Begin typing your search above and press return to search.

శివ‌సేన ఊహించిన‌ట్టే షిండే ప్ర‌భుత్వంలో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయా?

By:  Tupaki Desk   |   24 July 2022 9:39 AM GMT
శివ‌సేన ఊహించిన‌ట్టే షిండే ప్ర‌భుత్వంలో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయా?
X
శివ‌సేన‌లో చీలిక సృష్టించి.. ఆ పార్టీకి ఉన్న మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 42 మందిని త‌న వైపుకు తిప్పుకున్నారు.. ఏక‌నాథ్ షిండే. ఈయ‌న కొట్టిన ఉద్ధ‌వ్ థాక‌రే త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. దీంతో బీజేపీతో క‌ల‌సి ఏక‌నాథ్ షిండే మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వాన్ని కూడా ఏర్పాటు చేసేశారు. దీనిపై శివ‌సేన చీఫ్ ఉద్ద‌వ్ థాక‌రే త‌న‌యుడు ఆదిత్య థాక‌రే, ఆ పార్టీ ముఖ్య నేత సంజ‌య్ రౌత్ మండిపడ్డ సంగ‌తి తెలిసిందే. షిండే-బీజేపీ ప్ర‌భుత్వం కొద్ది రోజుల్లోనే కుప్ప‌కూలిపోతుంద‌ని వారు జోస్యం చెప్పారు.

ఈ వ్యాఖ్య‌లు నిజ‌మ‌వుతాయ‌న్న‌ట్టు బీజేపీ మ‌హారాష్ట్ర అధ్య‌క్షుడు చంద్ర‌కాంత్ పాటిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏక‌నాథ్ షిండే ను ముఖ్య‌మంత్రిని చేయ‌డంపై బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాటిల్‌ తన అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ సందర్బంగా పాటిల్‌ మాట్లాడుతూ.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు బదులు శివసేన నేత ఏక్‌నాథ్ షిండే సీఎంగా బాధ్యతలు తీసుకోవాలని పార్టీ బరువెక్కిన గుండెతో నిర్ణయం తీసుకుందని అన్నారు. ఏక్‌నాథ్‌ షిండేకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడంపై తాము బాధపడ్డామని అన్నారు. మరో ఆప్షన్‌ లేకపోయినందువల్లే బీజేపీ అధిష్టానం నిర్ణయాన్ని అంగీక‌రించామ‌న్నారు. ఏకనాథ్ ను సీఎంను చేయ‌డంపై బీజేపీ నేతలందరూ కలత చెందరాని తెలిపారు.

అయితే, పార్టీ, ప్రభుత్వ స్థిరత్వాన్ని కాపాడటానికే ఏక‌నాథ్ షిండేను సీఎంను చేయాల‌నే నిర్ణ‌యం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌కాంత్ పాటిల్ వ్యాఖ్య‌లు ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో వైర‌ల్ గా మారాయి. రాష్ట్ర పార్టీ చీఫ్‌ అయిన పాటిల్‌ ఇలా సీఎంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలకు భారీ షాక్‌ తగిలింది.

కాగా మాజీ సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే ఆదిత్య థాక్రే జూలై 23న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం ఎంతో కాలం సాగదని, త్వరలోనే కూలిపోతుందని అన్నారు. కాగా, థాక్రే వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్ర‌కాంత్ పాటిల్ తన అసహనాన్ని బయటపెట్టార‌ని అంటున్నారు. కాగా మ‌హారాష్ట్రలో ప్ర‌స్తుతం ఏక‌నాథ్ షిండే ముఖ్య‌మంత్రిగా, మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద‌ర్ ఫ‌డ్న‌వీస్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు.