Begin typing your search above and press return to search.

అటు మావోల గురి.. ఇటు మంత్రి సిరి... ?

By:  Tupaki Desk   |   14 March 2022 1:30 AM GMT
అటు మావోల గురి.. ఇటు మంత్రి సిరి... ?
X
ఈ మధ్యనే ఆమె ఒక్కసారిగా మీడియా అటెన్షన్ లోకి వచ్చారు. మావోయిస్టులు ఆమెను టార్గెట్ చేస్తూ రాసిన బహిరంగ లేఖ ఏపీ రాజకీయాల్లోనూ పెద్ద ఎత్తున చర్చనీయాశం అయింది. ఆమె ఎవరో కాదు, విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి. రాజకీయ కుటుంబానికి చెందిన భాగ్యలక్ష్మి మూడేళ్ళుగా వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఆమె చిట్టినాయుడు కూడా ఎమ్మెల్యేగా అప్పట్లో పనిచేసిన వారే.

ఇక భాగ్యలక్ష్మి విశాఖ ఏజెన్సీలో మైనింగ్ మాఫియాకు సహకరిస్తున్నారని మావోయిస్టులు ఆమెను టార్గెట్ చేశారు. బాక్సైట్ తవ్వకాలు పెద్ద ఎత్తున ఏజెన్సీలో జరుగుతున్నాయని, దానికి బాధ్యత భాగ్యలక్ష్మిదే అని కూడా సంచలన కామెంట్స్ చేశారు. ఆమె తక్షణం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మన్యం విడిచి వెళ్లాలని కూడా అల్టిమేటం జారీ చేశారు.

దీంతో ఏజెన్సీలోని ప్రజా ప్రతినిధులు అందరిలోనూ వణుకు మొదలైంది. భాగ్యలక్ష్మి రాజకీయ జీవితం మూడేళ్ళకే ముగింపా అన్న చర్చ కూడా ఒక దశలో సాగింది. వైసీపీ అధినాయకత్వం దీని మీద ఏం చేస్తుంది అన్న ఆసక్తి కూడా అందరిలో చోటు చేసుకుంది. అయితే చిత్రంగా వైసీపీ పెద్దలు ఇపుడు భాగ్యలక్ష్మికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నారని అంటున్నారు.

మావోలు గురి పెట్టిన ఆమెకు మంత్రి గిరీని ఇచ్చి ఏకంగా మినిస్టర్ భాగ్యలక్ష్మిని చేయాలనుకుంటున్నారని లేటెస్ట్ భోగట్టా. భాగ్యలక్ష్మిని గిరిజనంలో ఉన్న పేరు ఆదరణతో పాటు రాజకీయ కుటుంబం కావడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నారని తెలుస్తోంది. అదే విధంగా ఆమెకు 2019 ఎన్నికల్లో వచ్చిన భారీ మెజారిటీ కూడా మంత్రి పదవి ఇవ్వడానికి మరో కారణంగా చెబుతున్నారు.

ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాగా పాడేరు, అరకు, రంపచోడవరం కలిపి ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలలో భాగ్యలక్ష్మికే అన్ని విధాలుగా మంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయని హై కమాండ్ ఓటేసింది అంటున్నారు. ఇక ఆమె మీద మావోలు గురి పెట్టిన నేపధ్యంలో మంత్రిగా ఆమెకు ప్రమోషన్ ఇవ్వడం ద్వారా మరింతగా భద్రతను పెంచేసి ఏజెన్సీలో ఆమె ద్వారానే అటు అభివృద్ధిని, ఇటు రాజకీయాన్నికలగలిపి నడిపించాలని వైసీపీ పెద్దలు ఫిక్స్ అయ్యారని అంటున్నారు.

అదే కనుక జరిగితే కాబోయే గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని చూడవచ్చు అంటున్నారు. అయితే ఈ కీలకమైన మంత్రిత్వ శాఖను ఆమెకు కట్టబెడితే వైసీపీలో సీనియర్ మోస్ట్ గిరిజన ఎమ్మెల్యే, సాలూరుకి చెందిన రాజన్నదొరకు ఈసారి కూడా రిక్త హస్తమేనా అంటే జవాబు అవును అనే వస్తోంది.

మొత్తానికి అనూహ్యమైన నిర్ణయాలు తీసుకునే వైసీపీ పెద్దలు పాడేరు ఎమ్మెల్యేకు మంత్రి భాగ్యం కలిగించినా ఆశ్చర్యం లేదు అనే మాట అయితే అంతటా ఉంది మరి.