Begin typing your search above and press return to search.

కులం పట్టని పవన్ తో ప్రాణం పోయిందా?

By:  Tupaki Desk   |   1 Feb 2016 4:10 PM GMT
కులం పట్టని పవన్ తో ప్రాణం పోయిందా?
X
బాధ.. ఆవేదన కలిగితే చాలు.. వెనుకాముందు చూసుకోకుండా.. తమను నమ్మకున్న వారి గురించి ఆలోచించకుండా ఆత్మహత్యలు చేసుకోవటం ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా అలాంటి పరిణామమే చోటు చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు షాకింగ్ గా మారిన కాపు ఐక్య గర్జన ఉదంతం మర్చిపోక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. కాపులకు న్యాయం జరగటం లేదన్న ఆవేదనతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవటం సంచలనం సృష్టిస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ లో 53 ఏళ్ల చిక్కాల వెంకట రమణమూర్తి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవటం ఉద్రిక్తతకు దారి తీసింది. టవీ డిష్ యాంటెన్నాకు ఉరి వేసుకున్న అతన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో అతని జేబులో ఉన్న సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. తన ఆత్మహత్య గురించి సూసైడ్ నోట్ లో రమణమూర్తి పేర్కొన్న అంశాలు చూస్తే.. కాపుల్ని బీసీల్లోకి చేర్చాలని.. ఆ విషయంలో పవన్ కల్యాణ్ న్యాయం చేస్తారని తాను భావించానని.. అలాంటిది జరగలేదన్న ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రశ్నించే పార్టీ అని పవన్ చెప్పారని.. కానీ ప్రశ్నల్లేని పార్టీగా మిగిలిందని.. కాపు గర్జనతో అయినా న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కులం పట్టని పవన్ కల్యాణ్ ను కులం కోసం పోరాడాలని నమ్మకం పెట్టుకోవటం ఒక ఎత్తు అయితే.. తన నమ్మకం నిజం కాదని విలువైన ప్రాణాలు తీసుకోవటం పలువురిని విషాదంలో ముంచెత్తుతోంది. ఆత్మహత్య చేసుకున్న రమణమూర్తికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.