Begin typing your search above and press return to search.

చానల్ మార్చలేదని తండ్రిని దారుణంగా చంపేశాడు!

By:  Tupaki Desk   |   5 Oct 2019 5:15 AM GMT
చానల్ మార్చలేదని తండ్రిని దారుణంగా చంపేశాడు!
X
వినేందుకు విడ్డూరంగా ఉండటమే కాదు.. ఇదేం పోయే కాలమన్నట్లుగా అనిపించే ఉదంతం నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. టీవీ దగ్గర చాలా ఇళ్లల్లో చోటుచేసుకునే లొల్లే.. నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్ నివాసి అయిన పెరుమాల్ల గోవర్దన్ ఇంట్లోనూ జరిగింది. కానీ.. ఆ గొడవే తన ప్రాణాల్ని తీస్తుందని మాత్రం ఊహించలేకపోయాడు. నచ్చిన చానల్ చూస్తున్న ఆయనతో.. ఆయన కొడుకు గొడవ పడటం.. చివరకు ఆయన్ను దారుణంగా హతమార్చిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

65 ఏళ్ల గోవర్ధన్ నల్గొండ పట్టణంలో నివిస్తుంటాడు. ఆయన భార్య పదేళ్ల క్రితం మరణించారు. ఆయనకు కుమార్తె.. కొడుకు సతీశ్ ఉన్నారు. నాలుగేళ్ల క్రితం కుమార్తెకు పెళ్లి చేశారు. ఏడాది నుంచి తండ్రి కొడుకులు ప్రకాశం నగర్ లోని ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. గోవర్దన్ ఇంటి నిర్మాణంలో కూలీగా.. అతని కుమారుడు సతీశ్ మునుగోడు తహసీల్దార్ ఆఫీసులో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నాడు.

మద్యానికి బానిసైన సతీశ్ తండ్రి గోవర్దన్ తో తరచూ గొడవ పడేశాడు. తాజాగా ఫుల్ గా తాగి వచ్చిన సతీశ్.. పాత సినిమా పెట్టుకున్న తండ్రితో గొడవ పడ్డాడు. రిమోట్ ఇవ్వాలని.. చానల్ మార్చాలన్నాడు. అందుకు గోవర్దన్ ససేమిరా అనటం.. వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.

ఆవేశానికి గురైన సతీశ్ రోకలిబండతో తండ్రి తలపై బలంగా మోదటంతో గోవర్దన్ అక్కడిక్కడే కుప్పకూలాడు. రక్తం మడుగులో ఉన్న తండ్రి మంచంపైనే నిద్రపోయిన సతీశ్.. తర్వాత తన సోదరికి తండ్రి మరణించిన సమాచారాన్ని అందించాడు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో సతీశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణలో సతీశ్ హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.