Begin typing your search above and press return to search.

నాటి దోస్తులు ఏరీ : బాబుకు హెల్ప్ చేయడానికి వారు రెడీనా...?

By:  Tupaki Desk   |   19 July 2022 11:30 PM GMT
నాటి దోస్తులు ఏరీ : బాబుకు హెల్ప్ చేయడానికి వారు రెడీనా...?
X
ఏపీ రాజకీయాల్లో ఢక్కామెక్కీలు తిన్న పార్టీ తెలుగుదేశం. నాలుగు దశాబ్దాల చరిత్ర ఆ పార్టీది. ఇక చంద్రబాబు కూడా రాజకీయ అనుభవంలో అర్ధ శతాబ్దం దగ్గరకు వచ్చిన నేత. ఈ సుదీర్ఘ‌ ప్రయాణంలో చంద్రబాబుకు ఎందరో కలసివచ్చారు. బాబుకు ఎన్నో పరిచయాలు ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా అందరితో కలసి మెలిసి ఉండడం బాబు మార్క్ పాలిటిక్స్. ఇక ఎవరిని ఎపుడు ఎక్కడ ఎలా వాడుకోవాలి అన్నది బాబుకు మాత్రమే తెలిసిన విద్య.

అందుకే చంద్రబాబుని అపర చాణక్యుడు అనేది. బాబుకు అన్ని పార్టీలలో మిత్రులు ఉన్నారని అంటారు. అలాగే అన్ని వ్యవస్థలలో కూడా ఆయన మనుషులు ఉన్నారని చెబుతారు. అందుకే చంద్రబాబు రాజకీయం నల్లేరు మీద నడకలా సాగిపోతూ వచ్చింది. ఇదంతా ఎపుడు అంటే 2019 ఎన్నికల వరకూ మాత్రమే. ఆ ఎన్నికల తరువాత జగన్ రంగంలోకి వచ్చారు. ఆయనకు అధికారం చేతిలో ఉండడం మరింత బలం. ఇక దేనికైనా వెరవని తత్వం జగన్ సొంతం.

జగన్ తన బలాన్ని చూసుకోవడం, కాపు కాసుకోవడమే కాకుండా ఎదుటి పక్షాన్ని వీక్ చేయడంలోనూ సిద్ధహస్తుడిగా చెబుతారు. ఇపుడు ఇదంతా ఎందుకంటే ఏపీలో టీడీపీకి వచ్చే ఎన్నికలు జీవన్మరణ సమస్య. ఈ ఎన్నికల్లో టీడీపీకి సహకరించే మిత్రులు ఎవరు అన్నది అతి పెద్ద ప్రశ్న. చంద్రబాబు టీడీపీని టేకోవర్ చేశాక ఆయన ఆర్ధికంగా సహకరించే వారు ఇద్దరు ఉన్నరు. ఆ ఇద్దరూ బాబుకు కుడి ఎడమలు అని కూడా పేరు గడించారు.

బాబు సైతం వారి రుణాన్ని ఉంచుకోలేదు. కీలక పదవులు ఇచ్చి వారిని సమాదరించారు. ఆ ఇద్దరూ గత మూడేళ్లుగా పార్టీని వీడి వేరే పార్టీలో ఉంటున్నారు. వారికి చంద్రబాబు మీద అభిమానం తగ్గలేదు కానీ జగన్ ఏపీలో ఉండడంతో బాబుతో దోస్తీ చేసి గతంలో మాదిరిగా సహకారం అందించగలరా అన్నది ఒక చర్చ. ఎందుకంటే కేసుల భయం కూడా అలాంటి వారిని పట్టి పీడిస్తుంది అని అంటున్నారు.

ఇక ఒక మాజీ ఎంపీ గారున్నారు. ఆయన చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నా ఏపీలో తెలుగుదేశం విజయానికి తనదైన కృషి చేశారని పేరు తెచ్చుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలీ అంటే 2019 ఎన్నికల ముందు టీడీపీకి సర్వం సహగా ఆయన వ్యవహరించరని చెబుతారు. ఆయన జోస్యాలు సర్వేలు అన్నీ కూడా టీడీపీ కోసం చేశారు. ఆయన మాట మీదనే చంద్రబాబు చాలా చోట్ల అభ్యర్ధులను తెచ్చి పెట్టారు అని కూడా అంటారు.

ఇక పార్టీలో ఎవరైనా అసంతృప్తివాదులు ఉన్నా కూడా వారిని బుజ్జగించడం కూడా చేశారు. అలాంటి మాజీ ఎంపీ ఇపుడు పెద్దగా టీడీపీ వైపు చూడడంలేదు అంటున్నారు. ఆయన ఉండేది హైదరాబాద్, లేకపోతే ఢిల్లీలో ఉంటున్నారు. ఆయన ఏపీలో టీడీపీకి ఈసారి గెలుపుకోసం ఎంతవరకూ పనిచేస్తారు అన్నది కూడా ప్రశ్నగా ఉంది. ఇక ఓపెన్ గా వచ్చి సాయం చేస్తే జగన్ నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్న చర్చ కూడా టీడీపీలో సాగుతోందిట.

ఇక ఇంకో ఆయన ఉన్నారు. ఆయన ప్రభుత్వ అధికారి, మాజీ నిఘా అధికారి. తెలుగుదేశంతో ఆయన గతంలో అంటకాగారు అన్న దాని మీదనే వైసీపీ సర్కార్ వచ్చిన తరువాత ఆయన మీద వరసబెట్టి సస్పెన్షన్స్ విధిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని చెబుతారు. ఆయన కూడా చాలానే టీడీపీకి సాయం చేశారు. అలాంటిది ఆయన ఇపుడు తన సొంత బాధలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయన సర్వీస్ కూడా 2024 దాకా ఉందని అంటున్నారు.

అందువల్ల ఆయన తన పదవికి రాజీనామా చేసి టీడీపీకి వచ్చి బాహాటంగా సాయం చేసే సీన్ లేదని అంటున్నారు. ఇక ఒక పత్రికాధిపతి మాత్రం ఇప్పటికీ టీడీపీకి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారు. ఆయన జగన్ వైసీపీ టార్గెట్ గా ఉన్నారు. అయితే ఆయన తాను చేయాల్సింది చేస్తూ వస్తున్నా మునుపటి మాదిరిగా బహిరంగంగా ఇంకా తెగించి చేయగలరా అన్న డౌట్లు కూడా టీడీపీలో ఉన్నాయట.

వీరంతా టీడీపీకి సాయం చేయాలీ అంటే జగన్ భయం పోవాలి. అది జరగాలీ అంటే కేంద్రంలోకి బీజేపీ మద్దతు టీడీపీకి దక్కాలి. అందుకోసమే చంద్రబాబు టీడీపీ పొత్తు కోసం చూస్తున్నారు అని అంటున్నారు. టీడీపీ కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జగన్ని దాటి వచ్చి మరీ వీరంతా హెల్ప్ చేస్తారు అని అంటున్నారు. వీరి సాయం వచ్చే ఎన్నికల్లో అవసరం అని కూడా టీడీపీ గట్టిగా భావిస్తోంది. మరి ఈ మిత్రుల సాయం దక్కుతుందా, అలా దక్కాలంటే బాబు ఏం చేయాలి. ఎలా చేస్తే వారు ఈ వైపుగా వస్తారు అన్నది రాజకీయ వెండి తెర మీదనే చూడాలి మరి.