Begin typing your search above and press return to search.

వైఎస్ఆర్ ఉన్నప్పుడు గెలిచావ్.. ఇప్పుడు రెండు సార్లు ఎందుకు ఓడావ్?

By:  Tupaki Desk   |   27 May 2022 9:34 AM GMT
వైఎస్ఆర్ ఉన్నప్పుడు గెలిచావ్.. ఇప్పుడు రెండు సార్లు ఎందుకు ఓడావ్?
X
నిజానికి ఏ పార్టీ అయిన విజయతీరాలకు చేరాలంటే నాయకత్వమే బలం.. బలగం.. అప్పటికి రెండు సార్లు ఉమ్మడి ఏపీలో సీఎంగా వెలుగు వెలిగిన చంద్రబాబును గద్దె దించింది కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే. అప్పటికి కాంగ్రెస్ లో ఎన్నో గ్రూపులు.. అసమ్మతులు ఉన్నా కూడా వారందరినీ ఏకం చేసి.. ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేసి మరీ సీఎం అయ్యారు. అనంతరం మరోసారి ప్రజల ఆదరాభిమానాలు గెలిచి ముఖ్యమంత్రిగా మరోసారి అయ్యారు.

ఇదే వైఎస్ఆర్ చనిపోయాక నాయకత్వ సమస్యతో కాంగ్రెస్ కుదేలైంది. ఏపీలో అధికారం కోల్పోయింది. వైఎస్ఆర్ లాంటి బలమైన నేత లేక రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారిని ప్రయోగించి కాంగ్రెస్ చేతులు కాల్చుకుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రగిలి ఉమ్మడి ఏపీ విడిపోవాల్సి వచ్చింది. అదే వైఎస్ఆర్ ఉండగా తెలంగాణ విభజన సమస్య రాలేదు. ఆయన టీఆర్ఎస్ ను కకావికలం చేసి ప్రత్యేకవాదనే లేకుండా చేశాడు. వైఎస్ఆర్ చనిపోయాకే తెలంగాణ ఏర్పాటుకు బీజం పడింది. కాంగ్రెస్ చతికిలపడింది.

వైఎస్ఆర్ హయాంలోనే ఎంతో మంది కొత్త నేతలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. ఆయన గాలిలో గెలిచినవారే నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్. వైఎస్ఆర్ దయతోనే ఆయన గెలిచారు. అంతకుముందు అసలు రాజకీయాలకు సంబంధం లేని మధుయాష్కీని రాజకీయల్లోకి రప్పించి టికెట్ ఇప్పించి గెలిపించాడు వైఎస్ఆర్.

ఇక వైఎస్ఆర్ చనిపోయాక నిజామాబాద్ లో రెండు సార్లు ఎంపీగా పోటీచేసిన మధుయాష్కీ గెలిచిన చరిత్ర లేదు. అసలు అక్కడ టీఆర్ఎస్, బీజేపీకి కూడా పోటీనివ్వలేక మూడోస్థానంలోకి మధుయాష్కీ పడిపోయాడు. ఇంతటి పాపులారిటీ లేని నేత నాడు గెలిచాడంటే కేవలం వైఎస్ఆర్ లాంటి బలమైన నాయకత్వం.. రెడ్డిల ఆధిపత్యమనే చెప్పాలి.

కాంగ్రెస్ లో ఇప్పుడు రెడ్డిలు, బీసీలకు మధ్య వార్ మొదలైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మంట పుట్టించాయి. రెడ్లకు పగ్గాలు అప్పగిస్తేనే పార్టీలకు మనుగడ అని 'రెడ్డి సంఘాల సమావేశంలో' రేవంత్ రెడ్డి అన్న మాటలు వైరల్ అయ్యాయి. దీనిపై సొంత పార్టీలోనే వ్యతిరేక గళం వినిపించింది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ తప్పుపట్టాడు. 'కాంగ్రెస్ అంటేనే అన్ని వర్గాల కలయిక అని.. టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేతగా జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఉండగా పార్టీ ఎందుకు ఓడింది. రేవంత్ వ్యాఖ్యలు దారుణం.. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని' మధుయాష్కీ అసమ్మతి రాజేశారు.ఇప్పుడు కాంగ్రెస్ లోని ఈ సంక్షోభం చర్చనీయాంశమైంది.

నాయకత్వం బలంగా ఉంటేనే పార్టీ మనుగడ సాధిస్తుంది. అది రెడ్డిలు అయినా.. వెలమ అయినా.. కమ్మ, కాపులు, బీసీలు అయినా సరే.. సరైన నాయకుడు కావాలి. అలాంటి నాయకులు జనంలోంచే వస్తారు. స్వతహాగా ఎదుగుతారు. సామాన్యుడైన కేజ్రీవాల్ నాయకత్వ లక్షణాలతో ఢిల్లీ రాష్ట్రంలో గెలిచి సీఎం అయ్యారు. పంజాబ్ లోనూ చేసి చూపించారు. అలాంటి నాయకత్వం కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి ఉంది. అందుకే అధిష్టానం గుర్తించింది. ఆయనను చూసి జనం ఓట్లు వేస్తారు. మిగతా నాయకులు ఇన్నాళ్లు ప్రయత్నించినా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురాలేకపోయారు. రేవంత్ మాత్రం బలమైన నేతగా ఆ సత్తా కలిగిన నేతగా ఉన్నారు.

అయితే రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న మధుయాష్కీకి కనీసం నిజామాబాద్ లోనూ డిపాజిట్ వచ్చే అవకాశం లేదు. అయినా ఆయన రేవంత్ రెడ్డిని రెడ్డిగా అగ్రవర్ణంగా చూపించి అసమ్మతి రాజేస్తున్నారు. రెడ్డిలు అయినా.. మిగతా వర్గాలు అయినా సరే జనాల్లో ఫేత్ పాపులారిటీ.. ప్రజాకర్షణ ఉంటేనే గెలుస్తారు. అంతేతప్ప కులాన్ని చూపించి ఓట్లు అడిగే రోజులు పోయాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్న మధుయాష్కీ పోనీ సొంతంగా గెలవగలడా? అంటే అదీ లేదు. మరి గెలిపించే రేవంత్ రెడ్డి లాంటి వారిపై ఎందుకు ఈ నానాయాగీ చేస్తున్నాడన్నది ప్రశ్న.