Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ మేట‌ర్ : రెడ్లంతా ఎటు వెళ్లారు?

By:  Tupaki Desk   |   19 Feb 2022 1:30 PM GMT
కాంగ్రెస్ మేట‌ర్ : రెడ్లంతా ఎటు వెళ్లారు?
X
రెండు ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గాల‌ను న‌మ్ముకుని కాంగ్రెస్ పార్టీ మొద‌ట నుంచి రాజకీయాలు చేస్తోంది.ఒకటి మైనార్టీ వ‌ర్గాల‌ను, రెండు ద‌ళితుల‌ను వీళ్ల‌తో పాటు తెలంగాణ వ‌ర‌కూ రెడ్ల‌ను ఆంధ్రా వ‌ర‌కూ చౌద‌రి సామాజిక‌వ‌ర్గాన్ని అట్టిపెట్టుకునే రాజ‌కీయం చేస్తోంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆంధ్రాలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి అది కూడా ఒక కారణమే. కాంగ్రెస్ లీడర్ షిప్ రెడ్లే అయినా ఆంధ్ర ప్రాంతంలో ప్రముఖ కాంగ్రెస్ లీడర్లు కమ్మ సామాజిక వర్గం వారే ఉండేవారు. ఇపుడు విభజన తో అక్కడ జీరో అయిపోయింది.

తెలంగాణలో కాస్తో కూస్తో ప‌ట్టున్న ప్రాంతాల‌లో కూడా మంచి అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టుకోలేక ఇక్క‌డ పార్టీ నిల‌దొక్కుకోలేక‌ పోయింది. తెలంగాణ‌లో రెడ్డి సామాజిక‌ వ‌ర్గంకు మంచి ప‌ట్టుంది.ఆ నాయ‌కుల మాట‌కు ఎదురు కూడా లేదు.వీళ్లంతా ఒక‌ప్పుడు ఉమ్మ‌డి ఆంధ్రాలో కాంగ్రెస్ వైపే ఉండేవారు.రాజ‌శేఖ‌ర్ రెడ్డి మొద‌లుకుని న‌ల్లారి వారింటి అబ్బాయి కిర‌ణ్ కుమార్ రెడ్డి వ‌ర‌కూ అంతా కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో సాయం చేసిన వారే! రాజ‌శేఖ‌ర్ రెడ్డి క‌ష్ట‌కాలంలో పార్టీకి జీవం పోశారు ఇంకా చెప్పాలంటే అనామ‌క నాయ‌కుల‌కు జీవితం ఇచ్చారు. అదేవిధంగా మంచో చెడో ఉన్నంత వ‌ర‌కూ కిర‌ణ్ కుమార్ రెడ్డి కూడా పార్టీకి అండ‌గానే ఉన్నారు.

విధేయ‌త‌కు విరుద్ధంగా ఆయ‌న ప్ర‌వర్తించిన దాఖ‌లాలు లేవు. కానీ ఆఖ‌రి నిమిషంలో సొంతంగా చెప్పు గుర్తును తెర‌పైకి తెచ్చి జై స‌మైక్యాంధ్ర పార్టీని తీసుకువ‌చ్చారు.అదే పెద్ద త‌ప్పిదంగా మారింది ఆ వేళ. ప్ర‌జ‌ల్లో ఉన్న భావోద్వేగాలు పార్టీకి ప‌నికి వ‌స్తాయ‌ని న‌ల్లారి కిర‌ణ్ భావించారు కానీ అదే మైన‌స్ అయిపోయింది.ఇక మాజీ స్పీక‌ర్ సురేశ్ రెడ్డి ఇవాళ తెలంగాణ రాష్ట్ర స‌మితిలోనే ఉన్నారు. ఓ విధంగా ఈటెల రాజేంద‌ర్ కు కూడా పేరుకు బీజేపీ లీడ‌ర్ అయినా ఆయ‌న‌కు కూడా తెలంగాణ రాష్ట్ర స‌మితిలో ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గ నేత‌ల స‌పోర్ట్ ఉంది..అని అంటుంటారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.

ఎందుకంటే ఆయ‌న భార్య రెడ్డి క‌నుక ! మొన్న‌టి వేళ ఆయ‌న‌కు రెడ్డి సామాజిక‌వ‌ర్గ నేత‌లంతా అంతో ఇంతో సాయం చేశారు..అని కూడా అంటుంటారు.అందుకే ఆయ‌న గెలుపు సునాయాసం అయింద‌ని కూడా అంటుంటారు.ఈ విధంగా ఎవ‌రు ఏమ‌నుకున్నా కాంగ్రెస్ పార్టీకి ఒక‌ప్పుడు వెన్నుదన్నుగా ఉన్న ద‌ళితుల ఓట్లు, రెడ్ల ఓట్లు ఈ రెంటినీ బీజేపీ మరియు టీఆర్ఎస్ హాయిగా పంచుకుంటున్నాయి.

అందుకే కాంగ్రెస్ పార్టీ త‌న‌ త‌ర‌ఫున ద‌ళిత నాయకులు ఉన్నా రాణించ‌లేక‌పోతోంది. మంద కృష్ణ మాదిగ‌లాంటి లీడ‌ర్లు, ఆర్‌.కృష్ణ‌య్య లాంటి లీడ‌ర్లు కొంద‌రు ఎవ‌రెటు ఉంటున్నారో కూడా తెలియ‌డం లేదు.దీంతో క్యాస్ట్ ఈక్వేష‌న్ల‌లో కాంగ్రెస్ వెనుక‌బ‌డిపోయి కారు పార్టీ జోరుగా పోతోంది.అప్పుడప్పుడూ బీజేపీ త‌న డ‌ప్పు తాను కొట్టుకుంటూ అక్క‌డ‌క్క‌డ ఉన్నాన‌నే అంటోంది.ఇక అక్క ష‌ర్మిల మ‌రో అక్క క‌విత, మ‌రో అక్క విజ‌య‌శాంతి వీళ్ల మ‌ధ్య పోరు కార‌ణంగా మ‌హిళ‌ల ఓట్లు కూడా బాగానే చీలిపోతున్నాయి.

అందుకు తెలంగాణ జాగృతి ఓ కార‌ణం. సినిమా ఛార్మింగ్ కార‌ణం. అందుకు వైఎస్సార్ ఛార్మింగ్ కార‌ణం. వీటిని దాటి ఆలోచించ‌డ‌మే క‌ష్టం ఇవాళ. ఆఖ‌రులో మైనార్టీల ప్ర‌భావం అన్న‌ది లీడింగ్ పార్టీ టీఆర్ఎస్ వైపే ఉంది.ఈ ఓట్లు కూడా కొన్నిసార్లు టీఆర్ఎస్,బీజేపీ పంచుకుంటున్న దాఖ‌లాలు ఉన్నాయి.ఇవి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్లే!

పాత‌న‌గ‌రం దోస్తులు ఎంఐఎం వైపు ఉంటారు.వాళ్ల కార‌ణంగా మిగ‌తా మైనార్టీలు అంతా ఇవాళ కాంగ్రెస్ ను వీడి తెలంగాణ రాష్ట్ర స‌మితి వైపు ఉంటున్నారు.కానీ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌వా న‌డిచినంత కాలం ఓవైసీ సోద‌రులు కాంగ్రెస్ కు అండ‌గానే ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్లంతా కేసీఆర్ కు బంధుగ‌ణంగా ఉన్నారు. కొన్ని సంద‌ర్భాల్లో మైనార్టీలు బీజేపీవైపు వెళ్లినా కూడా వెన‌క్కువ‌చ్చేస్తున్న దాఖ‌లాలు కూడా ఉన్నాయి. చాంధ‌స వాద వాక్కుల కార‌ణంగానే బీజేపీ కొంత కాదు చాలా ప‌రువు తీసుకుంటుంది త‌న‌కు తానే!