Begin typing your search above and press return to search.

తొలి తెలుగు ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు బ‌యోపిక్

By:  Tupaki Desk   |   29 May 2022 11:30 PM GMT
తొలి తెలుగు ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు బ‌యోపిక్
X
బ‌యోపిక్ ల ట్రెండ్ లో జీవిత‌క‌థ‌ల కోసం వెతికే వారికి ఈ తెలుగు మ‌హ‌నీయుడి క‌థ క‌నిపించ‌డం లేదా? దేశంలో ఎంద‌రో గొప్ప వారి క‌థ‌ల్ని మ‌నం వెతికాం కానీ ఆయ‌న క‌థ‌ను ప‌ట్టించుకున్న‌దే లేదు. తొలి తెలుగు ప్రధాని.. సంస్కరణల పితామహుడు పీవీ నరసింహరావు బ‌యోపిక్ గురించే ఈ ప్ర‌శ్న‌. అస‌లు ఇన్నాళ్లు ఎందుక‌ని ఆయ‌న క‌థ‌ను సినిమాగా తీయ‌లేక‌పోయాం.. ఒక తెలుగు వాడై ఉండీ .. ఇది అవ‌మానం కాదా?! తెలుగ‌మ్మాయి ఐట‌మ్ గాళ్ సిల్క్ స్మిత‌కు ఉన్న మార్కెట్ వ్యాల్యూ సంస్క‌ర‌ణ‌ల‌తో దేశాన్ని ఆర్థికంగా ఆదుకున్న ఆయ‌న గొప్ప వాడు కాదా ఈ రంగుల ప్ర‌పంచానికి?

దేశం నాకేమిచ్చిందన్నది కాదు దేశానికి నేనేమి ఇచ్చానన్నదే ముఖ్యం అని నమ్మిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో చేతల్లో చూపారు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు. తెలుగు వారు గ‌ర్వించ‌ద‌గిన రాజ‌కీయ‌నేత ఆయ‌న‌. ఆర్థిక సంస్క‌ర్త‌. మ‌హా మేధావి. రాజకీయాలకే రాజనీతి నేర్పిన అపర చాణిక్యుడు ఆయన. దేశం గర్వించిన తెలంగాణ బిడ్డ. పీవీ పేరు చెబితే ముందుగా మనకు గుర్తుకు వచ్చేవి ఆర్థిక సంస్కరణలే. అప్పటి వరకు దేశం అనుసరిస్తున్న ప్రభుత్వ - ప్రైవేటు విధానాలకు బ్రేకులు వేసి ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ఒక్క మేలిమి మ‌లుపుతో ముందుకు తీసుకెళ్లారు.

ఇవాళ అనేక రంగాల్లో మనం అభివృద్ది లో దూసుకుపోతున్నామంటే అదంతా పీవీ ప్రభుత్వం అమలు చేసిన ఆర్థిక సంస్కరణల ఫలితమే. దేశానికి విశిష్ట సేవలను అందించిన పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆయన బ‌యోపిక్ ని మ‌న‌వ‌రాలు ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. స్వర్గీయ భారత ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు మనవరాలు శ్రీమతి అజిత పీవీ బ‌యోపిక్ ని తెర‌కెక్కిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఫార్మసీ-ఆర్కిటెక్చర్-ఫైన్ ఆర్ట్స్ -ఫోటోగ్రఫీలలో డిప్లొమా మొదలుకుని... పోస్ట్ గ్రాడ్యుయేషన్.. డాక్టరేట్ వరకు విద్యనందిస్తున్న ప్రతిష్టాత్మక కళాశాలలు అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తూనే... తన తాతగారు పి.వి.నరసింహారావు జీవితాన్ని తెరకెక్కించి... నేటి యువతలో స్ఫూర్తి నింపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు బహుముఖ ప్రతిభాశాలి శ్రీమతి అజిత.

ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ కోసం కళాశాల ప్రాంగణంలోనే అత్యంత ఆధునాతనంగా.. గ్రీన్ మ్యాట్ స్టూడియో- ఆడియో మిక్సింగ్- ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోలను నెలకొల్పిన అజిత... చిన్న మధ్య తరగతి నిర్మాతలకు లాభాపేక్ష లేకుండా వాటిని అందుబాటులో ఉంచేందుకు సంకల్పిస్తున్నారు. అంతేకాదు మూడెకరాల విస్తీర్ణంలో నిర్మించిన సువిశాల భవంతుల్లో పలు రకాల సన్నివేశాలు షూటింగ్స్ చేసుకునే వీలు కూడా కల్పిస్తున్నారు. తన తాతగారి బయోపిక్ కోసం ప్రస్తుతం టి.ఆర్.ఎస్.పార్టీలో ఎమ్.ఎల్.సి గా సేవలందిస్తున్న తన తల్లి వాణీదేవి సలహాలు సూచనలు తీసుకుంటున్నానని అజిత తెలిపారు. తన తాతగారి బహుభాషా ప్రావీణ్యం- అసాధారణ రాజకీయ చాతుర్యంతోపాటు... బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని ఎన్నో విషయాలను ఈ బయోపిక్ లో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని అజిత వివరించారు.

భారతదేశం గర్వించదగ్గ ఓ మహా నాయకుడి మనవరాలు అయినా అత్యంత సాదాసీదాగా ఉండే అజిత... తమ ఫిల్మ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతూ.. త్వరలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది. మా దగ్గరున్న గ్రీన్ మ్యాట్ స్టూడియో.. ఆడియో మిక్సింగ్.. ఎడిటింగ్.. డబ్బింగ్ యూనిట్ లను అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా సినిమా రంగానికి మావంతు సేవలందించాలని భావిస్తున్నాం. అలాగే ఈ ప్రాంగణంలో షూటింగ్స్ .. ఓపెనింగ్ వేడుక‌లు.. ఆడియో రిలీజ్ వంటి ఫంక్షన్స్ చేసుకునేందుకు కూడా మా ప్రాంగ‌ణంలో వీలు కల్పిస్తున్నాము అని అన్నారు.

తెలంగాణ‌లో సినీ ఔత్సాహికుల‌కు కొద‌వేమీ లేదు. ద‌ర్శ‌కులుగా.. నిర్మాత‌లుగా.. స్టూడియో య‌జ‌మానులుగా అవ‌త‌రించే ట్యాలెంట్ ఎందరికో ఉంది. కానీ ఇప్ప‌టికీ ఆ దిశగా అభివృద్ధి జ‌ర‌గ‌ని క్ర‌మంలో ఇప్పుడిలా తెలంగాణ బిడ్డ ప్ర‌య‌త్నాన్ని తెలుగు వారంతా ఆశీర్వ‌దిస్తున్నారు. పీవీ న‌ర‌సింహారావు బ‌యోపిక్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలుగువారంద‌రిలో స్ఫూర్తి నింపుతుంద‌ని ఆశిస్తున్నారు.