Begin typing your search above and press return to search.

ఆ అంచనాలో పొరపాటు.. ఉక్రెయిన్ లో మనోళ్లు ఉండిపోయారు

By:  Tupaki Desk   |   1 March 2022 3:32 AM GMT
ఆ అంచనాలో పొరపాటు.. ఉక్రెయిన్ లో మనోళ్లు ఉండిపోయారు
X
ఉక్రెయిన్ - రష్యాల మధ్య నడుస్తున్న యుద్ధం ఇప్పుడో హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. మిగిలిన దేశాల సంగతి ఎలా ఉన్నా.. మన దేశం వరకు వచ్చేసరికి.. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన వేలాది మందిని సురక్షితంగా భారత్ కు చేర్చటం ఇప్పుడో పెద్ద టాస్కుగా మారింది. ఇప్పటివరకు దాదాపు మూడు వేల మంది వరకు భారతీయుల్ని ఉక్రెయిన్ నుంచి క్షేమంగా తీసుకురావటం తెలిసిందే.

సోమవారం చోటు చేసుకున్న పరిణామాలతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఉక్రెయిన్ - రష్యా మధ్య జరుగుతున్నయుద్ధానికి సంబంధించి ఐక్యరాజ్యసమితిలో నిర్వహించిన ఓటింగ్ లో భారత్ దూరంగా ఉండటంతో పరిస్థితులు మారిపోయాయి. మొన్నటివరకు భారత్ కలుగజేసుకోవాలని.. భారత ప్రధానమంత్రి మోడీ అత్యంత శక్తివంతుడని.. తన చిరకాల మిత్రుడు రష్యాకు నచ్చజెప్పాలని కోరిన ఉక్రెయిన్.. ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్ కు దూరంగా ఉన్నంతనే.. తమ దేశంలో ఉన్న భారతీయులపై తేడాగా వ్యవహరించటం మొదలు పెట్టారు. దీంతో.. ఇంతకాలం సాయం కోసం ఆర్థిస్తున్న మనవారు.. ఇప్పుడు తమను వెంటనే కాపాడాలని.. ఉక్రెయిన్ సైనికులు.. పోలీసుల చేష్టలను భరించలేకపోతున్నట్లుగా పేర్కొంటున్నారు.

ఇంతకీ మనోళ్లు అంతమంది ఎందుకు చిక్కుకుపోయారు. రష్యాతో యుద్ధానికి అవకాశం ఉందన్న విషయం ఇప్పటికిప్పుడు జరిగిన పరిణామం కాదు కదా? దాదాపు నెల నుంచి ఇలాంటి వాతావరణం ఉంది కదా? అపాయం ముంచుకొస్తున్న వైనం అర్థమైనప్పుడు.. వెంటనే అక్కడి నుంచి బయటపడాలి కదా? అందుకు భిన్నంగా ఉక్రెయిన్ లో మనోళ్లు అంత మంది ఎందుకు ఉండిపోయినట్లు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. షాకింగ్ అంశాలు వెలుగు చూస్తాయి.

ఉక్రెయిన్ కు వెళ్లే మనోళ్లలో అత్యధికులు వైద్య విద్యను అభ్యసించటానికి వెళుతుంటారు. భారత్ లో డెంటల్ కోర్సును చేయటానికి అయ్యే ఖర్చుకు ఇంచుమించు దగ్గరగా.. ఉక్రెయిన్ లో ఏకంగా మెడికల్ కోర్సును పూర్తి చేయొచ్చు. అది కూడా.. చక్కటి హాస్టల్.. ఫుడ్ పెసిలిటీతో. వైద్య విద్యతో పాటు.. పెట్రోలియం కోర్సులకు అక్కడ అవకాశం ఉండటంతో.. ఆ కోర్సుల్ని అభ్యసించేందుకు మనోళ్లు వెళుతుంటారు. కాకుంటే తక్కువ సంఖ్యలో. రష్యాతో యుద్ధం గురించి వార్తలు వచ్చినా.. ముందే భారత్ కు వచ్చేయకపోవటానికి కారణం.. చిన్నపాటి అంచనా పొరపాటుతో పాటు.. కక్కుర్తి కూడా అని చెప్పక తప్పదు.

మొదటగా అంచనా పొరపాటు అన్నదెలా అన్నది చూస్తే.. రష్యాతో యుద్ధవాతావరణం ఉన్నప్పటికీ.. యుద్దం వరకు తీసుకురాదన్న అంచనా. దీంతో.. తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో చాలామంది ఉండిపోయారు. నిజానికి ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధ వాతావరణం మొదలైనంతనే.. అపాయాన్ని గుర్తించిన పలువురు భారత్ కు వచ్చేశారు. లేకుంటే.. స్వదేశానికి తీసురావాల్సిన భారతీయుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేది.

ఇక.. రెండోది కక్కుర్తి. యుద్ధం జరుగుతుందన్న విషయంపై అవగాహన వచ్చినప్పటికీ.. చివర్లో ముగుస్తుందేమోనన్న ఆలోచనతో పాటు.. తాము చేస్తున్న కోర్సు మరో రెండు.. మూడు నెలల్లో పూర్తి అయిపోతున్న వేళ.. మళ్లీ వెళ్లి రావటం ఖర్చుతో కూడుకున్నదన్న ఉద్దేశంతో ఉక్రెయిన్ లోనే ఉండిపోయారు మరికొందరు. ఈ కక్కుర్తి ఈ రోజు ప్రాణాల మీదకు తీసుకురావటమే కాదు..వారి తల్లిదండ్రులకు తరగని టెన్షన్ ను తీసుకొచ్చారని చెప్పాలి.