Begin typing your search above and press return to search.

ఈస్ట్ బెస్ట్ అంటున్న పవన్...?

By:  Tupaki Desk   |   26 March 2022 7:43 AM GMT
ఈస్ట్ బెస్ట్ అంటున్న పవన్...?
X
ఈస్టో వెస్టో ఏది బెస్టో పవన్ మొత్తానికి తేల్చుకుంటున్నారు. ఈసారి పోటీకి ఆయన ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 2019 నాటి తప్పు చేయకూడదు అని కూడా గట్టిగా డిసైడ్ అయ్యారు. దాంతో పవన్ చూపు ఈస్ట్ గోదావరి జిల్లా మీద పడింది అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఇక్కడ నుంచే పోటీకి దిగుతారు అన్నది జనసేన వర్గాల సమాచారం.

ఇక 2019 ఎన్నికల విషయానికి వస్తే పవన్ వెస్ట్ గోదావరి, విశాఖల నుంచి రెండు సీట్లను ఎంపిక చేసుకుని మరీ పోటీకి దిగారు. వెస్ట్ లో ఆయన భీమవరం నుంచి, విశాఖలో గాజువాక నుంచి పోటీ చేస్తే రెండు చోట్లా ఓటమి పాలు అయ్యారు.

దాంతో ఈసారి ఒకే ఒక సీటు నుంచి పోటీకి దిగాలని పవన్ గట్టిగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. జనాలకు కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒకే చోట నుంచి బరిలోకి దిగితే విజయం ఖాయమన్నది జనసేనాని ఆలోచనగా చెబుతున్నారు.

ఇక తూర్పు గోదావరి జిల్లాలలో చాలా సీట్లలో కాపుల ప్రాబల్యం ఉంది. అక్కడ గతంలో ప్రజారాజ్యం కూడా నాలుగు సీట్లను గెలుచుకుంది. చాలా చోట్ల గట్టి పోటీ ఇచ్చింది. ఇక జనసేన నుంచి చూస్తే 2019 ఎన్నికల్లో కూడా ఓడిపోయినా చాలా నియోజకవర్గాలలో మంచి సంఖ్యలో ఓట్లను సంపాదించుకుంది.

దాంతో బలమైన సామాజికవర్గం జనసేన వైపు ఉందని అర్ధమవుతోంది. దాంతో ఈ జిల్లాలో 19 సీట్లలో ప్రభావం చూపించాలంటే పవన్ కూడా ఇక్కడ నుంచే పోటీ చేస్తే బాగుంటుంది అని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయట. ఈ విషయాలను పూర్తిగా అధ్యయనం చేసిన పవన్ తాను రెండు సీట్లను ఇప్పటికే ఎంపిక చేసుకున్నారని అందులో ఒకదాని నుంచి పోటీ చేస్తారని అంటున్నారు.

పవన్ ఎంచుకున్న రెండు సీట్లలో ఒకటి కాకినాడ రూరల్. ఇది జనసేనకు స్ట్రాంగ్ అవుతుందని భావిస్తున్నారు. 2019 ఎన్నికలలో ఇక్కడ నుంచి కురసాల కన్నబాబు గెలిచారు. అయితే జనసేన నుంచి పోటీ చేసిన పంతం నానాజీ ఏకంగా నలభై వేల ఓట్లను తెచ్చుకోవడం విశేషం. ఇక్కడ టీడీపీ తరఫున పిల్లి అనంతలక్ష్మి 65 వేల ఓట్లు తెచ్చుకుంటే కన్నబాబుకు 74 వేల ఓట్లు వచ్చాయి.

మరి ఇక్కడ పొత్తు కనుక టీడీపీ జనసేనకు ఉంటే వైసీపీ ముప్పై వేల ఓట్ల తేడాతో ఓడుతుంది అన్న లెక్కలు ఉన్నాయట. దాంతో పవన్ ఈ సీటు నుంచి పోటీకి రెడీ అవుతున్నారు అని తెలుస్తోంది. ఇక రెండవ ఆప్షన్ కింద పిఠాపురం సీటుని కూడా చూస్తున్నారు. ఇక్కడ 2019 ఎన్నికల్లో పెండెం దొరబాబు వైసీపీ తరఫున గెలిచారు. ఇక్కడ జనసేన తరఫున పోటీ చేసిన మాకినీడి శేషుకుమారికి 28 వేల ఓట్లు వచ్చాయి. టీడీపీ తరఫున బరిలోకి దిగిన వర్మకు 68 వేల ఓట్లు వస్తే వైసీపీకి 83 వేల ఓట్లు వచ్చాయి.

ఇక్కడ కూడా పొత్తులు ఉంటే జనసేనకు కాక్ వాట్ సీటే అంటున్నారు. దాంతో పవన్ ఈ రెండు సీట్ల మీదా కన్నేసి ఉంచారని తెలుస్తోంది. ఇక ఈ రెండు సీట్ల మీద ఆయనకు స్పెషల్ ఇంటెరెస్ట్ ఎందుకు అంటే 2009 ఎన్నికల్లో ఈ సీట్లను ప్రజారాజ్యం గెలుచుకుంది. మొత్తానికి సేఫ్ గేం ఆడాలని ఈసారి పవన్ ఫిక్స్ అయిపోయారు. దాంతో పవన్ ఈస్ట్ లుక్ పవర్ మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుందా అన్నది చూడాలి.