Begin typing your search above and press return to search.

దేశంలో కోవిడ్ నాలుగో వేవ్ పై కేంద్రం హై అలర్ట్..!

By:  Tupaki Desk   |   17 March 2022 7:29 AM GMT
దేశంలో  కోవిడ్ నాలుగో వేవ్ పై కేంద్రం హై అలర్ట్..!
X
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. చివరిగా విజృంభించిన ఒమిక్రాన్ తోనే కోవిడ్ ముప్పు పోయింది అని అందరూ అనుకున్నారు. కానీ అతి త్వరలోనే కరోనా నాలుగో వేవ్ రానుంది అనే వార్త ఇటు ప్రజలు, అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల్లో ఇద్దరిలోనూ వణుకు పుట్టిస్తుంది.

ఇంతకీ కోవిడ్ నాలుగో వేవ్ రాబోతుందా లేదా అనే దాని ప్రస్తుతం ఎవరి దగ్గర కచ్చితమైన సమాచారం లేదు. కానీ వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఆనవాళ్లు కూడా చూపిస్తున్నారు. త్వరలోనే కరోనా మరోసారి కరాళ నృత్యం చేస్తుందని అంటున్నారు.

ఇప్పటికే ఒమిక్రాన్ తో మూడో వేవ్ ను చూశాము. అయితే ఈ కొత్త వేరియంట్ నే ప్రస్తుతం నాలుగో వేవ్ కు కూడా కారణం అవుతుందని చెబుతున్నారు. భారత్ లో కరోనా కేసులు చాలా తక్కువగా నమోదు అవుతున్నప్పటికీ... ప్రపంచ దేశాల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కొత్త వేరియంట్ దాటికి చాలా దేశాలు వణికిపోతున్నాయి. మన దేశంతో సరిహద్దు పంచుకునే దేశమైన చైనాలో కూడా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా పెరిగినట్లు చైనా అధికారులు తెలిపారు. ఇప్పటికే చాలా ప్రావిన్సు ల్లో లాక్ డౌన్ విధించినట్లు తెలిపారు. కరోనా కు పుట్టినిల్లు అయిన చైనాలో వైరస్ విజృంభించడంతో ఇతర దేశాల్లో కంగారు మొదలైంది. ఇప్పటికే లక్షల కొలది మరణాలు చవి చూసిన ప్రపంచ దేశాలు కొవిడ్ నాలుగో వేవ్ వస్తే పరిస్థితి చేయి దాటే అవకాశం లేకపోలేదు అని అభిప్రాయపడుతున్నారు.

ఇది విషయం భారత్ ను కూడా కలవర పాటకు గురి చేస్తుంది. దేశంలో కూడా వైరస్ కేసులు పెరిగితే నాలుగో వేవ్ వస్తుందని చెబుతున్నారు. కొవిడ్ కేసులు భారీగా పెరగడం చూసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అలర్ట్ అయ్యాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత చాలా ప్రాంతాల్లో పాఠశాల ఓపన్ చేశారు.

కోవిడ్ నియమాలు పాటించే వారి సంఖ్య కూడా భారీ గానే తగ్గింది. మాస్క్ ధరించే వారు తక్కువ అయ్యారు. భౌతిక దూరం పాటించే వారు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. దీంతో కోవిడ్ మరోసారి విరుచుకు పడవచ్చు అని పేర్కొంటుంది కేంద్రం.

కరోనా వైరస్ కు సంబంధించిన గత అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న కేంద్రం... వైరస్ వ్యాప్తి తగిన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు హెచ్చరించిన కేంద్రం.. ఆయా శాఖ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ కూడా సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.

దీనిలో అధికారుల‌కు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా వైరస్ వ్యాప్తి, కేసుల వృద్ధి, జీనోమ్ సీక్వెన్స్, వంటి మూడు అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. దీనితో పాటే కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో తగు చర్యలు చేపట్టేందుకు వెనకాడ వద్దని సూచించారు.

కేంద్రం అంచనాల ప్రకారం నాలుగో వేవ్ లో దెబ్బతినే కీలక రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి మద్దతు అయినా అందించేందుకు సిద్దం గా ఉన్నట్లు అధికారులతో మాండవీయ తెలిపారు. కేసులు ప్రస్తుతం ఎక్కువగా నమోదు అయ్యే ప్రాంతాలుగా ఆగ్నేయాసియా, చైనా, యూరప్‌ లుగా గుర్తించింది కేంద్రం. ఈ దేశం నుంచి వచ్చే వారు కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో అయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.

భారత్ లో గురువారం కొత్తగా 2,539 మందిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో 60 మందికి పైగా వైరస్ కు బలి అయ్యారు . నాలుగు వేల నాలుగు వందల మంది వైరస్ ను జయించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 5,16,132 మంది మొదటి మూడు వేవ్ లలో చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.