Begin typing your search above and press return to search.

గ్రేటర్లో పార్టీ పూర్వవైభవం తేవడానికి కసరత్తు..

By:  Tupaki Desk   |   24 Feb 2022 10:30 AM GMT
గ్రేటర్లో పార్టీ పూర్వవైభవం తేవడానికి కసరత్తు..
X
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే..!! కాంగ్రెస్ కు కొత్త కార్యవర్గం ఏర్పాటైన సందర్బంగా పార్టీ ఉత్సాహం నెలకొంది. దీంతో ఇక పార్టీకి పూర్వ వైభవం వచ్చినట్లేనని అందరూ హర్షం వ్యక్తం చేశారు. అయితే కొద్ది రోజులుగా పార్టీ పరిస్థితి మరోసారి దిగజారుతోంది. ఇటీవల నిర్వహించిన సభ్యత్వ కార్యక్రమంలో పరాభావం ఎదురైనట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో అత్యల్పంగా సభ్యత్వం నమోదైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని స్థానిక నాయకులను ఎంగరేజ్ చేయనున్నారు.

తెలంగాణలో ఏడేళ్లుగా కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారింది. 2014 ఎన్నికల్లో పార్టీ నుంచి కొందరు గెలిచినా.. ఆ తరువాత కొందరు గులాబీ తీర్థం తీర్చుకున్నారు. ఇక 2019లో అడపా దడపా పార్టీ నుంచి గెలిచినా ఉన్నవారిలో దాదాపు పదవులకుఆశపడి కాంగ్రెస్ ను వీడారు. దీంతో కాంగ్రెస్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారింది. దీంతో కిందిస్థాయి కేడర్లోనూ నిరుత్సాహం నెలకొనడంతో పార్టీ గురించి ఎవరూ పట్టించుకోలేదు. పార్టీలో కొందరు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నా.. లేనట్లే కనిపించారు.

అయితే ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పజెప్పడంతో పార్టీలో ఉత్సాహం నెలకొంది. మరోసారి పార్టీకి పూర్వవైభవం వస్తోందని ఆశపడ్డారు. అంతేకాకుండా గతంలో రెడ్డి నాయకత్వంలో పార్టీ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పార్టీని ఆ స్థాయిలోకి తీసుకొస్తారని భావించారు. ఈ క్రమంలో పార్టీ కేడర్ సైతం ఉత్సాహంతో ముందుకెళ్లింది. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి సైతం గిరిజన దండోరా లాంటి సభలు నిర్వహిస్తూ పార్టీలో ఉత్సాహాన్ని నింపారు.

కానీ కొన్ని రోజులుగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ అధ్యక్షుడిపై సంచలన కామెంట్స్ చేయడంతో పాటు తనను కోవర్టు అంటారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇక ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం పార్టీలో అందరం కలిసే ఉన్నామని చెబుతూ వస్తున్నారు.

అయితే ఇటీవల తెలంగాణ పార్టీ సభ్యత్వ కార్యక్రమం చేపడితే సికింద్రాబాద్లోనే అత్యల్పంగా నమోదైంది. పార్లమెంట్ స్థానాల్లో నల్గొండ మొదటి స్థానంలో నిలవగా.. ఆ తరువాతి స్థానాల్లో పెద్దపల్లి, మల్కాజిగిరి నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు నాలుగు లక్షల సభ్యత్వాలతో ముంజంజలో ఉన్నాయి. అయితే అత్యల్పంగా నమోదైన వాటిలో ఆదిలాబాద్ తో పాటు సికింద్రాబాద్ కూడా ఉండడం గమనార్హం. ఈ నియోజకవర్గాల్లో కేవలం లక్షలోపు సభ్యత్వాలు మాత్రమే నమోదయ్యాయి.

దీంతో పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. ఇంత తక్కువగా సభ్యతం నమోదు కావడానికి కారణాలు తెలుసుకునేందుకు సీనియర్ నాయకులను అలర్ట్ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల పట్ల, రాజకీయాల పట్ల ఉత్సాహం చూపకుండా సైలెంట్ గా ఉన్నవాళ్లను అలర్ట్ చేయడానికి సిద్ధమైంది. ముఖ్యంగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, ముషీరాబాద్, గోషామహల్, సికింద్రాబాద్ స్థానాలపై దృష్టిపెట్టాలని నిర్ణయించింది. ఈ నియోజకవర్గాలు ఒకప్పుడ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉండేవి. కానీ ఈ స్థానాల్లో కొన్నింటిని గులాబీ పార్టీ లాగేసుకుంది. అయితే కనీసం సభ్యత్వ నమోదులోనూ వెనుకబడే ఉండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైన పార్టీని పట్టించుకోకపోతే చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. దీంతో ఈసారి ఎలాగైనా అత్యధిక స్థానాల్లో గెలిచి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని సంకల్పించింది.

ఇందులో భాగంగా రేవంత్ జూబ్లిహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డిని కలిసి యాక్టివ్ రోజల్ తీసుకోవాలని కోరారు. తాజాగా ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, మాజీ మంత్రి గీతారెడ్డి రంగంలోకి దిగారు. సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని కోరారు.