Begin typing your search above and press return to search.

జనసేనకు 75 సీట్లు....ఖరీదైన డిమాండ్...?

By:  Tupaki Desk   |   9 Jan 2023 9:35 AM GMT
జనసేనకు 75 సీట్లు....ఖరీదైన డిమాండ్...?
X
ఏపీలో పొత్తు పొడుపుకు తెర లేచింది. ఒక అందమైన ఆదివారం దానికి పునాది పడింది. ఏపీలో జనసేన తెలుగుదేశం పార్టీలు పొత్తుకు సిద్ధపడతాయని దాదాపుగా అంతా ఒక అంచనాకు వస్తున్న సందర్భం ఇది. అయితే ఈ పొత్తుల విషయం మీదనే ఇపుడు అంతా చర్చ సాగుతోంది. పొత్తు కనుక కుదిరితే ఏపీలో తెలుగుదేశం పార్టీ జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుంది అన్నది ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది.

జనసేన లాంటి పార్టీతో పొత్తు తెలుగుదేశం నాలుగు దశబ్దాల పొత్తు చరిత్రలో సరికొత్త అనుభవంగా చెప్పాలి. ఎందుకంటే ఎపుడూ కుదిరితే బీజేపీ లేకపోతే కమ్యూనిస్టులతోనే తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది. దాంతో వాటికి పెద్దగా సీట్లు కేటాయించిన సందర్భాలు లేవు. కానీ ఇక్కడ జనసేన అలా కాదు. ఒక బలమైన నాయకుడు పవన్ కళ్యాణ్ దానికి లీడర్ గా ఉన్నారు.

ఆయన వెనక బలమైన సామాజిక వర్గం ఉంది. వారితో పాటే బలమైన చిరకాల కోరిక కూడా ఉంది. కాపు సీఎం కావాలన్నదే వారి డిమాండ్. మరి పొత్తులతో అది సాధ్యపడుతుందా అంటే ఇపుడున్న పరిస్థితులను బేరీజు వేసుకుని ఆలోచిస్తే సాధ్యపడుతుంది అని జనసేన వర్గాలతో పాటు దాని అభిమానులు ఒక బలమైన సామాజిక వర్గం పెద్దలు కూడా అంటున్నారు.

అదేలా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ అని అంటున్నారు. ఏపీలో 175 సీట్లు ఉంటే అందులో దాదాపుగా సగం అంటే 75 సీట్లను జనసేనకు పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇవ్వాలని డిమాండ్ ఇపుడు ముందుకు వస్తోంది. దానికి జనసేన వర్గాల నుంచి ఒక సహేతుకమైన వాదన కూడా ఉందిట. అదేంటి అంటే 2019 ఎన్నికల్లో ఏపీలో జనసేన దాదాపుగా నలబై అసెంబ్లీ నియోజకవర్గాలలో తన ప్రభావాన్ని గట్టిగా చూపించింది అని అంటున్నారు.

అప్పటితో పోలిస్తే ఇపుడు జనసేన గ్రాఫ్ బాగా పెరిగిందని లెక్కలు తీస్తున్నారుట. కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ వెంట పోలరైజ్ అవుతోందని, అలాగ యువత ఆ వైపు ఉన్నారని, ఇక తటస్థ వర్గాలు సైతం పవన్ని సీఎం గా చూడాలని అనుకుంటున్నారని అంటున్నారు. దాంతో పవన్ తో పొత్తు అంటే కచ్చితంగా 75 సీట్లు ఇవ్వాలని ఒక డిమాండ్ స్టార్ట్ చేశారని ప్రచారంలో ఉన్న మాట. అంతే కాదు పవన్ని సీఎం గా ప్రకటించాలని కూడా కోరుతున్నారు.

ఇక మరో వైపు చూస్తే టీడీపీ అనుకూల మీడియాలో కొన్ని కధనాలు పవన్ బాబు భేటీల మీద వచ్చాయి. అందులో జనసేనకు పాతిక నుంచి ముప్పయి సీట్లు తెలుగుదేశం ఇచ్చి మిగిలిన వాటిలో తాను పోటీ చేస్తుంది అని అంటూ రాసుకొచ్చారు. దాని మీద జనసేన వర్గాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయని టాక్. కేవలం పాతిక ముప్పయి సీట్లతో పొత్తులేంటి అని అంటున్నారు. అలాగే వైసీపీ విముక్త ఏపీ కోసం సీఎం సీటుని పవన్ త్యాగం చేసినట్లుగా కొన్ని మీడియా వార్తలు అతిగా రాస్తున్నారు అని ఫైర్ అవుతున్నారు.

ఇదంతా బాబుకు మేలు చేయడానికే తప్ప మరోటి కాదని అంటున్నారు. అయితే ఏపీలో బలంగా ఉన్న వైసీపీని ఢీ కొట్టాలీ అంటే కచ్చితంగా జనసేన అవసరం తెలుగుదేశానికే ఎక్కువ ఉంది కాబట్టి ఆ విధంగా సాధ్యమైనంతవరకూ తగ్గి పొత్తులకు సిద్ధపడాలని అంటున్నారు. అలా జరిగితేనే ఏపీలో వైసీపీని గద్దె దించి అధికారంలోకి రావడం జరుగుతుంది అని అంటున్నారు. మరి జనసేనకు 75 సీట్లు అని వస్తున్న డిమాండ్లు కానీ జరుగుతున్న ప్రచారం కానీ ఖరీదు అయినదే అని అంటున్నారు.

అలా కనుక చూసుకుంటే కేవలం వంద సీట్లలో తెలుగుదేశం పోటీ చేయాల్సి వస్తుంది. మరి ఆ వందలో 88 సీట్లు మ్యాజిక్ ఫిగర్ కి రావు. అపుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తెలుగుదేశం చరిత్రలో ఎపుడూ అలా జరగలేదు. పైగా 75 సీట్లు జనసేనకు వదిలేస్తే కచ్చితంగా అది ఆ పార్టీలో తిరుగుబాటుకు దారి తీస్తుంది అని అంటున్నారు.

ఏది ఏమైనా పొత్తుల విషయంలో ఓకే చెబుతూనే జనసేన వర్గాల నుంచి ఈ రకంగా డిమాండ్లు వస్తున్నాయని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజమో చూడాలి. ఏది ఏమైనా తెలుగుదేశం అనుకూల మీడియా చంద్రబాబుకు అధికారం కోసం అపుడే సీట్ల పంచాయతీ పెట్టి జనసేనను తగ్గించాలని చూస్తే మాత్రం అది రివర్స్ అవుతుందనే అంటున్నారు.