Begin typing your search above and press return to search.

ఊరందరిదీ ఒక దారి.. షర్మిలది మరో దారి..!

By:  Tupaki Desk   |   16 Oct 2022 12:30 AM GMT
ఊరందరిదీ ఒక దారి.. షర్మిలది మరో దారి..!
X
ఊరందరిదీ ఒక దారి.. ఉలిపికట్టెది మరో దారి అన్న చందంగా మారింది వైఎస్ షర్మిల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో అన్నతో గొడవపడి తెలంగాణలో ప్రత్యేక పార్టీ పెట్టడం బహుశా ఈమెకే చెల్లిందేమో. అదైనా సిన్సియర్ గా చేస్తున్నారా.. అంటే అదీ లేదు. ఏదో టైంపాస్ రాజకీయాలు చేస్తున్నట్లుగా ఉందని ఆమె పార్టీ నేతలే లోలోపల వ్యాఖ్యానిస్తున్నారు. ఇక తెలంగాణ సమాజం మాత్రం ఆమెని ఏం పట్టించుకుంటుంది అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

తన తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలు తనతోనే సాధ్యమవుతాయని.. తెలంగాణ సీఎం కేసీఆర్ సరైన పాలన అందించడం లేదని భావించిన షర్మిల వైస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచే పాదయాత్ర మొదలుపెట్టారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలను చుట్టేయాలనే లక్ష్యం విధించుకున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తూ వెళుతున్నారు.

అయితే.. మొదట్లో చప్పగానే సాగిన ఆమె పాదయాత్ర తర్వాతర్వాత వేగం పుంజుకుంది. పాదయాత్రకు, బహిరంగ సభలకు జనాలను భారీగానే తరలిస్తున్నారు. తొలుత ఆమె వైపు చూడని మీడియా క్రమంగా ఆమె పాదయాత్రకు మంచి కవరేజీ ఇవ్వగలుగుతోంది. అయితే ఇదంతా మేడిపండు చందమే అని.. జనాల్లో ఆమె పట్ల అంత ఆస్తకి లేదని ఇతర పార్టీలు చెబుతున్నాయి.

తన పాదయాత్రలోని లోటుపాట్లను గమనించిన షర్మిల తనకు హైపు రావాలంటే ఎదురుదాడి చేయడమే కరెక్టు అని భావించారు. అందుకే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను, మంత్రులను టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డిని, సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డిని విమర్శించి జనాల్లో నానేలా చూసుకున్నారు. ఆమె వ్యాఖ్యలను అందరూ లైట్ తీసుకుంటే వీరిద్దరు మాత్రమే ప్రతిస్పందించి ఆమె గురించి చర్చ జరిగేలా చేశారు.

అయితే.. ఇదంతా బీజేపీ కుట్ర అని టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. ఆమె పాదయాత్ర మొత్తంలో ఈ రెండు పార్టీలపైనే విమర్శలు చేస్తుండడం.. బీజేపీని, కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇపుడు మునుగోడులో కూడా షర్మిల వైఖరి తేటతెల్లం అయిందనే చెప్పవచ్చు.

అన్ని పార్టీలు మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే షర్మిల మాత్రం లైట్ తీసుకున్నారు. నల్లగొండ జిల్లాలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలంగా ఉందని.. వైఎస్ అభిమానులు వేల మంది ఉన్నారని తన పాదయాత్రలో ఇది స్పష్టమైందని పేర్కొన్న షర్మిల ఉప ఎన్నికలో మాత్రం పోటీచేయడం లేదు.

ఇది బీజేపీ వ్యూహమేనని.. ఆమె పోటీ చేస్తే రెడ్ల ఓట్లు చీలిపోయి రాజగోపాల రెడ్డికి నష్టం జరుగుతుందని భావించి పోటీకి దూరంగా ఉన్నారని మిగతా పక్షాలు ఆరోపిస్తున్నాయి. అందరూ ఇక్కడ కుస్తీలు పడుతుంటే ఆమె మాత్రం ఎంచక్కగా మిగతా జిల్లాల్లో పాదయాత్రలు చేసుకుంటున్నారు. ఆమె రాజకీయాలు తెలంగాణ ప్రజలను నివ్వెరపరుస్తున్నాయి. చూడాలి మరి ముందు ముందు ఆమె అడుగులు ఎటువైపు పడతాయో..!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.