Begin typing your search above and press return to search.

జగన్ గట్స్ కి జోహార్... ఆ పార్టీలో అదే చర్చ...?

By:  Tupaki Desk   |   12 April 2022 7:31 AM GMT
జగన్ గట్స్ కి జోహార్... ఆ పార్టీలో అదే చర్చ...?
X
జగన్ కి గట్స్ ఉన్నాయా లేవా అన్నది పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. ఆయన గట్స్ ఉన్న నేత. అది ఎపుడో పుష్కర కాలం క్రితమే రుజువు అయింది. లేకపోతే కొండంత యూపీయ సర్కార్ ని నాలుగేళ్లకు పైగా అధికారం చేతిలో ఉన్న ఒక పార్టీని ఎదిరించి బయటకు వచ్చేయడం గట్స్ కాక మరేమంటారు.

జగన్ గట్స్ ని చూసే నాడు అంతా ఫ్యాన్స్ అయ్యారు. ఇక జగన్ లో పట్టుదల ఉంది. దానిని మించి మొండితనం కూడా ఉంది. దాంతో ఆయన తన దారిని తానే నిర్మించుకున్నారు. అది ముళ్ళ బాట అయినా పూల బాటగా భావించి సాగిపోవడం ఆయనకే చెల్లు. ఇక జగన్ రిస్క్ చేస్తారు అని అనుకోవడం కంటే జగన్ అంటేనే రిస్క్ అని మార్చుకుని చదువుకోవడమే సబబు.

ఇవన్నీ ఇలా ఉంటే లేటెస్ట్ గా జగన్ మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. ఈ విషయంలో ఆయన చాలా పెద్ద సాహసం చేశారని అంతా అంటున్నారు. కానీ ముందే చెప్పుకున్నట్లుగా సాహసాలు చేయడమే జగన్ మార్క్ పాలిటిక్స్ కదా. సో అది దుస్సాహసమా లేక మరోటా అన్నది కూడా ఆలోచించకుండా ఆయన చేసుకుంటూ వెళ్ళారు. తనకు నచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు. అలాగే శాఖలు కూడా తాను అనుకున్నట్లుగా ఇచ్చారు.

ఇప్పుడు చెప్పుకోవాల్సింది జగన్ దూకుడు గురించే. ఒక ఓసీ అధినేత నాయకత్వంలోని ప్రభుత్వంలో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఉండడం అంటే నిజంగా గ్రేట్. అందుకే ఆంగ్ల మాధ్యమాలు సైతం ఏపీలో మంత్రి వర్గ కూర్పు గురించి వరసబెట్టి మరీ విశ్లేషణలు ఇచ్చాయి. జాతీయ రాజకీయాలను సైతం అలా జగన్ తన వైపునకు తిప్పుకున్నారు అని చెప్పాలి.

ఏపీలో మంత్రి వర్గ విస్తరణ రెండు రోజుల పాటు దేశ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ అయింది. ఇక బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ క్రిష్ణయ్య అయితే జగన్ గ్రేట్ అనేశారు. ఆయన చాలా పెద్ద సాహసం చేసి బీసీలకు పదవులు పంచారని కొనియాడారు.

ఇపుడు ప్రస్థావించుకోవాల్సింది విపక్షాల గురించి. ఏపీలో జగన్ దిగిపోతే అధికారంలోకి వద్దామనుకుంటున్న టీడీపీలో కూడా జగన్ 2.0 మంత్రి వర్గం కూర్పు మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోందిట. ఒక్కసారి చంద్రబాబు హయాంలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలను గురించి చర్చించుకుంటే ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలో కూడా ఆయన పూర్తిగా మంత్రులను ఎపుడూ తొలగించలేదు.

కొందరి చేతనే రాజీనామాలు తీసుకుని వాటిని నింపారు. ఇక 2014లో బాబు అధికారంలోకి వచ్చినపుడు కూడా 19 మందితోనే మూడేళ్ల పాటు పాలన చేశారు. ఆరు సీట్లు అలా వదిలేసి ఆశావహులను అదుపులో పెట్టుకున్నారు. 2017లో మరోమారు మంత్రి వర్గ విస్తరణ చేపట్టి మొత్తం పది లోపే కొత్త మంత్రులను తీసుకుని కధ అయిందనిపించారు. 2018లో అయితే ఎస్టీ కేటగిరీలో కిడారి సర్వేశ్వరరావు హత్య తరువాత ఆయన కుమారుడు శ్రావణ్ కి మంత్రి పదవి ఇచ్చారు.

మొత్తానికి బాబు డేరింగ్ స్టెప్ అంటూ ఏదీ ఈ విషయంలో వేయలేదని టీడీపీలో కొందరి నాయకుల చర్చగా ఉందిట. ఇక బీసీ పార్టీగా చెప్పుకునే టీడీపీ 48 శాతం మాత్రమే వారికి పదవిలు ఇచ్చి 52 శాతం అగ్ర కులాలకు ఇచ్చింది. కమ్మ రెడ్డి కాంబినేషన్ తో పాటు, వారి వత్తిళ్ల నుంచి బాబు నాడు బయటపడలేకపోయారు అని చెబుతారు. మొత్తానికి పాత్ర ట్రెడిషన్ నే బాబు కంటిన్యూ చేశారు తప్ప బీసీలకు ప్రాధాన్యత జగన్ మాదిరిగా ఇంతలా ఇవ్వలేదు అన్న చర్చ అయితే సాగుతోందిట.

రాజకీయాల్లో ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే గట్స్ ఉండాలని అంటారు. ఎందుకంటే అప్పటిదాకా ఉన్న విధానాన్ని పక్కకు తోసేసి తాము అనుకున్నది చేయడం చెప్పినంత సులువు కాదు. అందులో ఎన్నో తిరుగుబాట్లు ఎదురు దెబ్బలు చవి చూడాల్సి వస్తుంది. జగన్ దేనికైనా రెడీ అని చేసుకుని పోయారు. తాను అనుకున్న వారికి పదవులు పంచేశారు. అందుకే జగన్ గట్స్ మీద విపక్షాలతో పాటు రాజకీయ, సామాజిక రంగాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే ఇపుడు సాగుతోంది.