Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : రోడ్డుపై చెప్పులు అమ్ముకుంటున్న లెక్కల మాష్టారు !

By:  Tupaki Desk   |   31 Aug 2020 3:00 PM IST
కరోనా ఎఫెక్ట్ :  రోడ్డుపై చెప్పులు అమ్ముకుంటున్న లెక్కల మాష్టారు !
X
కరోనా మహమ్మారి విజృంభణ తో విధించిన లాక్‌ డౌన్ తో అనేకమంది రోడ్డున పడ్డారు. ఉపాధి లేక.. . ఉద్యోగాలు లేక.. ఉన్న ఉద్యోగాలు పోయి కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులు కూడా గడ్డుకాలం ఎదురవుతోంది. విద్యాసంస్థలు మూతపడటంతో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. విజయవాడలోనూ అదే జరిగింది కరోనా లాక్‌ డౌన్ దెబ్బకు ఓ టీచర్ బతుకుచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.. కుటుంబ పోషణ కోసం రోడ్లపై చెప్పులు అమ్ముకుంటున్నారు.

విజయవాడకు చెందిన టి.వెంకటేశ్వరరావు లెక్కల టీచర్. ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయవాడలోని మూడు ప్రైవేటు స్కూళ్లలో వెంకటేశ్వరరావు పార్ట్ టైమ్ జాబ్ కింద గణితం బోధించేవారు.. ఇదే సమయంలో కరోనా ఆయన్ను కష్టాల్లోకి నెట్టేసింది.. ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కరోనా కారణంగా ఉన్న ఉపాధి దొరక్క కుటుంబ పోషణ కూడా కష్టతరంగా మారింది. దీనితో కుటుంబ పోషణ కోసం చెప్పులు అమ్మాలని నిర్ణయించుకున్నారు. విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో చెప్పులు అమ్ముతున్నారు. వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఐదు నెలల నుంచి జీతాలు లేవు.. చేతిలో రూపాయి ఆదాయం లేదు.. అప్పు పుట్టడం లేదు. దీంతో మరో మార్గం లేక ఇలా చెప్పులు అమ్ముకుంటున్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. ఈయన ఒక్కరే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులు ఎంతోమంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.