీకి రాజధాని అతి పెద్ద సమస్యగా మారింది. మారింది అనడం కంటే మార్చారూ అనడం సబబు. ఆ మార్చింది కూడా వరసగా అధికారం చేపట్టిన ఇద్దరు అగ్ర నేతలు. ఒకరు తలపండిన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు అయితే మరొకరు యువ ముఖ్యమంత్రి జగన్. మరి ఈ ఇద్దరూ రాజధాని కట్టలేరా అంటే టీడీపీ వారేమో జగన్ కి చేతకాదు అంటారు. వైసీపీ నేతలు బాబు వల్ల కానే కాదు అనేస్తున్నారు.

అమరావతి వట్టి భ్రమరావతి అని వైసీపీ తీసిపారేస్తోంది. యాభై వేల పై చిలుకు ఎకరాలలో అమరావతి రాజధాని కట్టడానికి ఎన్నేళ్ళు పడుతుంది అని ఏకంగా జగన్ బిగ్ క్వశ్చన్ రైజ్ చేశారు. చంద్రబాబుకి విజన్ ఉంటే గుంటూర్ లోనో విజయవాడ లోనో అయిదు వందల ఎకరాలలో రాజధాని కట్టి ఉండేవారు అని కూడా అంటున్నారు. ఇపుడు అమరావతిని నెత్తికెత్తున్న బాబు తమను కట్టమంటున్నారని గుస్సా అవుతున్నారు.

మొత్తానికి జగన్ కానీ ఇతర వైసీపీ నేతలు కానీ తేల్చేది ఏంటి అంటే అమరావతిని తామే కాదు, బాబు కూడా కట్టలేరని, టోటల్ గా అది ఊహకు అందని ప్రాజెక్ట్ గానే మిగిలిపోతుందని అంటున్నారు. సో మూడు రాజధానుల కాన్సెప్ట్ బెస్ట్ అని వారు చెప్పుకుంటున్నారు.

పోనీ అదేమైనా అయ్యే పనా అంటే జగన్ కి చేతగాకనే ఇలా మూడు అంటూ జనాల మూడ్ మారుస్తున్నారని టీడీపీ యువ నేత లోకేష్ అంటున్నారు. జగన్ కి నిజంగా రాజధాని కట్టే పరిస్థితి ఉంటే దాని కంటే ముందు రోడ్లను చిల్లు పెడుతున్న గుంతలను అర్జంటుగా పూర్తి చేయమండి చూద్దామని చినబాబు సవాల్ చేస్తున్నారు.

అంటే రోడ్లనే బాగు చేయలేని వైసీపీ పెద్దలు మూడు రాజధానులు కడతారంటే జనాలు నమ్మాలా అని లోకేష్ లాజిక్ పాయింటే తీస్తున్నారు. నిజానికి ఇది జనాలు కూడా నమ్మలేనిదిగానే ఉంది. రోడ్లు గత మూడేళ్ళుగా గుంతలతో ఉన్నాయి. ఈ రోజుకీ వాటికీ అతీ గతీ లేదు. మరి మూడు రాజధానులు మేమే కడతామని అధికార పార్టీ చెబితే నమ్మబుల్ గా లేదనే జనాల మాట.

అదే సమయం లో వారేమీ అమరావతిని చూసి కూడా మురిసి పోవడం లేదు. ఏపీకి డబ్బులు లేవు, కేంద్రం సాయం చేయదు. అలాంటి వేళ గొప్పలకు పోయి గత టీడీపీ అమరావతి పేరిట బాహుబలి ప్రాజెక్ట్ ని భుజాల‌లకు ఎత్తుకుందన్నదే కామన్ మ్యాన్ పాయింట్. అంటే అమరావతి వర్కౌట్ కాదు, మూడు రాజధానులూ అయ్యే సీన్ లేదు. మరి ఏంటి మార్గం. ఏపీకి అసలు రాజధాని ఉంటుందా అంటే మెజారిటీ జనాలు కానీ మేధావులు కానీ చెప్పే మాట ఒక్కటే.

ఈ రెండు పార్టీలు ఇగోలకూ పంతాలకూ పోకుండా రాజధాని మీద ఏకాభిప్రాయానికి రావాలన్నదే జనాలు చెప్పే హితవు. అమరావతిలోనే రాజధానిని ఉంచినా ఈ నాటికి ఎంత అవసరమో అంత మేరకు మాత్రమే నిర్మాణాలు చేసి మిగిలినది భవిషత్తు అభివృద్ధికి వదిలేయాలి.

ఇక జగన్ కోరుకున్నట్లుగా విశాఖను, కర్నూల్ ని కూడా డెవలప్ చేయాలి. అదే విధంగా అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలి. ఈ విషయంలో రాజధానుల పేరిట రాజకీయం మాత్రం ఎవరూ చేయరాదు. ఇదే ఏపీలో మెజారిటీ సెక్షన్ల నుంచి వినిపిస్తున్న మాట. అంటే బాబుదీ రైట్ కాదు, జగన్ దీ కరెక్ట్ కాదు. ఏపీ సేఫ్ గా ఉండాలీ అంటే రాజధాని విషయంలో రాజీ ధోరణికే అంతా రావాలి. మరి అది అయ్యే పనేనా.