Begin typing your search above and press return to search.

ఆరు విమానాల్లో 1200 మంది విద్యార్థులు..: నేడు వచ్చే అవకాశం..

By:  Tupaki Desk   |   3 March 2022 5:27 AM GMT
ఆరు విమానాల్లో 1200 మంది విద్యార్థులు..: నేడు వచ్చే అవకాశం..
X
ఉక్రెయిన్లో యుద్ధ వాతావరణంతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. రష్యా చేస్తున్న బాంబుల దాడితో ఏ వైపు నుంచి మిషైల్ దూసుకొస్తుందోనని ఉక్రెయిన్లు ఆందోళన చెందుతున్నారు. దేశంలోని రాజధాని కీవ్ ను అతలాకుతలం చేసిన రష్యా ఇప్పుడు ఖార్కివ్ పై విరుచుకుపడుతోంది. ఈ నగరంలోని ప్రధాన భవనాలను లక్ష్యంగా చేసుకొని బాంబులు వేస్తోంది. ఈ క్రమంలో సాధారణ పౌరులు చాలా మంది మరణిస్తున్నారు.

ఇందులో ఇప్పటికే ఓ ఇండియన్ మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉక్రెయిన్లో చిక్కుకున్నవారిని ఎలాగైనా తీసుకురావాలని యుద్ధ విమానాలను సైతం సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ పుతిన్ కు ఫోన్ చేశారు. తమవాళ్లను తీసుకొచ్చేందుకు కొంచెం గడువు ఇవ్వాలని కోరాడు. దీంతో ఆరు గంటలపాటు యుద్ధానికి విరామం ఇచ్చారు. కీవ్, ఖార్కివ్లో ఉన్నవాళ్లను తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రులతో సహా విమానాలు అక్కడికి వెళ్లాయి.

ఈనేపథ్యంల ఉక్రెయిన్లో ఉన్న భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కీవ్, ఖార్కీవ్ నగరాలను వెంటనే విడిచిరావాలని కోరింది. ఇందులకు 6 గంటలు మాత్రమే సమయం ఉందని తెలిపింది. అయితే ఈ నగరాల్లో చిక్కుకున్న వారిని స్యయంగా తీసుకొచ్చేందుకు కేంద్రమంత్రులు వెళ్తున్నారు. ఇప్పటికే జ్యోతిరాధిత్య సింధియా అక్కడికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఇక్కడ్నుంచి ప్రతీ భారతీయుడిని తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇస్తున్నారు.

ఆపరేషన్ గంగ పేరుతో నిర్వహిస్తున్న ఈ మిషన్ ను కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా పర్యవేక్షిస్తున్నారు. బుకారెస్ట్ ఎయిర్ పోర్టులో విద్యార్థులను స్వయంగా ఆయనే దగ్గరుండి విద్యార్థులను విమానాలు ఎక్కిస్తున్నారు. భారతీయులందరినీ తరలించేవారకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని అన్నారు. అయితే ఈ సమయం ఆరుగంటలు మాత్రమే ఉందని, దీంతో కీవ్ నగరంలోని పౌరలుంతా స్వదేశానికి రావడానికి సిద్ధం కావాలని అన్నారు. కేంద్రం దగ్గరుండి వాకబు చేస్తోంది.

ఇదిలా ఉండగా రొమేనియా ప్రధాని నికోలే సియుకాతోతో కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా సమావేశమయ్యారు. ఉక్రెయిన్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో పౌరులకు భద్రత కల్పించినందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. బుకారెస్ట్ నుంచి తమ పౌరులను తరలించడం సులభతరం చేశారని, మీ మేలు మరువలేమని తెలిపారు. రొమేనియాలోని బుకారెస్ట్ నుంచి బుధవారం 6 విమానాలు నడుస్తాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ విమానాల్లో మొత్తం 1200 మంది విద్యార్థులు దేశానికి చేరేలా ఏర్పాట్లు చేశామని అన్నారు.

అటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ 17 విమానం ద్వారా భారతీయులను తరలించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు సుమారు 17 వేల మంది భారతీయులు ఇండియాకు వచ్చారని విదేశాం శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్బి తెలిపారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్లో ఉన్న భారతీయుల గురించి భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి భారతీయుడికి అండగా ఉంటామని అన్నారు.