Begin typing your search above and press return to search.

త‌మిళ రాజ‌కీయంలో నిన్న ఏం జ‌రిగిందంటే...

By:  Tupaki Desk   |   12 Feb 2017 6:12 PM GMT
త‌మిళ రాజ‌కీయంలో నిన్న ఏం జ‌రిగిందంటే...
X
త‌మిళ‌నాట రాజ‌కీయం రంజుగా సాగుతోంది. ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం బ‌లం రోజురోజుకూ పెరిగిపోతుండ‌గా.. చిన్న‌మ్మ శ‌శిక‌ళ వ‌ర్గంలో ఆందోళ‌న మొద‌లైంది. తాజాగా ఆదివారం మ‌రో ముగ్గురు ఎంపీలు ప‌న్నీర్ సెల్వం వ‌ర్గంలో చేరారు. అన్నా డీఎంకే లోక్‌స‌భ ఎంపీలు జైసింగ్ త్యాగ‌రాజ్ న‌ట్టెర్జీ (ట్యూటికోరిన్‌), సెంగుట్టువాన్ (వెల్లూరు), ఆర్పీ మ‌రుత‌రాజ (పెరంబ‌లూర్‌) ప‌న్నీరుసెల్వానికి త‌మ మ‌ద్ద‌తు తెలిపారు. ఇవాళ ఉద‌యం గ్రీన్‌వేస్ రోడ్డులోని ఆయ‌న ఇంటికి వెళ్లి త‌మ మ‌ద్ద‌తు మీకేన‌ని స్ప‌ష్టంచేశారు. ఇంత‌కుముందే మ‌రో న‌లుగురు ఎంపీలు కూడా సీఎం గూటికి చేరిన విష‌యం తెలిసిందే. రాజ్య‌స‌భ ఎంపీ మైత్రేయ‌న్ కూడా ప‌న్నీర్‌ క్యాంప్‌లోనే ఉన్నారు. ప‌న్నీర్ కు ఇప్ప‌టికే త‌నతో పాటు మ‌రో ఆరుగురు ఎమ్మెల్యేల మ‌ద్దతు కూడా ఉంది. మొత్తం పది మంది ఎంపీలు (8 మంది లోకసభ, ఇద్దరు రాజ్యసభ) కూడా పన్నీర్‌ వెంట ఉన్నారు. ఆదివారం ఎంపీల‌తోపాటు మాజీ మంత్రి కేఏ జ‌య‌పాల్‌, ఎరోడ్ మాజీ మేయ‌ర్ మ‌ల్లికా ప‌ర‌మ‌శివ‌న్ కూడా ప‌న్నీర్‌ వ‌ర్గంలో చేరారు.


- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు మనోబాల పన్నీర్‌సెల్వానికి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా మనోబాల మాట్లాడుతూ "నేను పన్నీర్‌సెల్వంతో చాలా కాలం పనిచేశా. పన్నీర్‌సెల్వం చాలా మంచి వ్యక్తి. ఆయన నాయకత్వంలో చొక్కా కాలర్ ఎగరేసి ధీమాగా నడుచుకుంటూ వెళ్లొచ్చు" అని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన మనోబాలకు పన్నీర్‌సెల్వం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మనోబాలను పన్నీర్‌సెల్వం శాలువాతో సత్కరించారు.

-- కాగా మ‌రో మరో 11మంది ఎమ్మెల్యేలు ప‌న్నీర్ సెల్వంకు మ‌ద్ద‌తిస్తే శశికళ సీఎం కావాల‌నే క‌ల నెర‌వేర‌ద‌ని అంటున్నారు. తమిళనాడు మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 235. ప్రస్తుతం జయలలిత చనిపోవడంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే ప్రస్తుతం 117 మ్యాజిక్‌ ఫిగర్‌ కావాలి. శశికళ మాత్రం 131మంది ఎమ్మెల్యేలు కూడా తనతోనే ఉన్నారని అంటున్నారు. అయితే, ప్రస్తుతం పన్నీర్‌కు 7గురు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఆయనతో కలిపితే ఎనిమిది. ఇది ఇలాగే కొనసాగితే, శశికళ ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి భంగం వాటిల్లదు. కానీ, మరో పదకొండు మంది ఎమ్మెల్యేలు సెల్వం వైపు వస్తే మాత్రం శశి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేరు. అలాంటి పరిస్థితే వస్తే తమిళ రాజకీయం మరింత ఆసక్తిగా మారడం ఖాయం. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే మొత్తం 135 స్థానాలను దక్కించుకుంది.

--చాలామంది ఎమ్మెల్యేలు పన్నీరు వెంట నడవాలని భావిస్తున్న నేప‌థ్యంలో ఇదే సరైన సమయం అని భావిస్తున్న పన్నీరు ఎమ్మెల్యేలుంటున్న రిసార్ట్‌కు వెళ్లాలని భావిస్తున్నారు. పన్నీరు వర్గంలోని ఓ మంత్రి ఈ పర్యటనకు సంబంధించిన విషయాన్ని వెల్లడించారు. అయితే పన్నీరు కలవడానికి వెళితే శశికళ అనుచరులు అడ్డుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో వెళుతున్న పన్నీరును అడ్డుకునేంత అవకాశం వారికి ఉండదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

-నాలుగు రోజులుగా టీవీలు, పత్రికలకే పరిమితమైన తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. తాజాగా గోడలకు ఎక్కారు. టీవీలు, పత్రికలు చూడని సామాన్యుల దగ్గరకి కూడా చేరేందుకు పోస్టర్లు వేస్తున్నారు. సినిమాల ప్రచారానికి వేసే సైజు భారీ పోస్టర్లు చెన్నైలోని ఆయన ఇంటి దగ్గర, చుట్టుపక్కల ప్రాంతాల్లో గోడలపై అంటిస్తున్నారు. చెన్నైలోని మెరీనా బీచ్ లో జయలలిత సమాధి దగ్గర నాలుగు రోజుల కిందట పన్నీర్ సెల్వం మౌనదీక్ష చేసిన ఫోటో, జయలలిత ఆయన్ని ఆశీర్వదిస్తున్నట్టు ఉన్న ఫోటోని కలిపి పోస్టర్ తయారు చేశారు. అమ్మకు ఏకైక రాజకీయ వారసుడు పన్నీర్ సెల్వం అని పెద్ద అక్షరాలతో పోస్టర్లపై ప్రచురించారు.

- తాను సింహంలాంటి దాన్నని.. తన వెనక ఉండేది సింహమే అవుతుందని.. తాను ఎవరికీ భయపడను.. మడమ తిప్పనని ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ అన్నారు. తన వర్గం ఎమ్మెల్యేలు ఉన్న గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్లిన శశికళ పార్టీ శాసనసభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళే కదా అని భయపెట్టాలని చూస్తున్నారు. వారి ఆటలు సాగబోవన్నారు. జయలలిత, తాను చెన్నై జైలును, బెంగళూరు జైలు చూశామన్నారు. జైలు నుంచి వచ్చిన అనంతరం మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. పార్టీకి ఏమైనా అయితే తన ప్రాణాలిచ్చి కాపాడుకుంటానన్నారు. ఎమ్మెల్యేలంతా తనతో ఉంటే పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు.

-భేటీ అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆమె స్పందిస్తూ.. తమ శాసనసభ్యులను ఎవరూ నిర్బంధించలేదని తెలిపారు. అందరు శాసనశాభ్యులు స్వతంత్రంగా ఉన్నారన్నారు. తమ పార్టీపై ప్రత్యర్థులు దుష్ఫ్రాచారం చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలను నిర్బంధించామంటున్నారు. వారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. ప్రత్యర్థులే తమ శాసనసభ్యులను బెదిరిస్తున్నట్లు ఆమె ఆరోపించారు.

-గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరి మూడు రోజులైనా పిలుపు రాకపోవడంతో శశికళలో అసహనం పెరుగుతోంది. తమ పార్టీని చీల్చేందుకే తాత్సారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆదివారం నుంచి తాము కొత్త పంథాలో నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. పోయెస్ గార్డెన్ వద్ద మద్దతుదారులతో మాట్లాడుతూ సహనానికి ఒక హద్దు ఉంటుందని చెప్పారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు లేఖ రాశారు.

- కాగా అక్ర‌మాస్తుల కేసులో కోర్టు తీర్పు వచ్చేంత వరకూ వేచి చూడాలని శశికళకు చెప్పిన గవర్నర్ ఇక లాభం లేదని భావిస్తున్నారు. శశికళతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే న్యాయపరంగా తలెత్తే సమస్యలపై ఆయన మాజీ అటార్నీ జనరల్ సొరాబ్జీతో ఇవాల్టి భేటీలో మాట్లాడారు. ఆయన సలహాలు, అభిప్రాయాలు విన్న తర్వాత ఈ రాజకీయ సంక్షోభానికి ఫుల్‌స్టాప్ పెట్టాలనే యోచనకు గవర్నర్ వచ్చినట్లు తెలుస్తోంది.

- అన్నాడీఎంకే అధినేత్రి శశికళను ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించాలని కోరుతున్న భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి శనివారం నాడు తమిళనాడు ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర రావును కలిశారు. ఈ సందర్భంగా సుమారు 20 నిమిషాల పాటు కొన‌సాగిన ఈ భేటీ అనంత‌రం మీడియాతో మాట్లాడ‌కుండానే ఆయ‌న వెనుతిరిగారు.

-ఏఐఏడీఎంకేలో శశికళ వర్గానికి చెందిన ఓ నేతను ముగ్గురు వ్యక్తులు అత్యంత పాశవికంగా అందరూ చూస్తుండగానే హత్య చేశారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ హత్యకు సంబంధించి వీడియోను పోలీసులు విడుదల చేశారు. తిరువన్నామలై జిల్లాలో జరిగిన ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా కలకలం రేపింది. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన తిరువన్నామలై నగర మాజీ సెక్రటరీ, ప్రస్తుత మున్సిపల్ కౌన్సిలర్ వి.కనకరాజ్‌(40)ను ప్రత్యర్థులు నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. కాగా, హత్య చేసింది తామే అంటూ డీఎంకేకు చెందిన ముగ్గురు నిందితులు బాబు,రాజా, శరవణన్ పోలీస్‌ స్టేషన్‌ లో లొంగిపోయారు. మ‌రోవైపు కనకరాజ్‌ మృతిపట్ల ఏఐఏడీఎంకే నాయ‌కురాలు శశికళ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- సీఎం సీటు కోసం తొంద‌ర‌ప‌డ‌టం పార్టీ వ‌ర్గాల్లోనే సందేహాన్ని నింపింద‌ని అంటున్నారు. ముఖ్య‌మంత్రి ఖుర్చీ కోసం ఆమె వేసిన ఎత్తుగడ బాగానే ఉన్నా, ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కొకొనాలనే దానిపై క్లారిటీ లేకపోవడం వంటివి ఇబ్బందిక‌రంగా మారాయ‌ని అంటున్నారు. తొందరపాటు చర్యలు, అమ్మ వైద్యం విష‌యంలో ర‌హ‌స్యం పాటించ‌డం ఆమెపై అనుమానాల‌కు తావిచ్చిందని అంటున్నారు.