Begin typing your search above and press return to search.

నో పవర్ షేర్...టీడీపీ మాస్టర్ ప్లాన్ ... ?

By:  Tupaki Desk   |   30 March 2022 11:30 AM GMT
నో పవర్ షేర్...టీడీపీ మాస్టర్  ప్లాన్ ... ?
X
ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులతో వెళ్లాలని టీడీపీ భావిస్తోంది. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు. ఒంటరిగా వెళ్ళి 2019 ఎన్నికల్లో దెబ్బతిన్నామన్న సంగతి ఆ పార్టీకి తెలుసు. అందుకే జాగ్రత్తగా పొత్తు రాజకీయాన్ని ముందుకు తెస్తోంది. పొత్తులు అయినా ఎత్తులు అయినా టీడీపీకి అనుకూలంగా ఉండేలా భారీ స్కెచ్ వేస్తోంది.

ఏపీలో టీడీపీ పెద్ద పార్టీ. ఇక పొత్తుల కోసం జనసేన, బీజేపీలతో చేతులు కలపాలని చూస్తోంది. కానీ ఏపీలో బీజేపీ గ్రాఫ్ ఏ మాత్రం పెరగలేదు. జనసేన ఈ మూడేళ్లలో పెరిగింది అంటున్నా అది పది పన్నెండు శాతంగా ఉంది. దాంతో వచ్చే ఎన్నికల నాటికి జనసేనకు ఓటు షేరింగ్ 15 శాతానికి అటు ఇటుగా పెరగవచ్చు అంటున్నారు.

ఈ లెక్కన చూసుకుంటే మొత్తం 175 సీట్లలో పాతిక నుంచి ముప్పయి సీట్లు జనసేనకు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. అది కూడా గోదావరి జిల్లాలో ఎక్కువగా ఇచ్చి మిగిలిన చోట్ల తమకు కొంత సర్దాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఇక బీజేపీకి కూడా పది లోపు సీట్లు ఇచ్చే వీలుందని చెబుతున్నారు. ఇలా కనుక లెక్క వేసుకుంటే టీడీపీ పొత్తుల పేరిట నలభై దాకా సీట్లను త్యాగం చేసి మిగిలిన 135 సీట్లలో పోటీకి దిగుతుంది అంటున్నారు.

అందులో మెజారిటీ సీట్లు అంటే మ్యాజికి ఫిగర్ 88కి సరిపడా తెచ్చుకోవాలన్నదే టీడీపీ టార్గెట్ గా చెబుతున్నారు. ఇక 2014 ఎన్నికల పొత్తుని గమనిస్తే టీడీపీ 163 సీట్లకు పోటీ చేసింది, బీజేపీకి 12 సీట్లను ఇచ్చింది. అందులో టీడీపీ వందకు పైగా గెలిస్తే బీజేపీ నాలుగు సీట్లను గెలుచుకుంది. నాడు బీజేపీకి మోడీ క్రేజ్ బాగా ఉపయోగపడింది. ఈసారి అలాంటి పరిస్థితి లేదు కాబట్టి పది సీట్ల దాకా ఇవ్వవచ్చు అంటున్నారు.

మరో వైపు పవన్ కళ్యాణ్ కి సినీ గ్లామర్ ఉంది. బలమైన సామాజిక వర్గం దన్ను ఉంది. అయినా ఆ ప్రభావం రెండు జిల్లాల్లోనే ఎక్కువగా ఉంటుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయట. ఇక టీడీపీకి మొత్తం 175 నియోజకవర్గాలలో బలం ఉంది, బలగం ఉంది. దాంతో పాటు గట్టి నాయకులు ఉన్నారు. అందువల్ల పొత్తుల రూపేణా పెద్ద సంఖ్యలో సీట్లు ఇస్తే టీడీపీకి ఇబ్బంది అవుతుంది అంటున్నారు.

ఇప్పటికే పొత్తులలో నలభై సీట్లకు కోత పడితే త్యాగరాజులు ఎవరు అన్నది చూడాలి. మరో వైపు ఈ పొత్తులు మిత్రుల సంగతి ఎలా ఉన్నా కంఫర్టబుల్ మెజారిటీతోనే ఏపీలో టీడీపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అన్నదే ఆ పార్టీ కచ్చితమైన వ్యూహంగా ఉంది అంటున్నారు.

ఏపీని పునర్ నిర్మిస్తామని ఈ మధ్యనే చంద్రబాబు చెప్పారు. ఆ పార్టీ చాలాకాలం పాలించింది. కచ్చితమైన విజన్ ఏపీ మీద ఉంది. దాన్ని సక్రమంగా అమలు చేయాలీ అంటే తమకు పూర్తి మెజారిటీ అవసరం అని టీడీపీ భావిస్తోంది అంటున్నారు. అదే విధంగా పవర్ షేరింగ్ మీద ఇపుడు జోరుగా ప్రచారం ఒక వైపు సాగుతోంది.

జనసేనాని ఆవిర్భావ సభలో చేసిన ప్రసంగం చూస్తే ప్రజా ప్రభుత్వం అన్నారు. అంటే అది సంకీర్ణం లాగానే చూడాలి. మరి అందులో జనసేనకు అధికార వాటా కచ్చితంగా ఉంటుంది అన్నదే ఆయన ఆలోచనగా అంటున్నారు. ఆ ధీమాతోనే ఆయన ఎన్నికల హామీలను కూడా ముందే ఇచ్చారు.

మరి అధికార వాటా అంటే చెరి ముప్పయి నెలలు, లేక మూడేళ్ళు,రెండేళ్ళు ఇలా పంచుకోవాలి. కానీ టీడీపీ వ్యూహం ప్రకారం చూస్తే అలాంటివి జరిగేది తక్కువ అంటున్నారు. ఏపీలో పొత్తులు ఉండాలి. ఆ పార్టీలకు కూడా కొన్ని మంత్రి పదవులు ఇస్తారు. ఇక అయిదేళ్ళూ టీడీపీ సర్కారే ఉంటుంది. ఇదీ ఆ పార్టీ ఆలోచన అని చెబుతున్నారు. మరి కొన్ని మంత్రి పదవులు తీసుకుని టీడీపీతో ప్రయాణం చేయడానికి జనసేన సిద్ధంగా ఉందా అన్నదే చర్చ. ఏది ఏమైనా ఈ విషయం తేలేంతవరకూ పొత్తుల వ్యవహారం కొలిక్కి రాదు అనే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.