Begin typing your search above and press return to search.

‘కాళేశ్వరం’పై వేడేక్కుతున్న రాజకీయం..:

By:  Tupaki Desk   |   27 July 2022 7:28 AM GMT
‘కాళేశ్వరం’పై  వేడేక్కుతున్న రాజకీయం..:
X
భారీ వర్షాల కారణంగా ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చింది. దీంతో ఎత్తిపోతలకు సంబంధించిన మోటార్లు పనిచేయకుండా మారాయి. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి చోటు చేసుకుందని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ఆ ప్రాజెక్టు కేసీఆర్ కోసమే కట్టుకున్నారని ఆరోపిస్తున్నారు.

ఇందులో భాగంగా ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తన నియోజకవర్గంలో ఉన్న ప్రాజెక్టు సందర్శనకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాళేశ్వరంలో కచ్చితంగా అవినీతి జరిగిందని, అది బయటపడుతుందనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇక తాజాగా హైదరాబాద్ లో తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ‘కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజోపయోగమా..? దుర్వినియోగమా..? ‘వాస్తవాలు-వక్రీకరణాలు’ అనే అంశంపై చర్చ నిర్వహించారు. ఈ చర్చలో అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువరు వక్తలు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతమైన ఇంజనీర్లతో నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఏం సమాధానం ఇస్తారోనని అన్నారు.

ఈ ప్రాజెక్టును నిర్మించిన మెగా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిపుణులైన ఇంజనీర్లతో, తెలంగాణ బుద్ది జీవులతో సమీక్ష చేపట్టాలని అన్నారు. ఈ సమీక్షకు తెలంగాణలోని అఖిలపక్షం నాయకులు కలిసి రావాలని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి పిలుపునిచ్చారు. కాళేశ్వరం అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించిన తరువాత అఖిలపక్ష సభ్యులు పలు తీర్మానాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్లో చేసిన తప్పిదాల వల్లే ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణాలు కూలిపోయాయన్నారు. అలాగే పంప్ హౌస్ లోకి నీళ్లు వచ్చాయన్నారు. దీనికి బాధ్యత వహించిన మెగా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గోదావరి, కృష్ణా నదులపై నిర్మాణాలను తన చేతిలోకి తీసుకుంటూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడతున్న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు.

పోలవరం ఎత్తు తగ్గించాలని, ఆదివాసీల ముంపు సమస్యలు నివారించాలని తీర్మానాలు చేశారు. అలాగే ఏపీలోని 7 మండలాలను తెలంగాణలో కలపాలన్నారు. రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై గళమెత్తాలని తీర్మానించారు. కేంద్రంలో కొందరు కాళేశ్వరం ప్రాజెక్టును అభినందించారని.. మరికొందరు ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమంటున్నారు.. ఇలాంటి ద్వంద్వ వైఖరిని వీడాలని తీర్మానించారు. ఇలా చేయడం తెలంగాణకు అన్యాయం చేసినట్లేగా..? అని ప్రశ్నించారు.