Begin typing your search above and press return to search.

మంగళగిరి మంట : గంజిలో పడేదెవరు...?

By:  Tupaki Desk   |   10 Aug 2022 10:30 AM GMT
మంగళగిరి మంట : గంజిలో పడేదెవరు...?
X
మంగళగిరిలో మంటలు లేచాయి. ప్రతిపక్ష టీడీపీలోనే ఆ మంట రాజుకుంది. నిజానికి ఏపీలో ఉన్న 175 సీట్లలో మంగళగిరి కూడా ఒకటి. కానీ ఎపుడైతే లోకేష్ 2019 ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేశారో నాటి నుంచి మంగళగిరి ఏపీలో హాట్ ఫేవరేట్ సీటు అయి కూర్చుకుంది. 2024లో కూడా మరోసారి లోకేష్ అక్కడ నుంచే పోటీకి రెడీ అవుతున్న వేళ అందరి చూపు అటు వైపుగా ఉంది.

మొత్తానికి చూస్తే పొలిటికల్ ఫోకస్ ఈ సీటు మీద ఉందని చెప్పాలి. అలాంటి మంగళగిరి టీడీపీలో మంటలు రేగాయి. టీడీపీలో ఉన్న సీనియర్ నేత, బీసీ నాయకుడు అయిన గంజి చిరంజీవి ఆ పార్టీకి రాజీనామా చేసి పారేశారు. వెన్నుపోట్లతో తనను సొంత పార్టీ వారే పొగపెట్టి పంపేశారు అని ఆయన అంటున్నారు. తాను ఇక టీడీపీలో ఇమడలేనని చెప్పి మరీ ఆయన మీడియా ముందు మధనపడిపోయారు

ఈ నేపధ్యంలో ఆయన గుడ్ బై అంటూ సైకిల్ దిగిపోయారు. తాను తొందరలోనే వేరే పార్టీలో చేరుతాను అని కూడా హింట్ ఇచ్చారు. ఆ పార్టీ వైసీపీయే అని అంతా అంటున్నారు. ఇక చూస్తే గంజి చిరంజీవి చెనేత సామాజికవర్గానికి చెందిన నాయకుడు. ఆ సామాజికవర్గం మంగళగిరిలోచాలా ఎక్కువగా ఉంది. 2014 ఎన్నికల్లో ఆయనే టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి చేతిలో ఓడారు. అప్పటి నుంచి పార్టీని అక్కడ కాసుకుని వస్తున్నారు.

అయితే 2019 ఎన్నికల్లో తనకు టికెట్ వస్తుందనుకుంటే సడెన్ గా లోకేష్ ఎంట్రీ ఇచ్చి పోటీ చేశారు. దాంతో కొంత బాధపడినా భవిష్యత్తు ఉంటుందని ఆయన అనుకున్నారు. కానీ 2024లో కూడా మళ్లీ లోకేష్ ఇక్కడ నుంచే పోటీకి తయారు అంటూండండంతో ఇక భవిష్యత్తు మీద బెంగపెట్టుకుని ఆయన సైకిల్ దిగిపోయారు. ఈ నేపధ్యంలో ఆయన అన్న మాటలు పరిశీలిస్తే బీసీలు, ఎస్సీస్, ఎస్టీస్, మైనారిటీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలోకి వెళ్తాను అని అంటున్నారు. ఆయన చూపు వైసీపీ మీద ఉంది అంటున్నారు.

ఇక మంగళగిరి సీటు ఈసారి బీసీలకు అందునా చేనేత సామాజిక వర్గానికి ఇప్పించి లోకేష్ ని మళ్లీ ఓడించాలని వైసీపీ భారీ స్కెచ్ వేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి పట్ల జనంలో వ్యతిరేకత ఎక్కువగా ఉందని, ఆయనకు సైడ్ చేయాలని పార్టీ ఆలోచిస్తోందిట. అందువల్లనే గంజి చిరంజీవి సడెన్ గా రాజీనామా చేయడం అని అంటున్నారు. ఇక గంజి చిరంజీవి రాజీనామా ప్రభావం కచ్చితంగా నారా లోకేష్ గెలుపు మీద ఉంటుంది.

చేనేత కులస్థులకు బీసీలకు కేటాయించిన సీట్లో అగ్ర కులం వారి హవా ఏమిటి అన్న మాట కూడా వస్తుంది. అందుకే వైసీపీ ఇక్కడ బీసీ కార్డు తీసి గంజి చిరంజీవినే బరిలో పెట్టాలనుకుంటోందిట. అదే జరిగింతే ఆళ్ళకు టికెట్ హులఖ్కే అంటున్నారు. అంటే గంజి లో పడేది ఒకరు కాదు ఇద్దరు నేతలు అని అంటున్నారు. రేపటి రోజున వైసీపీ టికెట్ మీద గంజి పోటీ చేసి గెలిస్తే అటు లోకేష్, ఇటు ఆళ్ళ ఇద్దరూ కూడా చట్టసభలకు దూరం అవుతారు. మొత్తానికి గంజి డెసిషన్ వెనక వైసీపీ మాస్టర్ స్ట్రోక్ ఉందని అంటున్నారు.