Begin typing your search above and press return to search.

ఢిల్లీ ఎన్నికల ఫలితం: గ్యాస్ ధరలు భగ్గు

By:  Tupaki Desk   |   12 Feb 2020 10:15 AM GMT
ఢిల్లీ ఎన్నికల ఫలితం: గ్యాస్ ధరలు భగ్గు
X
రాయితీయేతర వంట గ్యాస్‌ ధర మండుతోంది. దాని ధర పెరుగుతుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మెట్రో నగరాల్లో బుధవారం వరుసగా ఆరోసారి భారీగా ధర పెరిగింది. రూ.వందకు పైగా పెరగడంతో వినియోగదారులు వినియోగదారులు లబోదిబోమనే పరిస్థితి ఏర్పడింది. ఈ ధరలు మెట్రో నగరాల్లో భారీగా పెరిగాయి. పెరిగిన ఎల్పీజీ ధరలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఢిల్లీ - ముంబై నగరాల్లో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ కు వరుసగా రూ 144.5 - రూ 145 వరకూ పెంచినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.

దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులే కారణమని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించగా.. అది కాదు ఢిల్లీ ఎన్నికలు ముగియడంతో కేంద్రం ఈ బాదుడు వేసిందని పలువురు పేర్కొంటున్నారు. ఇండేన్‌ బ్రాండ్‌ నేమ్‌ తో వంటగ్యాస్‌ ను సరఫరా చేసే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ రూ.144.5 నుంచి 145 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ తాజా పెంపుతో సబ్సిడీయేతర ఎల్పీజీ రేట్లు ఢిల్లీలో రూ 858 - ముంబైలో రూ 829 - చెన్నైలో రూ 881 - కోల్‌ కతాలో రూ.896కు పెరిగాయి. ఏటా 12 సిలిండర్లను ప్రభుత్వం సబ్సిడీకి అందిస్తుండగా అదనపు సిలిండర్‌ ను మార్కెట్‌ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

అంతర్జాతీయ మార్కెట్‌ లో ఎల్ పీజీ ధరలు -రూపాయి మారకం రేటు ఆధారంగా ప్రభుత్వం నెలవారీ సబ్సిడీలను వినియోగదారులకు అందిస్తోంది. అయితే ఇన్నాళ్లు ఎన్నికలు ఉండగా ఈ ధర పెరగకపోగా ఎన్నికలు ముగిసిన అనంతరం పెంచారని వినియోగదారులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ఈ ధరలు పెంచితే ప్రభావం తీవ్రంగా ఉంటుందనే ఉద్దేశంతో ఎన్నికల అనంతరం పెంచారని - ప్రజల బాదుడే పనిగా కేంద్రం పెట్టుకుందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే పెట్రోల్ - డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండగా ఇప్పుడు వంటగ్యాస్ కూడా పెరిగితే బతికేదెట్టా అని ప్రశ్నిస్తున్నారు.