Begin typing your search above and press return to search.

మండలిలోనూ మంట‌లే.. టీడీపీ అదుపు త‌ప్పుతోందా?

By:  Tupaki Desk   |   24 March 2022 10:30 AM GMT
మండలిలోనూ మంట‌లే.. టీడీపీ అదుపు త‌ప్పుతోందా?
X
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల్లో టీడీపీ సభ్యుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో 12వ రోజు మంగ‌ళ‌వారం నాటి సమావేశాల్లో శాసన మండలిలో టీడీపీ సభ్యులు ప్ర‌బుత్వ తీరుపై తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మండలిలో సభా కార్యకలాపాలను ఆటంకపరిచారు. విజిల్స్‌ వేస్తూ, చిడతలు వాయిస్తూ టీడీపీ మండలి సభ్యులు ప్రవ‌ర్తించారు. ఈ సందర్భంగా వారి తీరుపై చైర్మన్ మోషెన్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

'సభలో ఇలాంటివి చేయడం మంచిది కాదు. సభకు చిడతలు, విజిల్స్ ఎందుకు తెచ్చారు. సభలో చిడతలు వాయించడం ఏంటి..?. సభా గౌరవాన్ని కాపాడే బాధ్యత మీ మీద లేదా?. భజన చేయడం మంచి పద్ధతి కాదు. వెల్‌లోకి వచ్చి మాట్లాడే హక్కు మీకు లేదు. మీ సీట్లలో మీరు కూర్చొని మాట్లాడండి. టీడీపీ సభ్యులు కావాలనే గొడవ చేస్తున్నారు.. సభా సమయాన్ని వృద్దా చేయొద్దని మొదటి రోజు నుంచి చెబుతున్నా' అని అన్నారు.

వారు ఎంతకూ తీరు మార్చుకోకపోవడంతో టీడీపీ సభ్యులను ఈ ఒక్కరోజు చైర్మన్‌ సస్పెండ్ చేశారు. దీంతో టీడీపీ సభ్యుడు దీపక్ రెడ్డి పోడియం పైకి ఎక్కడానికి దూసుకెళ్లారు. దీంతో ఆయనను మార్షల్స్ అడ్డుకున్నారు. సస్పెండ్ చేస్తే ఈ దౌర్జన్యం ఏంటి అని చైర్మన్ మోషెన్ రాజు టీడీపీ సభ్యులను ప్రశ్నించారు. ఈ క్రమంలో మోషెన్ రాజుపై ప్లకార్డులు విసిరి టీడీపీ సభ్యులు బయటకు వెళ్లారు.

సస్పెండైన వారిలో అర్జునుడు, అశోక్‌ బాబు, దీపక్‌ రెడ్డి, ప్రభాకర్‌, రామ్మోహన్‌, రామారావు, రవీంద్రనాథ్‌ ఉన్నారు.

కాగా, అటు అసెంబ్లీ, ఇటు మండ‌లిలోనూ.. మొద‌టి రోజు నుంచి ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకున్న క‌ల్తీసారా మ‌ర‌ణాల‌పై చ‌ర్చ‌కు ప‌ట్టుబడుతూ.. ఆందోళ‌న చేస్తున్నా రు. అయితే. ప్ర‌బుత్వం ఆయా మ‌ర‌ణాల‌ను సాధార‌ణ‌మేన‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో ఇరు ప‌క్షాల‌కు మ‌ధ్య వివాదం న‌డుస్తోంది.

అయితే.. అటు అసెంబ్లీలోను, ఇటు మండ‌లిలోనూ.. టీడీపీ స‌భ్యులు వ్య‌వ‌హ రిస్తున్న తీరుపై మాత్రం కొంత విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మార్పులు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.