Begin typing your search above and press return to search.

నాటి డీజీపీ నవాంగ్ ను కలిసినప్పుడు వైఎస్ వివేకా కూతురు.. అల్లుడుకి ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   1 March 2022 5:05 AM GMT
నాటి డీజీపీ నవాంగ్ ను కలిసినప్పుడు వైఎస్ వివేకా కూతురు.. అల్లుడుకి ఏం చెప్పారు?
X
దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణలో పలువురు ఇచ్చిన వాంగ్మూలాలు ఒక ఎత్తు అయితే.. వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి.. అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిలు ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు పెనుసంచలనంగా మారటమే కాదు.. ఏపీ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసేలా మారింది.

అన్నింటికి మించి వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కీలక ప్రస్తావన ఇప్పుడు కొత్త వివాదానికి తెర తీయటమేకాదు.. వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన వైపు వేలెత్తి చూపేలా ఉండటం షాకింగ్ గా మారింది.

వైఎస్ వివేకా అల్లుడు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో.. అప్పటి ఏపీ డీజీపీ నవాంగ్ ప్రస్తావన.. ఆయన నోటి నుంచి అనూహ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన.. ఆయన నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్న మాటలు ఇప్పుడు కొత్త సందేహాలకు తెర తీయటమే కాదు.. వైఎస్ వివేకా హత్య వెనుక భారీ కుట్ర జరిగిందన్న భావన వ్యక్తమయ్యేలా చేస్తోంది. వైఎస్ వివేకా అల్లుడు ఇచ్చిన వాంగ్మూలంలో వైఎస్ జగన్ ప్రస్తావనకు సంబంధించి ఆయన ఏం చెప్పారు? అన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

- వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్తగా ఎస్పీ అభిషేక్‌ మహంతి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేశారు. దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు ఆగస్టు 26 -29 మధ్యలో ఉదయ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో వైఎస్ అవినాశ్ రెడ్డి.. ముఖ్యమంత్రి సతీమణి భారతికి వరసకు సోదరుడు అయ్యే ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి.. డి శివశంకర్ రెడ్డిలు భయంతో విజయవాడకు వచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు.

- తన దగ్గరకు వచ్చిన ఆ ముగ్గురిని డీజీపీ గౌతమ్ నవాంగ్ ను కలవాలన్నారు. వాళ్లు ఆయనతో భేటీ అయ్యారు. సెప్టెంబరు ఆరున నేను.. నా భార్య సునీత డీజీపీని కలిశాం. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి అనూహ్యంగా ఒక మాట వచ్చింది. ‘సీఎం ఈ విషయంలో డిస్టర్బ్ అవుతున్నారు’ అని అన్నారు.

- ఆ ముగ్గురు (అవినాశ్‌ రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌ రెడ్డి, డి.శివశంకర్‌ రెడ్డి) గురించి ప్రస్తావిస్తూ..‘‘మీ దగ్గరకు వస్తున్న వాళ్లు నాకు రెండు కళ్లు’’ అని ముఖ్యమంత్రి చెప్పారని నోరు జారి.. వెంటనే ఆగిపోయారు.

- తర్వాతి కాలంలో ఒక ఐఏఎస్ అధికారిని కలిసినప్పుడు.. కోడి కత్తి కేసులో జగన్ భుజానికి కుట్లేసిన వైద్యుడికి వేల కోట్ల రూపాయిల మందుల్ని కొనుగోలు చేసే కార్పొరేషన్ పదవి ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. దీంతో.. మామ హత్యను కూడా జగన్ ఎన్నికల్లో సానుభూతికి వాడుకున్నట్లుగా తెలుస్తోంది.